ఇండ్‌ గ్యాప్‌ ధృవీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైయ‌స్ జగన్‌

 
తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇండ్‌ గ్యాప్‌ ధృవీకరణ కార్యక్రమాన్ని తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యంలో ప్రారంభించారు.   గ్యాప్‌ సర్టిఫికేషన్‌ ద్వారా మన రాష్ట్ర అన్నదాతలు కష్టపడి నాణ్యమైన ప్రమాణాలతో పండించిన పంట దిగుబడులను తమకు జారీ చేసిన ధృవీకరణ పత్రముల ఆధారంగా ప్రీమియం ధరకు వారికి నచ్చిన చోట దేశీయంగా మాత్రమే కాకుండా యూరప్, యూఎస్‌తో సహా వందకు పైగా ఇతర దేశాలకు కూడా ఎగుమతి వ్యాపారం చేసుకునే వెసులుబాటును ఏపీ ప్రభుత్వం కల్పిస్తుంది.
మన దేశంలోని రైతులకు ఇచ్చే గ్యాప్‌ సర్టిఫికేషన్‌ను ఇండ్‌ గ్యాప్‌ సర్టిఫికేషన్‌గా ఇతర దేశాలు గుర్తిస్తాయి. రానున్న రోజుల్లో ఇండ్‌ గ్యాప్‌ సర్టిఫికేషన్‌ ప్రమాణాలను గ్లోబల్‌ గ్యాప్‌ సర్టిఫికేషన్‌ ప్రమాణాలతో సరిసమానం చేయడం జరుగుతుంది. అప్పుడు రైతులు పండించిన వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్‌లో వాణిజ్యపరమైన డిమాండ్‌ అధికంగా ఏర్పడుతుంది
భారతదేశంలో మేలైన వ్యవసాయ పద్దతులను బలోపేతం చేసే సదుద్దేశంతో క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఇండ్‌ గ్యాప్‌ ధృవీకరణ పథకాన్ని అభివృద్ది చేసింది. దీనిని దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ది చేశారు. 
గ్యాప్‌ సర్టిఫికేషన్‌లో భాగంగా పండ్లు, కూరగాయలు, సంయోగ పంటలు, తేయాకు, గ్రీన్‌ కాఫీ, సుగంధ ద్రవ్యాలు అనే ఐదు విభాగాలుగా ధృవీకరణ చేయడం జరుగుతుంది. ఈ ధృవీకరణను వ్యక్తిగత రైతులు, రైతు బృందాల చేత చేయించవచ్చు. మన రాష్ట్రంలో ఇండ్‌ గ్యాప్‌ ధృవీకరణ పథకం కింద ఏపీఎస్‌వోపీసీఏ ధృవీకరణ సేవలు అందిస్తుంది. ఏపీ ప్రభుత్వం ఇండ్‌ గ్యాప్‌ అమలుకోసం సుస్ధిర వ్యవసాయ ఆహార వ్యవస్ధలు అనే శీర్షికతో ఎఫ్‌ఏవో–టీసీపీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 
ఇండ్‌ గ్యాప్‌ ధృవీకరణ ఒప్పంద పత్రాలను సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ సమక్షంలో మార్చుకున్న క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ జక్సయ్‌ షా, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది.
 కార్య‌క్ర‌మంలో క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ జక్సయ్‌ షా, క్యూసీఐ డైరెక్టర్‌ డాక్టర్‌ మనీష్‌ పాండే, ఇండియాలో ఎఫ్‌ఏవో రెప్రజెంటేషన్, ఆఫీసర్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ కొండారెడ్డి చవ్వా, ఐసీఏఆర్‌–ఏటీఏఆర్‌ఐ హైదరాబాద్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ షేక్‌ ఎన్‌.మీరా, సీఎం స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌ సి.హరికిరణ్, ఏపీ సీడ్స్‌ వీసీ అండ్‌ ఎండీ డాక్టర్‌ గెడ్డం శేఖర్‌బాబు, ఏపీఎస్‌ఎస్‌సీఏ డైరెక్టర్‌ డాక్టర్‌ త్రివిక్రమ్‌ రెడ్డి పాల్గొన్నారు.

Back to Top