కొత్త జిల్లాల ఏర్పాటు చరిత్రాత్మకం.. ప్రతి ఒక్కరూ స్వాగతించాలి

ప్రభుత్వ చీఫ్ విప్  గడికోట శ్రీకాంత్ రెడ్డి 

14 ఏళ్ళు సీఎంగా, 7 సార్లు ఎమ్మెల్యేగా చేసిన చంద్రబాబు కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయలేకపోయారు

చంద్రబాబు విజ్ఞప్తి మేరకే సీఎం వైయ‌స్‌ జగన్ గారు కుప్పంను రెవెన్యూ డివిజన్ చేశారు

 ప్రజలకు మేలు చేసే విషయంలో వైయ‌స్ జగన్ గారు నో కాంప్రమైజ్

 హిందూపురాన్ని బాబు జిల్లా చేస్తామంటే ఎవరైనా వద్దన్నారా..?

అన్న‌మ‌య్య జిల్లా: కొత్త జిల్లాల ఏర్పాటు చరిత్రాత్మకమ‌ని,  ప్రతి ఒక్కరూ కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతించాలని ప్రభుత్వ చీఫ్ విప్  గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు.  బ్రిటీష్ పాలన తర్వాత, 75 ఏళ్ళ స్వాతంత్ర్య‌ భారంతంలో, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇప్పటివరకు రెండు జిల్లాలు మాత్రమే పెరిగితే, వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి వచ్చాక ఏకంగా 13 కొత్త జిల్లాలు తీసుకురావడాన్ని అందరూ స్వాగతించాలి, హర్షించాల‌ని, ఇదొక చరిత్రాత్మకమ‌న్నారు. అన్న‌మ‌య్య జిల్లా రాయ‌చోటిలో శ్రీ‌కాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

ప్రజలకు మరింత సౌకర్యంగా, సౌలభ్యంగా ఉండేందుకు ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలపైనా పనీపాట లేని ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారి మనస్తత్వం ఏంటంటే.. ఎవరు ఏది అడిగినా కాదనలేని మనస్తత్వం, గొప్ప మనసున్న నాయకుడు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి, 7 సార్లు అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంను రెవెన్యూ డివిజన్ గా జగన్ మోహన్ రెడ్డిగారు ఈరోజు చేశారు. చంద్రబాబు చేయలేని పనిని, కుప్పంను రెవెన్యూ డివిజన్ గా చేయడమే జగన్ గారు చేసిన తప్పా..? అని ప్రశ్నిస్తున్నాం. 
- కుప్పంను రెవెన్యూ డివిజన్ గా చేయాలని చంద్రబాబు నాయుడు రిప్రజెంటేషన్ ఇస్తే.. చిన్న డివిజన్ అయినా.. వైయ‌స్‌ జగన్ గారు మంచి మనసుతో అది చేయగలిగారు. 
-  ఎన్టీఆర్ గారు, ఆ తర్వాత 14 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నా హిందూపురంను ఎందుకు జిల్లా చేయలేకపోయారు..? మీరు జిల్లా చేస్తామంటే, ఎవరైనా వద్దన్నారా.. ? ఈరోజు చంద్రబాబు గారి బామ్మర్ది బాలకృష్ణ హిందూపురాన్నే జిల్లా కేంద్రం చేయాలని అడుగుతున్నాడు. ఇంతకాలం, మీరెందుకు చేయలేకపోయారని ప్రశ్నిస్తున్నాం.

 ప్రజల ఆకాంక్షల మేరకే జగన్ మోహన్ రెడ్డిగారు జిల్లాల కూర్పులో చిన్న చిన్న మార్పులు చేశారు. దాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రతిపక్ష పార్టీలే మంచిని పక్కన పెట్టి, ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి ఎలా మంట పెట్టాలని దుష్ట ఆలోచనలు చేస్తున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు.  అడ్డమైన విమర్శలు, రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు ఇకనైనా మానుకోండి.

4- చేతనైతే, జిల్లాల ఏర్పాటులో ఎక్కడ తప్పు జరిగిందో, ఏది అశాస్త్రీయమో విమర్శలు చేస్తున్న చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లు చెప్పాలి. మన్యం ప్రాంతాన్ని రెండు జిల్లాలుగా చేయడం తప్పా.. ? 
- ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు మాట్లాడటం సమంజసం కాదు.  రైతుల గురించి, ఆత్మహత్యల గురించి పవన్ కల్యాణ్ లెక్చర్లు ఇస్తున్నారు. మీరు మద్దతు ఇచ్చిన, మీ భాగస్వామ్య పార్టీల రైతు వ్యతిరేక పరిపాలన వల్లే,  రైతుల మరణాలు ఎక్కడైనా జరిగి ఉంటాయి తప్పితే.. జగన్ మోహన్ రెడ్డిగారి పరిపాలన వల్ల కానేకాదు. జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వం అంటేనే రైతు పక్షపాతి ప్రభుత్వం. రైతు మేలు కోరే ప్రభుత్వం. 
- విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు మేలు జరిగేలా రాష్ట్రంలో 10 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలను  ఏర్పాటు చేసింది పవన్ కల్యాణ్ కళ్ళకు కనిపించలేదా..?

వైయ‌స్  జగన్ మోహన్ రెడ్డిగారు అమలు చేస్తున్న ఏ పథకం తీసుకున్నా.. పేద ప్రజలకు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తుందన్నది విమర్శలు చేస్తున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు కనిపించడం లేదా..?
- అమ్మ ఒడి, చేయూత, ఆసరా, నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు అభివృద్ధి, 16 కొత్త మెడికల్ కాలేజీలు.. ఇవన్నీ మీ కళ్ళకు ఎందుకు కనిపించటం లేదు..? అంటే మీరు కళ్ళు ఉండి కూడా చూడలేని అంధులా..?

ప్రజలకు మంచి చేసే విషయంలో వైయ‌స్ జగన్ గారు ఎప్పుడూ కాంప్రమైజ్ కారు. ప్రజలకు మేలు జరుగుతుందంటే.. ఎంత దూరమైనా వెళతారు. ఫైట్ చేస్తారు. అఖిలపక్షం ఎందుకు పెట్టలేదని మాట్లాడుతున్న సీపీఐ నాయకులు.. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఏకపక్షంగా అనేక నిర్ణయాలు తీసుకున్నా చంద్రబాబును ఏరోజు అయినా, ఎందుకు అఖిలపక్ష సమావేశాలు పెట్టలేదు అని అడగలేకపోయారు. ఇప్పుడే ఎందుకు అడుగుతున్నారు, మీ అజెండా ఏమిటి...?  ఈ రాష్ట్రంలో సీపీఐ అంటే.. క్యాపిలిస్టుల పార్టీగా మారింది. నారాయణ, రామకృష్ణల నాయకత్వంలో ఆ పార్టీలో పనిచేస్తే.. మీకు ఏరకమైన విలువ ఉంటుందో సీపీఐ కార్యకర్తలు కూడా ఆలోచించాలి.

 మేనిఫెస్టోను ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతలా భావించి, అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలోనే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో 95 శాతం అమలు చేశారు జగన్ మోహన్ రెడ్డిగారు. చంద్రబాబులా మేనిఫెస్టో కనిపిస్తే.. వాగ్దానాలు ఎక్కడ గుర్తుకొస్తాయోనని వెబ్ సైట్ లో నుంచి తొలగించలేదు. మేనిఫెస్టో పట్టుకుని ఇంటింటికీ వెళ్ళి, మేం ఇది చేశాం.. అని ధైర్యంగా మేం చెప్పగలుగుతున్నాం. అదే మీరు ఎందుకు చేయలేకపోయారు. 

 రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలపైన ఏరోజూ మీరు డిబేట్ చేయరు. వ్యవస్థలను నిర్వార్యం చేస్తున్నట్టు విమర్శలు చేస్తున్నారు. వ్యవస్థలపై మాకు అచెంచలమైన విశ్వాసం, గౌరవం, నమ్మకం ఉన్నాయి. వ్యవస్థలను అడ్డు పెట్టుకుని మాపై బురదజల్లుతున్న చంద్రబాబు అండ్ కో లకే వ్యవస్థలపై గౌరవం లేదు. 

 వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం తగ్గిందని మాట్లాడుతున్న మీరు... మీ మాటల మీద మీకు విశ్వాసం, నమ్మకం ఉంటే, ఎందుకు ఒంటరిగా పోటీ చేయడానికి భయపడుతున్నారు. మరోసారి ఛాలెంజ్ విసురుతున్నాం. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా.. ? మీకు ఎందుకు ఆ ధైర్యం లేదు. 

 చంద్రబాబుది నిమిషానికో మాట.. పూటకో విధానం. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని సిద్ధాంతాలు, విలువలతో పనిచేస్తుంది. మాది లౌకిక విధానం. ప్రజలకు మేలు చేయడమే మా పార్టీ, వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డిగారి విధానం. తన స్వార్థం కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టి, రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశాడు. 
- గతంలోనూ, భవిష్యత్తులోనూ మరే నాయకుడూ చేయలేని విధంగా, 13 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి, ప్రజలకు మేలు చేసే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న జగన్ మోహన్ రెడ్డిగారికి గ‌డికోట శ్రీ‌కాంత్ రెడ్డి హృదయపూర్వకంగా ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలిపారు. 

Back to Top