పల్లెల్లోనే అత్యుత్తమ వైద్య సేవలు

 ఆసుప‌త్రుల్లో నాడు-నేడుపై సీఎం వైయ‌స్ జగన్‌ సమీక్ష

రూ. 16,270 కోట్ల అంచనాతో వైద్య, ఆరోగ్యశాఖలో నాడు – నేడు కింద పనులు

నాడు – నేడు కింద వైయస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్, వైయస్సార్‌ అర్బన్‌ క్లినిక్స్, పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు

ప్రస్తుతం ఉన్న వైద్యకళాశాలల్లో అభివృద్ధి పనులు, కొత్త వైద్య కళాశాలల నిర్మాణం

తాడేప‌ల్లి:  ప్రజలకు చేరువగా, నేరుగా పల్లెల్లోనే అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా విధానం ఉండాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీని సమర్థవంతంగా అమలు చేయాలని ఈ సందర్భంగా మరోసారి పునరుద్ఘాటించారు. వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడుపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్‌  మాట్లాడుతూ..  పాత వైద్యకళాశాల్లో అభివృద్ధి పనులు, కొత్త కాలేజీల నిర్మాణాలకు సంబంధించి ఏప్రిల్‌  15 కల్లా టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి. ఆస్పత్రులకోసం భూ సమీకరణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. ఆ తర్వాత పనులు చురుగ్గా మొదలుపెట్టాలన్నారు. భవనాలను కట్టడమే కాదు, వాటిని మెరుగ్గా నిర్వహించడం, పరిశుభ్రంగా ఉంచడం అన్నది చాలా ముఖ్యమని తెలిపారు. ఆస్పత్రులు కట్టిన తర్వాత వాటిని నిర్లక్ష్యం చేయడకూడదని.. దీనికోసం ప్రత్యేక కార్యాచరణ, ప్రణాళిక తయారు చేయాలన్నారు. నిర్దేశిత సమయంలో తీసుకోవాల్సిన చర్యలతో కూడిన ప్రణాళికను సిద్ధం చేయాలని.. పరిపాలనా అనుమతులు, అవసరమైన సిబ్బంది నియామకాల కోసం చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నలకు అధికారులు జవాబిస్తూ.. 10,011 వైయస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌ కల్లా పూర్తిచేయడానికి చురుగ్గా పనులు చేస్తున్నామని వివరించారు.1133 పీహెచ్‌సీల్లో 151 కొత్తవాటి నిర్మాణం, 982 పాతవాటి పునరుద్ధరణ పనులను అక్టోబరు కల్లా పూర్తిచేస్తున్నామని తెలిపారు.  ఏరియా ఆస్పత్రుల్లో నాడు – నేడు పనులను డిసెంబర్‌ కల్లా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని.. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, కొత్త వైద్య కళాశాలల నిర్మాణం, ఉన్న వాటి పునరుద్ధరణ తదితర పనులు రూపేణా 3.1 కోట్ల చదరపు అడుగుల మేర నిర్మాణాలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. బీజింగ్‌ ఎయిర్‌పోర్టుతో పోలిస్తే నాలుగు రెట్లకుపైగా, బుర్జ్‌ ఖలీఫా భవనం కన్నా ఆరు రెట్లకు పైగా నిర్మాణాలతో సమానమని వివరించారు. అనంతరం కోవిడ్‌పై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించగా.. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 99.04 శాతం.. మరణాల రేటు రూ. 0.81 శాతమని.. రాష్ట్రంలో 1.30 కోట్ల పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు  పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న కోవిడ్‌ వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి ఆరా తీయగా.. దానికి సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు.

ఆరోగ్య శ్రీ రిఫరెల్‌ వ్యవస్థపై  సమీక్ష
విలేజ్, అర్బన్‌ హెల్త్‌క్లినిక్స్‌లో ఉన్నవారికీ, పీహెచ్‌సీల్లో ఉన్న సిబ్బందికి శిక్షణపై సీఎం జగన్‌ వివరాలు కోరారు. రిఫరెల్‌ వ్యవస్థసై తగిన అవగాహన, పరిజ్ఞానం సిబ్బందికి వచ్చేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. ఆశావర్కర్లకు కూడా అవగాహన కల్పించాలన్న సీఎం తెలిపారు. అనంతరం రిఫరెల్‌ వ్యవస్థకు సంబంధించి ఏఎన్‌ఎం, ఆరోగ్య మిత్రలు ఏం చేయాలన్న దానిపై వర్క్‌ఫ్లోను అడిగి తెలుసుకున్నారు. ఎంపానల్డ్‌ ఆస్పత్రులపై పూర్తి అవగాహన ఉండాలని, రోగులకు సరైన మార్గనిర్దేశం చేసేలా సిబ్బందిని తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్యంకోసం పెద్ద మొత్తంలో పేదలు డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి తలెత్తకూడదని.. వేయి రూపాయల దాటితే ఉచితంగా చికిత్స అందించాలనే ప్రభుత్వ విధానం సమర్థవంతంగా అమలు కావాలంటే... సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించడం చాలా అవసరమన్నారు. ఆరోగ్యశ్రీలో లబ్ధిదారుల ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలన్నారు. ఆరోగ్య ఆసరా అందిందా లేదా తనిఖీ చేయాలని.. ఎంపానెల్‌ ఆస్పత్రిలో ఏదైనా సమస్యవస్తే రియల్‌ టైం డేటా ఉన్నతస్థాయికి రావాలని పేర్కొన్నారు. దీనికోసం ప్రత్యేకంగా యాప్‌ రూపొందించామన్న అధికారులు తెలపగా.. ప్రతి ఆరోగ్య మిత్ర వద్దా తప్పనిసరిగా ఫోన్‌ ఉంచాలని అధికారులను జగన్‌ ఆదేశించారు. 104, 108 వాహనాలు ఎప్పటికీ కొత్తగానే కనిపించాలని జగన్‌ పేర్కొన్నారు.  వాటి నిర్వహణలో ఎప్పుడూ రాజీ పడొద్దని.. వాహనాల కండిషన్, వాటి నిర్వహణ అత్యంత ముఖ్యమని అధికారులకు వివరించారు.

పల్లెకు డాక్టర్ల వ్యవస్థపై ఆరా..
అనంతరం పల్లెకు డాక్టర్ల వ్యవస్థలపై సీఎం వైయ‌స్ జగన్‌ సమీక్ష నిర్వహించగా.. గతంలో ఇచ్చిన ఆదేశాలపై వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలను అధికారులు వివరించారు. ఇతర రాష్ట్రాల్లోని వ్యవస్థలను, వారి ఆలోచనలను పరిగణలోకి తీసుకుని మార్గదర్శకాలు తయారు చేయాలని సీఎం పేర్కొన్నారు.  ఆరోగ్య శ్రీ కింద సేవలు అందించడంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని, క్రమం తప్పకుండా ఎంప్యానెల్‌ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించేలా చూడాలన్నారు.

ప.గో.జిల్లా పూళ్ల, కొమరవోలు గ్రామాల్లో ప్రజలు అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన ఘటనలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రఖ్యాత సంస్థల పరీక్షలు, వాటి ఫలితాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు సురక్షితమంటూ పరీక్షా ఫలితాలు వచ్చాయని.. దీంతోపాటు  పూళ్లలో ఆహార పదార్థాలు కూడా సురక్షితమేనంటూ ఫలితాలు వచ్చాయని అధికారులు జగన్‌కు వివరించారు.  కొమరవోలులో ఆహార పదార్థాలపై పరీక్షల ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని  సీఎంకు పేర్కొనగా.. ప్రజలు అస్వస్ధతకు గురైన గ్రామాల్లో ధైర్యాన్నిచ్చే ప్రయత్నాలు చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్‌ విజయవంతమైన చిన్నారులను క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌కు పరిచయం చేశారు. ఆపరేషన్‌ అనంతరం చిన్నారుల ఆరోగ్యం ఎలా ఉందంటూ పిల్లల తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఎం టి కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వీసీ అండ్‌ ఎండీ వి విజయరామరాజు, ఆరోగ్యశ్రీ సీఈఓ ఎ మల్లిఖార్జున, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Back to Top