స్కూళ్ల‌లో ప్ర‌తి నెలా ఆడిట్ జ‌ర‌గాలి

ఉన్న‌తాధికారుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

స్కూళ్లలో కల్పించిన సౌకర్యాలు ఎప్ప‌టిక‌ప్పుడు పరిశీలన చేయాలి

స్కూళ్ల మెయింటెనెన్స్‌ ఫండ్ ద్వారా నిర్వహణలో తేడాలు లేకుండా చూడాలి

స్కూళ్లలో స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై 14417 టోల్‌ ఫ్రీ నంబ‌ర్ ఏర్పాటు 

వ‌చ్చేఏడాది స్కూళ్లు తెరిచేనాటికి పిల్ల‌ల‌కు విద్యాకానుక కిట్లు

విలేజ్‌ క్లినిక్‌ పరిధిలోకి గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీటి నాణ్యత నిర్ధారణ

స్కూళ్ల నిర్వహణలో సచివాలయ ఉద్యోగులు భాగ‌స్వామ్యం

మార్చి నాటికి తొలిదశలో తరగతి గదుల డిజిటలైజేషన్ జరగాలి

డిజిటల్‌ లైబ్రరీలు, సచివాలయం, ఆర్బీకే, విలేజ్‌ క్లినిక్స్‌లో ఇంటర్నెట్‌ సదుపాయం

పాఠ‌శాల విద్యాశాఖ‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేపల్లి: `మ‌న‌బ‌డి నాడు–నేడు` కింద పనులు పూర్తయిన స్కూళ్లపై నిరంత‌రం ఆడిట్ చేయాల‌ని, ప్ర‌తి నెలా ఆడిట్ కొన‌సాగాల‌ని సంబంధిత మంత్రి, అధికారుల‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశించారు. స్కూళ్ల‌లో క‌ల్పించిన సౌక‌ర్యాలు బాగున్నాయా.. లేదా అని ప‌రిశీలించాల‌ని సూచించారు.  అవసరమైన చోట వెంటనే పనులు, మరమ్మతులు చేయించాల‌ని ఆదేశించారు. వచ్చే జూన్‌లో విద్యాకానుక అందేలా కార్యాచరణ రూపొందించాల‌న్నారు. యూనిఫామ్స్‌ కుట్టు చార్జీలను విద్యాకానుక ఇచ్చేరోజే తల్లుల ఖాతాల్లో జమ చేయాల‌న్నారు. స్కూళ్ల నిర్వహణపై పేరెంట్స్‌ కమిటీలతో ఎప్ప‌టిక‌ప్పుడు సమావేశాలు నిర్వహించాల‌ని ఆదేశించారు. గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీటిలో నాణ్యత నిర్ధారణ అంశాలను విలేజ్‌ క్లినిక్‌ పరిధిలోకి తీసుకురావాలని చెప్పారు. పాఠ‌శాల విద్యాశాఖ‌పై తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా విద్యాకానుక ప‌థ‌కం కింద పిల్ల‌ల‌కు ఇచ్చే స్కూల్ బ్యాగుల నాణ్య‌త‌ను సీఎం ప‌రిశీలించారు. అనంత‌రం అధికారుల‌కు ప‌లు అంశాల‌పై దిశానిర్దేశం చేశారు.
 
ఈ సందర్భంగా సీఎం వైయ‌స్‌ జగన్‌ ఏమన్నారంటే..
`నాడు-నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లపై నిరంతరం ఆడిట్‌ చేయాలి. ప్రతి నెలకు ఒకసారి ఆడిట్‌ చేయాలి. స్కూళ్లకు కల్పించిన సౌకర్యాలు బాగున్నాయా? లేదా? అన్నది పరిశీలన చేయాలి. అవసరమైన చోట వెంటనే పనులు, మరమ్మతులు చేయించాలి. స్కూళ్ల మెయింటెనెన్స్‌ ఫండ్‌ను వాడుకుని స్కూళ్ల నిర్వహణలో ఎలాంటి తేడాలు లేకుండా చూడాలి. ఎలాంటి సమస్యలున్నా తెలియజేయడానికి వీలుగా ఒక నంబర్‌ను స్కూళ్లలో ప్రదర్శించాలి. ఈ నంబర్‌కు సంబంధించి బోర్డులు ఏర్పాటు చేయాలి`. 14417 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశామని అధికారులు సీఎంకు వివ‌రించారు.  

విద్యా కానుకపై సమీక్ష..
వచ్చే ఏడాది జూన్‌లో స్కూళ్లు తెరిచే నాటికి పిల్లల చేతికి విద్యాకానుక కిట్లు కచ్చితంగా అందించాలి. యూనిఫామ్స్‌ కుట్టు ఛార్జీలను విద్యాకానుక ప్రారంభం రోజునే తల్లుల ఖాతాల్లోకి జ‌మ చేయాలి. స్కూళ్ల నిర్వహణలో పేరెంట్స్‌ కమిటీలను నిరంతరం యాక్టివేట్‌ చేయాలి. స్కూళ్ల అభివృద్ధి, నిర్వహణలపై తరచుగా వారితో సమావేశాలు నిర్వహించాలి. గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీటిలో నాణ్యత నిర్ధారణ అంశాలను విలేజ్‌ క్లినిక్‌ పరిధిలోకి తీసుకురావాలి. వీటిపై ఎప్పకప్పుడు విలేజ్‌ క్లినిక్‌ ద్వారా నివేదికలు పంపించాలి. నివేదికలను అనుసరించి తగిన చర్యలు తీసుకోవాలి. దీంతో పారిశుద్ధ్య లోపం వల్ల, నీటిలో నాణ్యతా లోపం వల్ల వచ్చే రోగాలను చాలావరకు నివారించడానికి అవకాశం ఏర్పడుతుంది. 

సీఎం ఆదేశాల మేరకు స్కూళ్ల నిర్వహణలో సచివాలయ ఉద్యోగులు భాగ‌స్వామ్యం కానున్నారు. ప్రతివారం స్కూళ్లను వెల్ఫేర్‌ మరియు ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్, మహిళా పోలీసు సందర్శన. నెలకోసారి ఏఎన్‌ఎం సందర్శన. ఎవరెవరు ఏం చేయాలన్నదానిపై ఎస్‌ఓపీ తయారు చేశామని అధికారులు సీఎంకు వివ‌రించారు. స్కూళ్ల నిర్వహణలో తమ దృష్టికి వచ్చిన అంశాలను ముగ్గురు స‌చివాల‌య సిబ్బంది ఫొటోగ్రాఫ్‌లతో సహా అప్‌లోడ్‌ చేయనున్నారు. వీటిపై అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోనున్నారు. మండలస్థాయిలో ఉండే విద్యాశాఖ అధికారుల్లో (ఎంఈఓ) ఒకరికి అకడమిక్‌ వ్యవహారాలు, మరొకరికి స్కూళ్ల నిర్వహణా అంశాలు అప్పగించాలని ఈ సంద‌ర్భంగా సీఎం ఆదేశించారు. 

టీచర్లకు, విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీపై సీఎం స‌మీక్ష‌..
5,18,740 ట్యాబ్‌లను కొనుగోలు చేయనున్న ప్రభుత్వం. ట్యాబ్‌ల్లో బైజూస్‌ కంటెంట్ నింపి విద్యార్థుల‌కు అంద‌జేయ‌నున్నారు. తరగతి గదులను డిజిటలీకరణ చేసే కార్యక్రమంలో భాగంగా స్మార్ట్‌ టీవీలను, ఇంటరాక్టివ్‌ టీవీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం. ఈ కార్యక్రమంపై సమీక్ష చేసిన ముఖ్యమంత్రి. దాదాపు 72,481 యూనిట్లు అవసరమని అంచనా వేసిన అధికారులు. దశలవారీగా వీటిని తరగతిగదుల్లో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం. దాదాపు రూ. 512 కోట్లుపైగా ఖర్చు అవుతుందని అంచనా. ``వచ్చే ఏడాది మార్చి నాటికి తొలిదశలో తరగతిగదుల డిజిటలైజేషన్ జరిగేలా చూడాలి. అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్‌ సదుపాయం ఉండేలా చూడాలి. డిజిటల్‌ లైబ్రరీలు సహా గ్రామ సచివాలయం, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్‌ అన్నింట్లో కూడా ఇంటర్నెట్‌ సదుపాయం ఏర్పాటు చేయాలి`` అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. 

తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ సమీర్‌ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌. సురేష్‌ కుమార్, స్కూల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఇంటర్‌ మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్ ఎం. వీ. శేషగిరిబాబు, పాఠశాల విద్యాశాఖ సలహాదారు ఏ.మురళీ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Back to Top