తాడేపల్లి: క్రైస్తవ ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. సీఎంతో పలు అంశాలపై క్రైస్తవ ప్రతినిధులు చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలతో నిరుపేదలకు మేలు జరుగుతోందన్న ప్రతినిధులు.. పారదర్శకంగా, వివక్ష లేకుండా వారికి పథకాలు అందుతున్నాయని కొనియాడారు.
పాస్టర్లకూ గౌరవ వేతనం ఇచ్చి సహాయకారిగా నిలవటంపై క్రైస్తవ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల శ్మశాన వాటికల సమస్య ఉందనీ, బరియల్ గ్రౌండ్స్ సమస్య ఉందని, చర్చి ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రతినిధులు కోరారు. చర్చిల ఆధ్వర్యంలోని స్కూళ్లకూ, సేవా భవనాలకు మున్సిపల్ పన్ను నుంచి మినహాయింపునివ్వాలన్నారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కోసం న్యాయ పోరాటం చేస్తున్నామనీ, దీనికి తోడుగా నిలవాలని ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే...:
– దళిత క్రై స్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలంటూ అసెంబ్లీలో ఇదివరకే తీర్మానంచేసి కేంద్రానికి పంపించాం:
ఈ అంశం న్యాయస్ధానం పరిధిలో ఉందన్న విషయం మీకు తెలిసిందే :
– శ్మశాన వాటికలపై ఇప్పటికే ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుందని, లేనిచోట ఏర్పాటుకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిందన్న సీఎం.
– సచివాలయాల వారీగా ఎస్సీలకు శ్మశానవాటికలు లేనిచోట ఇప్పించేందుకు చర్యలు కూడా తీసుకుంటున్నామని తెలిపిన సీఎం.
