తాడేపల్లి: విద్యుత్ సమర్ధ వినియోగంలో జాతీయ స్ధాయిలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు మూడు అవార్డులు గెలుచుకున్నాయి. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన 15 వ ఎనర్షియా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు డెవలప్మెంట్ విషయంలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీ ఎంపికైంది. దీంతోపాటు దేశంలోనే అత్యుత్తమ ట్రాన్స్మిషన్ యుటిలిటీగా ఏపీ ట్రాన్స్కో ఎంపికైంది. అలాగే న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉత్తమ పునరుత్పాదక కార్పొరేషన్లలో ఒకటిగా ఎనర్షియా అవార్డును గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్ధలు జాతీయ స్ధాయిలో అవార్డులు గెలుచుకోవడంపై ఆ సంస్ధల ఉన్నతాధికారులను సీఎం శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్, ఏపీ ట్రాన్స్కో సీఎండీ బి.శ్రీధర్, ఎన్ఆర్ఈడీసీఏపీ వీసీ మరియు ఎండీ ఎస్. రమణా రెడ్డి, ట్రాన్స్కో జేఎండీ (హెచ్ఆర్డీ) ఐ. పృద్వితేజ్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పద్మాజనార్ధన్ రెడ్డి, పాల్గొన్న చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్. జవహర్ రెడ్డి, ఏపీ ట్రాన్స్కో జేఎండీ (విజిలెన్స్) బి.మల్లారెడ్డి కలిసి అవార్డులను చూపించారు. వీరిని సీఎం వైయస్ జగన్ అభినందించారు.