శ్రీకాకుళం: తన రాజకీయ జీవితంలో సీఎం చంద్రబాబు ప్రజలకు, పేదలకు ఉపయోగపడే ఒక్క సంస్కరణ కూడా చేయలేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తేల్చి చెప్పారు. 18 నెలల పాలనలో పేదల కోసం ఒక ఎకరా భూమి కూడా కొనుగోలు చేయలేదు సరికదా... పేదలను కొట్టి పెద్దలకు పంచడమే నైజంగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ... రెవెన్యూశాఖ పై సమీక్ష చేయడానికి ఏడాదిన్నర టైం తీసుకోవడమే సీఎం చంద్రబాబుకు పేదల పట్ల, వారి సంక్షేమం పట్ల తీరుకు నిదర్శమని తేల్చి చెప్పారు 1977 తర్వాత రాష్ట్రంలో రైతులకు వైయస్.జగన్ ప్రభుత్వంలోనే మేలు జరిగిందన్న ధర్మాన... 2020లో వైయస్.జగన్ తీసుకొచ్చిన భూసంస్కరణల వల్లే పేదలకు మేలు జరిగిందని తేల్చి చెప్పారు. గ్రామకంఠం, చుక్కల భూముల వంటి ప్రజల రెవెన్యూ వివాదాల పరిష్కారానికి శాశ్వత కృషి చేసిన వైయస్.జగన్.. సమగ్ర భూసర్వే ద్వారా 10 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి చేయడం తో పాటు, 30 లక్షల మందికి పట్టాలు పంపిణీ చేశారని స్పష్టం చేశారు. అయితే భూసర్వేపై అబద్దాలు చెప్పి ప్రజలతో ఓట్లేయించుకున్న టీడీపీ హయాంలో 18 నెలలుగా భూసర్వే కార్యక్రమం నిల్చిపోవడంతో ... ఒక్క పట్టాదారుపాస్ బుక్కూ మంజూరు చేయలేదని మండిపడ్డారు. వైయస్.జగన్ హాయంలో సచివాలయాల ద్వారా ప్రజల చెంతకే సేవలు అందిస్తే.. చంద్రబాబు ప్రభుత్వం నేడు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మార్వో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లో అడ్డూ అదుపూలేని దోపిడీకి చిరునామాగా మారాయని ధ్వజమెత్తారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... సీఎంకు ఇన్నాళ్లకు గుర్తొచ్చిన రెవెన్యూశాఖ... ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిన్నర తర్వాతైనా రెవెన్యూశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించడం సంతోషం. సాధారణంగా జరిగే కార్యక్రమమే అయినా... దీన్ని చేయడానికైనా సీఎంకు సంవత్సరమున్నర కాలం పట్టింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూశాఖను సమూలంగా సంస్కరించాలంటున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూస్తే.. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వస్తే 1952లో ఎన్నికలు జరిగి ప్రజలచేత ఎన్నుకున్న ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఆనాడు దేశంలోనూ, రాష్ట్రంలోనూ వ్యవసాయ భూములు కొద్దిమంది ఎస్టేట్ దారులు, జమీందారులు, ఈనామ్ దార్లు దగ్గర మాత్రమే భూమి ఉండేది. సామాన్య రైతులు దగ్గర భూములు లేని పరిస్థితి. ఆ నాడు వచ్చిన ప్రజా ప్రభుత్వాలు జమిందారీ వ్యవస్ధలను,ఈనామ్ లను, ఎస్టేట్లను రద్దు చేశారు. ఉన్న భూమిని ప్రజలకు ఇవ్వాలన్న ఆలోచనతో పంపిణీ చేసే కార్యక్రమం చేశారు. ఆనాటికీ ఈనాటికీ సమాజంలో భూమి ఉన్నవారికి హోదా ఉంది. ఈ నేపధ్యంలో 52-54 వరకు భూమి పంపిణీ చేసి . వారి హోదాను పెంచడానికి ప్రయత్నిస్తుంటే వాళ్లు భూములను అమ్ముకోవడం పరిపాటిగా మారింది. ఇంత చైతన్యం ఆనాడు లేదు. దీంతో పెద్దలు మరలా 1954లో చట్ట సవరణ చేసి.. .ప్రభుత్వం ఇచ్చిన భూమిని, ఆ భూమి పొందిన వ్యక్తి అమ్ముకోవడానికి లేకుండా మార్పు చేశారు. పేదరికం, నిరక్షరాస్య, పెత్తందార్ల ప్రభావం వల్ల భూమి అమ్ముకుంటున్నారు.. దాన్ని నిలువరించడానికే ఈ నిబంధన పెట్టారు. అయినా ప్రభుత్వాలు ఎంత భూమి ఇచ్చినా.. వారి చేతుల్లోంచి ఇతరుల చేతుల్లోకి మారిపోతుంటే.. దాన్ని నిలువరించడానికి 1977లో అప్పటి శాసనసభ పీఓటి(ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ ఫర్) యాక్ట్ ను తీసుకొచ్చింది. పీఓటి యాక్ట్ సెక్షన్ 1 ప్రకారం ఈ భూముల ఎలాంటి క్రయ, విక్రయాలు చెల్లవని చెప్పింది. అంతేకాకుండా ప్రభుత్వం కేటాయించిన భూమిని ఎవరైనా బలవంతంగా తీసుకుంటే ప్రభుత్వం దాన్ని తీసుకుని మరలా లబ్దిదారుడికి పట్టా ఇచ్చే విధంగా రూపొందించారు. ఈ చట్టాలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వాలే తీసుకొచ్చాయి. భూమిలేని నిరుపేదలకు కూడా భూములు కేటాయించి.. సమాజంలో తారతమ్యాలు తగ్గించడానికే అప్పటి ప్రభుత్వాలు ఈ నిర్ణయాలు చేశాయి. 1983 తర్వాత ప్రభుత్వాలు మారాయి. 1977 తర్వాత వైయస్.జగన్ హయాంలోనే భూసంస్కరణలు... వైయస్.జగన్ 2019లో అధికారంలోకి వచ్చేవరకు కూడా.. పేదల భూములకు సంబంధించిన సంస్కరణలు ఎవరూ తీసుకురాలేదు. పైగా భూములకు సంబంధించిన ఇతర సమస్యలు పరిష్కారం కాకుండా కోకొల్లలుగా మిగిలిపోయాయి. ఎవరి భూమి ఏదో గుర్తించలేని పరిస్థితి, ఆ వివాదం కోర్టుల్లో నడుస్తుండడం.. మరోవైపు ధనవంతుడికి మాత్రమే న్యాయం లభించే పద్దతులు నెలకున్నాయి. ఈ నేఫధ్యంలో కోర్టుల్లో దశాబ్దాలుగా పరిష్కారం కోసం పెట్టుబడి పెట్టలేక, పోరాడే శక్తిలేక తమ భూముల్ని కారుచౌకగా అమ్ముకునే పరిస్థితి నెలకొంది. అనేక భూములు ఎవరివో తెలియని పరిస్థితి వచ్చింది. చుక్కల భూమలు కూడా అలాంటివే. ఈ దేశంలో బ్రిటీష్ వారు భూసర్వే నిర్వహించినప్పుడు భూమి కలిగిన రైతు సర్వే సమయంలో లేకపోవడం, అవగాహన లేకపోవడం వంటి సమస్యలతో ఆ భూమి సర్వే నెంబర్లలో చుక్కలు పెట్టి వదిలేశారు. అప్పటి నుంచి మరలా సర్వే జరగలేదు. ఆ చుక్కల భూములపై ఎవరికీ హక్కులు ఇవ్వలేదు. ఆ ఆస్తి మీద బ్యాంకులు రుణాలు ఇవ్వలేదు. అలాంటివే లంకల్లో ఉన్న భూములు. ఖాతాల్లో అనాధీనం అని రాసి వదిలిపెట్టిన.. అనాధీన భూములు. అవే రైతులు దశాబ్దాలుగా పండించుకుంటున్నా ఆ భూముల మీద హక్కులు ఉండవు, పట్టాలు ఇవ్వరు. గతంలో వచ్చిన ఏ ప్రభుత్వాలు ఈ పేదలకు సంబంధించిన నిర్ణయాలు, పేదల పక్షాన రెవెన్యూ సంస్కరణలు చేపట్టలేదు. మరలా 2019లో ఏర్పడిన వైయస్.జగన్ ప్రభుత్వంలో మరలా రెవెన్యూ సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. 2019 నుంచి 12 సంవత్సరాల ముందు వరకు ఆ భూములపై ఉన్న రైతులకు పట్టాలిచ్చే కార్యక్రమం చేశాం. ఇది ఓ గొప్ప నిర్ణయం. వంద సంవత్సరాల్లో పరిష్కరించలేని సమస్యను వైయస్.జగన్ ప్రభుత్వం తీర్చింది. దీనివల్ల ఆయా భూములను రైతులు బ్యాంకుల్లో కుదవపెట్టి రుణాలు తీసుకుని, పెట్టుబడి పెట్టుకోవడానికి అవకాశం వచ్చింది. తద్వారా మార్కెట్ లోకి మరలా పెట్టుబడికి అవకాశం, కొంతమందికి ఉపాధి కలిగింది. దీనిపై ప్రస్తుతమున్న చంద్రబాబు ప్రభుత్వానికున్న అభ్యంతరం ఏమిటి? 1952లో అప్పటి ప్రభుత్వాలు భూమిలేని పేదలకు భూమి పంపిణీ చేయడం తో పాటు, దాన్ని అమ్ముకునే హక్కు కూడా కల్పించింది. కానీ సమాజంలో ఉన్న అజ్ఞానం, పేదరికం కారణంగా అప్పటి రైతులు ఆ భూములను నిరుపేదలు నిలుపుకునే పరిస్థితి లేకపోవడంతో, ప్రభుత్వం ఇచ్చిన భూమిని అమ్ముకోవడానికి వీల్లేదని చెప్పారు. అందుకోసమే పీఓటీ తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆలోచన మాత్రం భూమి కేటాయించిన రైతు హోదా పెంచడమే లక్ష్యం. 1952 తర్వాత 2019లో ఏర్పడిన వైయస్.జగన్ ప్రభుత్వంలో మరలా భూపంపిణీ చేపట్టడం జరిగింది. అంతే కాకుండా ఆ భూమి పిల్లల చదువులు వంటి వారి ఇతర అవసరాలు తీర్చుకునేందుకు అమ్ముకునే అవకాశం ఇవ్వాలని కోరితే.. వైయస్.జగన్ ప్రభుత్వంలో దానికోసం పెద్ద ఎత్తున కసరత్తు చేశాం. అన్ని రాష్ట్రాల్లో ఇలా ఇచ్చిన భూములను క్రయవిక్రయాలకు జరపడానికి అవకాశం ఇచ్చిన సందర్భంలో.... మన రాష్ట్రంలో కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని రెవెన్యూ మంత్రిగా ఆ చట్టసవరణ నేనే చేశాను. దీని కోసం ఏర్పాటైన కమిటీ నివేదిక ను కేబినెట్ ఆమోదిస్తే... వైయస్.జగన్ ప్రభుత్వంలో వాటిని అమలు చేశాం. అందులో ఏం తప్పు ఉంది? ఏడాదిన్నరగా దాన్ని నిలిపివేశారు. అంటే ఈ రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఈనాడు వైయస్.జగన్ ప్రభుత్వం తప్ప పేదలకు ఉపయోగపడే విధంగా రెవెన్యూ సంస్కరణలు, వారికి ఉపయోగపడే ఏ చట్టాన్ని అయినా మీ ప్రభుత్వం తేలగిందా? రెవెన్యూ మంత్రిగా పనిచేశారు, నాలుగుసార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకునే మీరు మీ హయాంలో పేదలకు అనుకూలంగా ఒక్క నిర్ణయమైనా చేయగలిగారా?. ప్రధానంగా సర్వే గురించి మాట్లాడుకోవావల్సి వస్తే.. ఆనాడు రోడ్లు, ఇంత వ్యవస్థ లేకపోయినా బ్రిటీషర్లు చాలా సమర్ధవంతంగా భూములు సర్వే చేశారు. వందేళ్లయినా నేటికీ మనం సర్వే చేయలేకపోయాం. మరలా వైయస్.జగన్ హయాంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూసర్వే ప్రారంభించారు. సుమారు 10వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తైంది. ఒకటి అరా లోపాలు తప్ప... సమర్ధవంతంగా సర్వే చేశారు. ఆ తప్పులను కూడా సరిదిద్దుకునే అవకాశం ఉంది. ఏడాదిన్నరగా మీరు ఎందుకు సర్వే చేయలేకపోయారు. పేదల భూములను లాక్కోవడమే చంద్రబాబు పాలసీ... ఈ ఏడాది కాలంగా మీరు ఇతరుల దగ్గర ఉన్న భూములను లాక్కుని ధనవంతులకు అప్పగించారు. భూమి అంతా మీ చేతుల్లో పెట్టుకుని, మార్కెట్ వాల్యూ పునరుద్ధరించమని చెబుతున్నారు. ప్రజల భూములను లాక్కుని, మీ దగ్గరకు తెచ్చుకున్న తర్వాత మార్కెట్ వాల్యూ పెంచడం ద్వారా ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారు? ఎవరి మేలు కోసం ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు? సాధారణ రైతులకు, పేదలకు మేలు జరిగే నిర్ణయాలు మీరు ఒక్కటైనా చేశారా? 1977 తర్వాత మరలా 2020 వరకు వైయస్.జగన్ హయాంలో తప్ప రైతులకు మేలు జరిగే రెవెన్యూ సంస్కరణలు ఎవరైనా చేశారా? వాటన్నింటినీ వక్రీకరించి మీరు ఎన్నికల్లో ఓట్లు సంపాదించవచ్చు, కానీ మీ గుండెల మీద చేయి వేసుకుని సమాధానం చెప్పండి? ప్రజల కోసం మీరు తెచ్చిన సంస్కరణ ఒక్కటైనా ఉందా? మీరు ఏ వేదిక మీదకు రమ్మన్నా, చర్చకు నేను సిద్దంగా ఉన్నాను. వైయస్.జగన్ ప్రభుత్వం వచ్చేంత వరకు.. వ్యవసాయభూమి నుంచి వ్యవసాయేతర భూమి కింద మార్పు చేస్తే దానికి సంబంధించి రికార్డులు లేని అయోమయపరిస్థితి ఉండేది. గ్రామ కంఠాలకు సంబంధించిన రికార్డులు లేకపోతే.. దానికి కూడా ఓ సౌకర్యం కల్పించాం. భూమి హోదాదారు ఇతనే సర్టిఫికేట్ ఇచ్చి... బ్యాంకులకు వెళ్లి తనఖా పెట్టుకునే సౌకర్యం కల్పించాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు రిజిష్ట్రేషన్ యాక్ట్ లో ఉన్న 22 ఏ నోటిఫికేషన్ పెట్టి గందరగోళం సృష్టించారు. చాలా వారకు వాటిని ఇవ్వడానికి మేం ప్రయత్నం చేస్తే.. మీరు కేసులు పెట్టి అధికారులను బెదిరించి ఇవ్వడం వల్ల.. ఏ ఒక్క అధికారి 22ఏ నుంచి ప్రాసెస్ చేసి ఇవ్వడానికి భయపడి, ఆగిపోయారు. ప్రతి జిల్లాలో మేము ఎంత మానిటరింగ్ చేసినా చేయలేని పరిస్థితి క్రియేట్ చేశారు. 22 ఏ లో పెట్టడం అంటే.. అది పూర్తిగా ప్రభుత్వ భూమి, దానిలో ఏ కార్యక్రమం జరగకుండా అలా ఎన్ని సంవత్సరాలు ఉంచుతారు. ఈ ఏడాదిన్నరలో మీరు చేసిన ప్రయత్నం లేదు. మీరు ఎంపిక చేసుకున్న రైతులకు రకరకాల చేతులు మారుతున్న తర్వాత చేశారు. మీరు కొత్తగా ఏం చేయలేదు, మేం తెచ్చిన సంస్కరణలను వేటినీ అమలుచేయడం లేదు. మీ మూడోవంతు ప్రభుత్వ కాలం పూర్తైనా... సంస్కరణలు చేసిందేమీ లేదు. భూములు విలువ పెంచడం తప్ప మరేం లేదు. సర్వే కార్యక్రమాన్ని నిలిపివేశారు. ఏదైనా లోపాలుంటే చూపించండి. ఏదో క సాగు చూపించి... మీకున్నమీడియా సాధనాలు ద్వారా ప్రజలను భయకంపితులను చేసి ఎన్నికల్లో ప్రయోజనం పొందడం మినహా మీరు చేసిందేమీ లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేల చేతుల్లో ఎమ్మార్వో, రిజిస్ట్రార్ కార్యాలయాలు... భూమికి సంబంధించి మీరు అనుసరిస్తున్న విధానాలు చాలా తప్పుగా నడుస్తున్నాయి. ఎమ్మార్వో కార్యాలయాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్లిపోయాయి. మీరు అనుసరిస్తున్న విధానాలు చాలా తప్పు. ఎమ్మెల్యే పర్మిషన్ లేనిదే అధికారులను బెదిరించే పరిస్థితికి మీ ప్రభుత్వం దిగజారింది. వ్యవస్థలు వ్యక్తుల చేతుల్లోకి పరిపాలన దిగజారిపోయింది. ఏ కార్యాలయానికి వెళ్లినా.. మీ ఎమ్మెల్యేకు చెప్పారా? లేదా? ఆక్కడ డబ్బులిచ్చుకుని రా అన్న పరిస్థితికి వ్యవస్థలు దిగజారిపోయాయి. ఇటీవల నిర్వహినంచిన సర్వేలో 80 శాతం మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లోకి వెళ్లిపోయారు. మీరు ప్రజలను తక్కువగా అంచనా వేస్తున్నారు. ఇదేనా మీ పరిపాలన? నాలుగోసారి సీఎం అని చెప్పుకుంటున్న మీరు ఒక ఎకరం భూమైనా సేకరించి పేదలకు ఇవ్వగలిగారా? వైయస్.జగన్ హాయంలో 30 లక్షల మందికి అవసరమైన భూమిని కొనుగోలు చేసి పట్టాలిచ్చే కార్యక్రమం చేశారు. ఆ పట్టాల్లో ఏవి అమ్ముకుందామన్న ఆలోచన మీ కార్యకర్తల్లో ఉంది. ఎవరి పట్టాలు రద్దు చేద్దామా, ఎవరికిద్దామా అన్న ఆలోచనలో ఉన్నారు. ఇది నిరోధించే పరిస్థితి లేదు. రూ.12 వేల కోట్లు పెట్టి భూమి కొని, 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలిస్తే.. మీరు ఏడాదిన్నర కాలంలో ఒక ఎకరం భూమి కొన్నారా? మీరు ఏం సంస్కరణలు చేశారు? జిల్లాలన్నీ నిర్వీర్యమైపోయాయి. ఎక్కడైనా రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టారా? శ్రీకాకుళం జిల్లాలోనే చూస్తే... వంశధార చేయగలిగారా? ఒక బ్రిడ్జి అయినా పూర్తి చేయగలిగారా? ప్రజలు మీకు 50 ఏళ్లు అధికారం ఇచ్చారా? అప్పుడే ఏడాదిన్నర కాలం పూర్తైంది. మీ ఇంట్రస్టులు మీకు ఉన్నాయి. రూ.2.65 లక్షల కోట్లు అప్పు చేశారు. ప్రతి ఏటా రూ.2లక్షల కోట్లు బడ్జెట్ ప్రొవిజన్ ఉంది. అంటే రెండేళ్లలో రూ.4 లక్షల కోట్లు మీరు అప్పు చేసిన రూ.2.65 లక్షల కోట్లు అప్పు కలిసి మొత్తం రూ. 6.65 లక్షల కోట్లలో మా శ్రీకాకుళం జిల్లాలో మీరు చేసిన కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్ కనీసం రూ.500 కోట్లు చూపించగలరా? ఆముదాలవలస రోడ్డు ఆగిపోయిందని అన్ని విమర్శలు చేశారు, రూ.40 కోట్ల ఇవ్వలేకపోయారు. అన్ని వార్తలు రాశారు, పేమెంట్ ఇవ్వలేకపోయారు. గార బ్రిడ్జి పూర్తి కాలేదు. కలెక్టరేట్ పూర్తి కాలేదు. ఒక్క నిర్మాణం ప్రారంభించి పూర్తి చేయగలిగారా? శ్రీకాకుళం జిల్లాను ఒక ఉదాహరణ కోసమే చెప్పాను. మీకు మాయమాటలు చెప్పడం మినహా, సంస్కరణలు చేయడం మీకు చేతగాదు. సర్వే వల్ల గ్రామాల్లో వివాదాలతో చితికిపోతున్న అనేక కుటుంబాలకు మేలు జరుగుతుంది. 5 సెంమీ కంటే తేడా లేని విధంగా సర్వే చేశాం. దాన్ని నిలిపివేశారు. వైయస్.జగన్ ఉండి ఉంటే ఆ సర్వే పూర్తి అయ్యుండేది. సర్వే రాళ్ల మీద వైయస్.జగన్ బొమ్మ పెడితే... ఈ భూమి వైయస్.జగన్ తీసుకుంటాడని తప్పుడు ప్రచారం చేశారు. భారత రాజ్యాంగంలో ఆ అవకాశం ఉందా? ఒకరి భూమి ఇంకొకరు తీసుకునే అవకాశం ఉందా? ప్రభుత్వాధినేత కాదు, రాష్ట్ర పతి కూడా తీసుకునే అవకాశం లేదు. తప్పుడు ప్రచారంతో ప్రజలను మోసం చేసిన టీడీపీ... కానీ 40 ఏళ్ల రాజకీయ పార్టీ అబద్దాలు చెప్పి.. ప్రజలతో ఓట్లేయించుకున్నారు. ఆ రోజు మేం చెప్పే పరిస్ధితి లేదు. నేడుప్రజలకు అన్నీ అర్ధం అవుతున్నాయి. సమాజ హితం కోసమే వైయస్.జగన్ ఈ సంస్కరణలన్నీ తీసుకొస్తే... మీరు మాత్రం మీ అధికారుల ముందు అంతా నాశనం అయిందని, మేం గొప్పగా చేశామని అబద్దాలు చెబితే... అనుభవించిన రైతులకు వాస్తవాలు తెలీదా? మాజీ రెవెన్యూ మంత్రిగా మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. పట్టాదారుపాస్ పుస్తకం నిలిపివేసిన తర్వాత... ఈ 18 నెలల కాలంలో ఒక్క పాస్ బుక్ అయినా ఇవ్వగలిగారా? ఒక్క సంస్కరణ అయినా తెచ్చామని చెప్పగలరా? పేదల భూముల్ని పెద్ద వాళ్లకి ఇచ్చే కార్యక్రమంలో నిమగ్నులవ్వడం తప్ప, పేదలకు, సామాన్య రైతులకు మీరేం మేలు చేయలేదు. అది మీకు సంతోషాన్నివ్వవచ్చు. గ్రామపంచాయితీలు, గ్రామస్దాయి పరిపాలనను పూర్తిగా నిర్వీర్యం చేశారు. గతంలో మీరు ఊరు వద్దకు పాలన, పాదాల వద్దకు పాలన అని చాలా చెప్పారు. కానీ ఎవరేం చెప్పినా, వైయస్.జగన్ మాత్రమే నిజమైన పరిపాలనను ప్రజల వద్దకు తేగలిగాడు. ఒక నిర్దిష్ట జనాభాకు గ్రామ సచివాలయం నిర్మించి, కొత్తగా సిబ్బందిని నిష్పాక్షికంగా నియమించి ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్లాడు. ఇవాళ ఆ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. ఎవరేం చేస్తున్నారో తెలియడం లేదు. వాళ్ల చేత తప్పుడు పనులు చేయించే ప్రయత్నం చేస్తుంటే.. అందరూ సెలవు పెట్టి వెళ్లిపోతున్నారు. గతంలో గ్రామంలో వీధి లైటు వెలిగించడానికి లైన్ మెన్ లేని పరిస్థితి నుంచి ప్రతి గ్రామానికి ఒక జూనియల్ లైన్ మెన్, అగ్రికల్చర్ అసిస్టెంట్, వ్యవసాయ అధికారి, వెటర్నరీ అసిస్టెంట్ ను ఇచ్చారు. ఇది నిజమైన గ్రామ పరిపాలన. మీరు మాత్రం ధనవంతుల సేవ చేస్తున్నారు. మీ ఆగడాలు అడ్డూఅదుపు లేకుండా సాగుతున్నాయి. ఇసుక అక్రమ రవాణా యధేచ్చగా సాగుతోంది. ప్రజలకు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఒకొక్కరు తమ నియోజకవర్గాన్ని రాజ్యాంగా భావించి నాశనం చేశారు. అందరూ రెడ్ జోన్ లోనే ఉన్నారు. ఏ క్షణాన ఎన్నిక జరిగినా మిమ్మల్ని ప్రజలకు తిరస్కరించడం ఖాయం. దివంగత నేత వైయస్సార్ హయాంలో ఏడు విడతలుగా 7 లక్షల ఎకరాలు పేదలకు పంపిణీ చేశాం. నీ హయాంలో ఒక్కటైనా ఇలాంటి పనిచేశావా అని సీఎం చంద్రబాబును నిలదీశారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు అనుకూలంగా నిర్ణయాలు జరిగితే... కూటమి పాలలో పేదల భూములకు ఆంక్షలు పెట్టి పెద్దలకు దోచిపెట్టడం, లాక్కోవడమే తప్ప మరో కార్యక్రమం లేదని ధర్మాన ప్రసాదరావు తేల్చి చెప్పారు.