ప్రతి రైతుకు మంచి జరగాలన్నదే నా తపన..తాపత్రయం

రైతు భరోసా ప్రారంభోత్సవంలో సీఎం  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 

 

మీకు సేవ చేసేందుకే నేనున్నది

నా పాదయాత్రలో రైతుల కష్టాలు కళ్లారా చూశా

చెప్పినదానికన్నా ముందుగా.. మాటిచ్చిన దానికన్నా మిన్నగా

వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం

మే నెలలో రూ.7500, అక్టోబర్‌లో రూ.4 వేలు, సంక్రాంతికి రూ.2 వేలు

రూ.12,500 సాయాన్ని రూ.13,500 పెంచాం

కౌలు రైతు కుటుంబాలకు సాయం అందిస్తున్నాం

ప్రతి రైతు కుటుంబానికి ఐదేళ్లలో రూ.67,500 ఇవ్వబోతున్నాం

గత ఐదేళ్లలో లక్షల రైతు కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయాయి

పంట బీమా ప్రీమియం బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంది

6.62 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రాయితీపై పంపిణీ చేశాం

రైతు కుటుంబం బాగుండడమే అభివృద్ధి

కల్తీ మహమ్మారిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం

పెండింగ్‌లో ఉన్న ప్రతి ఇరిగేషన్‌ ప్రాజెక్టును పూర్తిచేస్తాం

 
నెల్లూరు: ప్రతి రైతుకు మంచి జరగాలన్నదే తన తపన, తాపత్రయమని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. అన్నదాతల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఏడాదికి రూ.13,500 ఆర్థిక సహాయం ఇచ్చే ‘వైయస్‌ఆర్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌’ పథాకాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.   శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం కాకుటూరు గ్రామంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతు భరోసా పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు.  ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడారు..ఆయన ఏమన్నారంటే..సీఎం మాటల్లోనే.. 

అన్నా..బాగునున్నారా..వర్షాలు బాగా పడ్డాయా? నాన్నగారి హయాంలో అప్పట్లో ఎప్పుడో చూశాం. సోమశీలలో 70 టీఎంసీల నీరు చూశాం. మళ్లీ 15 ఏళ్ల తరువాత ఇవాళ అంతకన్న ఎక్కువ 75 టీఎంసీల నీళ్లు చూశామని రైతన్న నోటి నుంచి వస్తున్న మాటలు వింటే సంతోషంగా ఉంది. ఇదే కండలేరు ప్రాజెక్టు నుంచి నీరు వెళ్తోంది. రైతులకు మంచి చేయాలని ఈ ప్రభుత్వం ఉంది. అందుకే దేవుడు కూడా నిండు మనసుతో దీవిస్తున్నారు. మన ప్రభుత్వం రైతులను గుండెల్లో పెట్టుకుందని చెప్పడానికి ఇవాళ ఇక్కడి నుంచి రైతు భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతి రైతు చరిత్రను మర్చేందుకు గొప్ప పథకానికి ఇవాళ నాందీ పలుకున్నాం. రైతులకు అత్యధికంగా సాయం అందించే పథకాన్ని ఇక్కడికి వచ్చానని సగర్వంగా చెబుతున్నాను. రేపు ప్రపంచ ఆహార దినోత్సవం. అన్నం పెట్టే రైతు గురించి ఆలోచన చేస్తూ ఒక రోజు ముందే రైతు భరోసా అన్న కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మరి కొద్దిసేపట్లోనే రైతు భరోసా సొమ్ము రైతులు, కౌలు రైతుల ఖాతాలోకి జమా అవుతుంది. ఈ పథకాన్ని ప్రారంభించడం నా అదృష్టంగా, దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను.

2014 తరువాత రైతులు విలవిలలాడారు. బ్యాంకు గడప తొక్కాలంటే రైతులు ఇబ్బంది పడ్డారు. రైతుల బాధలు నా పాదయాత్రలో చూశాను. గత ప్రభుత్వం రైతులకు ఏమీ ఇవ్వకుండా అన్యాయం చేసింది. పంట గిట్టుబాటు ధరలు కల్పించలేదు. విపత్తలు వచ్చిన సమయంలో గత ప్రభుత్వాలు సాయం చేసేందుకు మనసు లేదు. విడిపిస్తానన్న బంగారం కూడా విడిపించకుండా ఆ బంగారం వేళం వేసిన రోజులు కూడా నా పాదయాత్రలో చూశాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే..మరో ఎత్తు ఐదేళ్ల చంద్రబాబు పాలనలో వర్షాలు కూడా లేక రైతులు అల్లాడిపోయారు. లక్షల రైతు కుటుంబాలు సర్వం కోల్పోయాయి. అన్నం పెట్టే రైతులు అప్పులబాధతో ఆత్మహత్యలు చేసుకున్నారు. 50 శాతం రైతులకు కేవలం అర హెక్టార్‌లోపే మాత్రమే ఉన్నారు. మన రాష్ట్రంలో ఒక హెక్టార్‌ భూమి ఉన్న ఎంత మంది అని చూస్తే..ఆ సంఖ్య 70 శాతం మాత్రమే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పుడు 2017 నా పాదయాత్రకు ముందుకు జులై 8న మన పార్టీ ప్లీనరీ సమావేశంలో నేను రైతులకు ఒక మాట చెప్పాను. ఆ మాటను 2017 జులై 8న చెప్పాను. ఆ ప్లీనరీలో ఏం చెప్పానో ఒక్కసారి చూడండి."ఐదేకరాలలోపు రైతులందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.50 వేలు ఇస్తామని చెబుతున్నాను''. ఏటా రూ.12,500 మే నెలలో ఇస్తామని మాట ఇస్తున్నాను. మేమిచ్చే ఈ డబ్బు ఏ బ్యాంకు జమా చేసుకోకుండా రైతుల చేతికే ఇస్తాం.

Read Also: వైయస్‌ఆర్‌ రైతు భరోసా చెక్కుల పంపిణీ

ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి లేకుండా వైయస్‌ఆర్‌ రైతు భరోసా కింద రైతులకు ఇస్తున్నాను. ఈ డబ్బుతో ఏం చేస్తారో ఆ రైతు ఇష్టానికి వదిలేస్తాం. ఎలా చేస్తామన్నది రైతులకే వదిలేస్తాం. వైయస్‌ఆర్‌ భరోసాగా ఈ పథకాన్ని అమలు చేస్తామని ఆ రోజు మాట ఇచ్చాను. పాదయాత్ర జరుగుతుండగా రైతులకు ప్రతి అడుగులోనూ భరోసా కల్పిస్తూ ..కష్టకాలం పోతుంది.మంచి రోజులు వస్తున్నాయి. మీ బిడ్డగా, మీ అన్నగా ఉంటానని, నేను ఉన్నాను..నేను విన్నానన్న మాటలు..అధికారంలోకి వచ్చిన తరువాత భరోసాగా రైతు భరోసా కింద రూ.12,500 అందిస్తామని చెప్పాను. మన పార్టీ కేవలం రెండే పెండు పేజీల్లో ప్రచురించిన మేనిఫెస్టోలో మొట్ట మొదటి వాగ్దానంగా ప్రకటించాం. అధికారంలోకి వచ్చిన వెంటనే నా మేనిఫెస్టోను భగవత్గీత, బైబిల్‌, ఖురాన్‌గా భావిస్తానని చెప్పాను. ఈ రోజు నెల్లూరులో మీ అందరి సమక్షంలో ఆ వాగ్ధానాన్ని చెప్పినదానికన్న ముందుగా, మాటిచ్చిన దానికన్నా మిన్నగా, రైతు సంఘాల కోరిక మేరకు వ్యవసాయ మిషన్లో పెద్దలను ఒప్పించి రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం. అక్షరాల చెప్పిన దానికన్న 8 నెలల ముందుగానే ఈ పథకాన్ని తీసుకువస్తున్నాం. రేపటి సంవత్సరం నుంచి ఖరీఫ్‌ పంట వేసే సమయానికి మే నెలలోనే 7500, అక్టోబర్‌ మాసంలో మరో నాలుగు వేలు, ధాన్యం ఇంటికి చేరే వేళ రైతు పండుగ సంక్రాంతి సందర్భంగా మరో రూ.2 వేలు ఇవ్వబోతున్నామని చెబుతున్నాను. అక్షరాల రూ.12,500ను మార్చి రూ.13,500 ఇస్తున్నాం.

గతంలో మన మేనిఫెస్టోలో రూ.50 వేలు ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా రూ.67,500లకు పెంచి ఇవ్వబోతున్నామని సగర్వంగా చెబుతున్నాను. చెప్పినదానికన్న మెరుగ్గా చేయగలుగుతున్నామని, మాటమీద నిలబడి చేస్తున్నందుకు ఆశీర్వదించమని మీ బిడ్డగా కోరుతున్నాను. ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీలుఅగ్రకులాల వారికి, భూమి లేని నిరుపేదలకు కూడా మంచి చేయాలన్న ఆరాటంతో ఈ పథకం అమలు చేస్తున్నాం. అక్షరాల 43 లక్షల మంది రైతులను గత ప్రభుత్వం సాధికారిక లెక్కలతో చెప్పింది. మన ప్రభుత్వం పారదర్శకంగా అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేసేందుకు గ్రామ వాలంటీర్ల ద్వారా పూర్తిగా సర్వే చేస్తూ మరో లక్షన్నర కుటుంబాలను పెంచుతున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లో భూమి లేని నిరుపేదలను కౌలు రైతులుగా గుర్తించి ఈ పథకం వర్తింపజేస్తున్నాం.మేలు చేసే అవకాశం భగవంతుడు ఇచ్చాడని సగర్వంగా చెబుతున్నాను. ఇక్కడి నుంచి బటన్‌ నొక్కిన వెంటనే మరో మీ ఖాతాల్లో జమా అవుతాయి. ఇంకా రూ.2 వేలు సంక్రాంతి రోజు ఇస్తాం. ప్రభుత్వ ఖజానాలో ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పినదాని కంటే మెరుగ్గా రైతులకు మేలు చేస్తున్నాం.

అన్నం పెట్టే ప్రతి రైతుకు అండగా ఉంటాం. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను ఒ క్కొక్కటిగా అమలు చేస్తున్నాం. పగటి పూట కరెంటు ఇవ్వాలని చెప్పాం. వెంటనే అధికారులు 60 శాతం ఫీడర్లకు కరెంటు ఇస్తున్నారు. దానికి రూ.1700 కోట్లు ఖర్చు అవుతుందని చెబితే..ప్రభుత్వం ముందుకు వచ్చింది. మిగిలిన మరో 40 శాతం ఫీడర్లలో వచ్చే జూన్‌ నాటికి నిధులు కేటాయించి అందరికీ వంద శాతం ఫీడర్లలో 9 గంటల పాటు ఉచితంగా పగటి పూట విద్యుత్‌ ఇస్తామని మాట ఇస్తున్నాను. పంటల భీమా కోసం రూ.2164 కోట్లు రైతుల తరఫున ప్రభుత్వమే ప్రిమియం చెల్లిస్తుంది. భూ యజమానులకు ఇబ్బంది లేకుండా కౌలు రైతులకు ఉపశమనం కల్పిస్తూ 11 నెలలు మాత్రమే కౌలు దారులకు హక్కు కల్పిస్తూ మొట్ట మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే కౌలుదారుల చట్టం తీసుకురాగలిగామని సగర్వంగా చెబుతున్నాను. గత ప్రభుత్వంలో వడ్డీలేని రుణాలు లేవు. పావలా వడ్డీ రుణాల ఊసే లేదు. లక్షలోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు పూర్తిగా వడ్డీ మాఫీ చేస్తూ ..ఆ వడ్డీ సొమ్మును వైయస్‌ఆర్‌ వడ్డీ పథకం కింద చెల్లిస్తాం. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నాం. రైతులు ఇబ్బందులు పడకూడదని, ముఖ్యమంత్రి స్థానంలో మీ అన్న ఉన్నాడని భరోసా కల్పిస్తున్నాం. రికార్డుస్థాయిలో రాయితీపై విత్తనాలు పంపిణీ చేశాం.

రబీకి కావాల్సిన విత్తనాలు సిద్ధం చేశాం. ఇదే పక్క రాష్ట్రాల్లో యూరియా కొరత వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కానీ, మన రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేకుండా అమలు చేయగలిగాం. కరువుల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. చిరుధాన్యాలను ప్రోత్సహించేందుకు బోర్డు ఏర్పాటు చేస్తున్నాం. ధాన్యం సేకరణలో గత ప్రభుత్వం బకాయిలు పెడితే..ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా బకాయిలు కూడా మన ప్రభుత్వమే తీర్చింది. ఇన్‌ఫుట్‌ సబ్సిడీ బకాయిలు కూడా రైతులకు తోడుగా ఉండేందుకు ఆ బకాయిలు తీర్చుతామని మాట ఇస్తున్నాను. కష్టాల్లో ఉన్న శనగ రైతులను ఆదుకునేందుకు మొట్ట మొదటి నెలలోనే సంతకాలు చేశాను. పామాయిల్‌ రైతులు, పొగాకు రైతులకు రేట్లు పెంచేందుకు చర్యలు తీసుకున్నాం. ప్రమాదవశాత్తు రైతు ఆత్మహత్య చేసుకుంటే గతంలో ఎవరూ పట్టించుకోలేదు. ఈ రోజు అలాంటి రైతు కుటుంబం వద్దకు కలెక్టర్‌ వస్తున్నారు. రూ.7 లక్షల పరిహారం ఇచ్చి అండగా ఉంటున్నాం. అక్వా రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాం. ఆవులు, గేదెలను గతంలో పట్టించుకునే నాథుడు లేడు.

మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆవులు, గేదెలు మరణిస్తే వాటికి కూడా రూ.15 వేల వరకు పరిహారం ఇచ్చే కార్యక్రమానికి నాంది పలికాం. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్సీలు ప్రభుత్వమే చెల్లిస్తోంది. అభివృద్ధి అంటే జీడీపీ లెక్కలు మాత్రమే కాదు. రైతు కుటుంబం బాగుంటేనే రాష్ట్రం బాగుటుందని మీ బిడ్డ భావిస్తాడు. రైతు ఆనందంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందని నమ్మిన వ్యక్తిని. నిన్నటి కన్న ఈ రోజు మన పరిస్థితి మెరుగ్గా ఉంటేనే మనం అభివృద్ధి చెందినట్లుగా నాన్నగారు చెప్పేవారు. ప్రతి విషయంలోనూ ఇదే జరుగుతుంది. రైతుల వద్దకే నేరుగా మీ గ్రామ సెక్రటేరియట్‌ వద్ద నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు ఏర్పాటు చేస్తాం. ఎవరు కూడా కల్తీ విత్తనాలు, ఎరువులు తీసుకొని నష్టపోకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యం. ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి మండలంలోనూ గిడ్డంగులు, కోల్డు స్టోరేజీలు ఏర్పాటు చేస్తాం. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటుకు అధ్యాయం చేస్తున్నాం.

జలయజ్ఞం గురించి చెప్పాల్సిన పని లేదు. గత ప్రభుత్వం జలయజ్ఞం పేరుతో దోచుకుంది. మన ప్రభుత్వం పారదర్శకంగా రివర్స్‌టెండరింగ్‌ తీసుకువచ్చాం. ప్రజాధనాన్ని ఆదా చేసే కార్యక్రమాలు చేపట్టాం. పెండింగ్‌లో ఉన్న ప్రతి ప్రాజెక్టును పూర్తి చేస్తాం. సింహపూరి ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. 10కి పది ఎమ్మెల్యే స్థానాలు, రెండు ఎంపీ స్థానాలు నాకిచ్చారు. వైయస్‌ఆర్‌సీపీని ఆదరించారు. ఇక్కడి ప్రజలకు ఏమి ఇచ్చినా కూడా తీర్చలేనిదని, మీ రుణం తీర్చుకోవడానికి మీ జిల్లా వ్యక్తిని ఇరిగేషన్‌ మంత్రిని చేశాను. ప్రతి ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తాం. ఈ జిల్లా నుంచి ఇరిగేషన్‌ మంత్రిని చేశానంటే పెండింగ్‌లో ఉన్న ప్రతి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఈ పని చేశాను. మీ అందరి రుణం తీర్చుకునే అవకాశం దేవుడు నాకిచ్చాడు. మీ బిడ్డ మీ రుణం కచ్చితంగా తీర్చుకుంటాడని చేతులు జోడించి చెబుతున్నాను. రైతు భరోసా కింద ప్రతి రైతుకు సొమ్మును అందజేస్తున్నాం. మిగిలిన 14 లక్షల మంది రైతులకు కూడా ప్రతి వారం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అప్‌డెట్‌ చేస్తూ రైతు భరోసా సొమ్మును చెల్లిస్తాం.

ఎవరైనా మిగిలి ఉంటే నవంబర్‌ 15వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంఆర్‌వో కార్యాలయాల్లో కూడా జాబితాను అందుబాటులో ఉంచుతాం. మిగిలిన వారు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి గురువారం పేవ్‌మెంట్‌ అప్‌డెట్‌ అవుతుంది. నా తపన, నా తాపత్రయం ప్రతి రైతుకు మంచి జరగాలన్నదే. మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎవరికైనా డబ్బులు రాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. జాబితా చూసుకోండి. అర్హతలు కూడా అందుబాటులో ఉంచుతాం. వెంటనే నమోదు చేసుకోండి. నేరుగా మీ ఖాతాలోనే డబ్బు వచ్చి పడుతుందని ప్రతి రైతుకు చెబుతు..రైతు భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. మీ అందరి ఆశీస్సులు మీ బిడ్డపై ఉండాలని, మీ బిడ్డ మీకు సేవ చేసేందుకు వచ్చాడని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని, మీ ఆప్యాయతలకు పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా...

Read Also: వైయస్‌ఆర్‌ రైతు భరోసా చెక్కుల పంపిణీ

తాజా వీడియోలు

Back to Top