సీఎం వైయ‌స్‌ జగన్‌పై దాడి.. స్పందించిన స్టాలిన్‌, కేటీఆర్‌

విజ‌య‌వాడ‌: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాయితో దాడికి పాల్పడ్డాడు ఓ ఆగంతకుడు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా సింగ్‌నగర్‌కు చేరుకున్న క్రమంలో సీఎం వైయ‌స్ జగన్‌పై రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో సీఎం జగన్‌పై  దాడి జరిగింది. ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్‌ కనుబొమ్మకు తాకింది. సీఎం వైయ‌స్ జగన్  ఆసుపత్రిలో చికిత్స పొందారు,
కాగా, సీఎం వైయ‌స్‌ జగన్‌పై దాడి ఘటన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, హరీష్‌ రావు స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్‌..‘జగన్‌ అన్నా జాగ్రత్తలు తీసుకోండి. మీరు సురక్షితంగా ఉన్నారు సంతోషం. సీఎం వైయ‌స్ జగన్‌పై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. ఎన్నికల సంఘం ద్వారా కఠినమైన చర్యలు చేపట్టాలని నేను ఆశిస్తున్నాను’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. 

మరోవైపు హరీష్‌ రావు ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘సీఎం వైయ‌స్ జగన్‌పై దాడి హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు’ అని పేర్కొన్నారు. ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ.. జగన్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ సైతం జగన్‌పై దాడిని ఖండించారు. రాజకీయ విభేదాలు ఎప్పుడూ హింసాత్మకంగా మారకూడదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు సభ్యత, పరస్పర గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. 

Image

Back to Top