`వాణిజ్య ఉత్సవ్‌`ను ప్రారంభించిన సీఎం వైయ‌స్‌ జగన్‌

విజయవాడ: ఏపీ వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘వాణిజ్య ఉత్సవం-2021’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం వాణిజ్య ఉత్సవ్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం సందర్శించారు. స్టాల్స్‌ను పరిశీలించిన సీఎం  ఉత్పత్తులకు సంబంధించి పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏపీ ఎగుమ‌తుల రోడ్ మ్యాప్ బ్రోచ‌ర్‌ను సీఎం విడుదల చేశారు. అనంత‌రం ఎగుమ‌తుల‌కు సంబంధించి ప్ర‌త్యేక ఈ-పోర్ట‌ల్‌ను సీఎం ప్రారంభించారు. వాణిజ్య ఉత్సవ కార్యక్రమంలో మంత్రులు గౌతమ్‌రెడ్డి, పేర్ని నాని, కన్నబాబు, వెలంపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి మేక‌పాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. ఈ వారంలోనే ఎక్స్‌పోర్టు కాన్‌క్లేవ్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎక్స్‌పోర్టు కాన్‌క్లేవ్‌ ద్వారా ఎగుమతిదారులకు కావాల్సిన సమాచారం అందిస్తామన్నారు. వాణిజ్యంలో దేశంలోని ఏ రాష్ట్రంతోనైనా పోటీ పడే సత్తా ఏపీకి ఉందని పేర్కొన్నారు. వాణిజ్యం పెంపున‌కు, మౌలిక వసతుల కల్పనలో ఏపీ ముందుంటుందని తెలిపారు. కోవిడ్‌ కష్టాలున్నా ఏపీలో ఎగుమతులు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు.

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా రాష్ట్ర వాణిజ్య ఎగుమతుల రెట్టింపు దిశగా చర్యలు చేపట్టనున్నారు. ఏపీ నుంచి అత్యంత చౌకగా ఎగుమతుల లక్ష్యంగా ఈడీబీ ప్రణాళికలు చేస్తుంది. ప్రస్తుతం ఏపీ నుంచి 4 ఓడరేవుల ద్వారా ఎగుమతులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా ఏపీ నుంచి 16.8 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు జరుగుతున్నాయి. 2030 నాటికి 33.7 బిలియన్‌ డాలర్ల ఎగుమతులే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top