రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ప్రశంస‌నీయం

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌తో కేంద్ర బృందం భేటీ

విపత్తు సమయంలో అద్భుతంగా పనిచేశార‌ని ప్ర‌శంస‌

వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన వివరాలు సీఎంకు అందించిన బృందం

ఉదారంగా స్పందించాలని కేంద్ర‌బృందాన్ని కోరిన ముఖ్య‌మంత్రి 

వీలైనంత మేర ఆదుకోవడానికి మావంతు సహకారాన్ని అందిస్తాం: కేంద్ర‌బృందం

తాడేప‌ల్లి: ``భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ విపత్తు హృదయవిదారకరం. నష్టం అంచనాల కోసం మీరు ఆయా ప్రాంతాల్లో పర్యటించినందుకు ధన్యవాదాలు. ఉదారంగా, మానవతా పరంగా స్పందించాలి`` అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కేంద్ర బృందాన్ని కోరారు. వరద నష్టం అంచనాకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందంతో సీఎం వైయస్ జగన్‌ భేటీ అయ్యారు. వరద బాధిత ప్రాంతాల్లో పరిశీలించిన అంశాలను సీఎంకు కేంద్ర బృందం వివ‌రాలు అందించింది. కేంద్ర బృందం తరఫున ఎన్‌ఎండీఏ, కేంద్ర హోంమంత్రిత్వశాఖ స‌ల‌హాదారు కునాల్‌ సత్యార్థి సీఎంకు వివ‌రాలు అందించారు. వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌నితీరు ప్ర‌శంస‌నీయ‌మ‌ని కొనియాడారు.

ఈ సంద‌ర్భంగా కునాల్‌ సత్యార్థి మాట్లాడుతూ.. మూడు రోజులపాటు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించాం. వరద కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలనూ, వీలైనన్ని గ్రామాలను పరిశీలించాం. కడప జిల్లాకు భారీ నష్టం వాటిల్లింది. ఆ గ్రామాలను కూడా పరిశీలించాం. పశువులు చనిపోయాయి, రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులు వంటి మౌలిక సదుపాయాలు బాగా దెబ్బతిన్నాయి. మీ నాయకత్వంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ప్రశంసనీయం. అంకిత భావంతో పనిచేసే అధికారులు మీకు ఉన్నారు. వీరంతా మాకు మంచి సహకారాన్ని అందించారు. యువకులు, డైనమిక్‌గా పనిచేసే అధికారులు ఉన్నారు. విపత్తు సమయంలో అద్భుతంగా పనిచేశారు. మా పర్యటనల్లో వివిధ రాజకీయ ప్రనిధులను, మీడియా ప్రతినిధులను కలుసుకున్నాం. ప్రతి ఒక్కరూ కూడా వరదల్లో రాష్ట్ర ప్రభుత్వం పనితీరును ప్రశంసించారు. సంప్రదాయంగా వరదలు వచ్చే ప్రాంతం కాదు. అలాంటి ప్రాంతంలో ఊహించని రీతిలో వర్షాలు పడ్డాయి. ఇంత స్థాయిలో వరదను తీసుకెళ్లగలిగే పరిస్థితి అక్కడున్న నదులు, వాగులు, వంకలకు లేదు.

అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన చోట.. నష్టం అపారం..
కరువు ప్రాంతంలో అతి భారీవర్షాలు కురిశాయి. ఈ స్థాయిలో వరదను నియంత్రించగలిగే రిజర్వాయర్లు, డ్యాంలు కూడా ఈ ప్రాంతంలో లేవు. ఉన్న డ్యాంలు, రిజర్వాయర్లు కూడా ఈస్థాయి వరదలను ఊహించి నిర్మించినవి కావు. ఇలాంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా తలెత్తున్నాయి. కరువు ప్రాంతాల్లో కుంభవృష్టి, నిరంతరం మంచి వర్షాలు కురిసేచోట కరువు లాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. తీరందాటిన తర్వాత అల్పపీడనం వెంటనే తొలగిపోలేదు, అది చాలా రోజులు కొనసాగింది. కడప జిల్లాలో వరదల వల్ల నష్టం అధికంగా ఉంది. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన చోట.. నష్టం అపారంగా ఉంది. చిత్తూరులో జిల్లాలో కొంత భాగం, నెల్లూరులో కూడా వరదల ప్రభావం అధికంగా ఉంది. కడప జిల్లాలో మౌలిక సదుపాయాల నిర్మాణాలు దారుణంగా దెబ్బతిన్నాయి, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట చేతికందుతున్న సమయంలో నీట పాలైంది. శ‌నగ పంట కూడా తీవ్రంగా దెబ్బతింది. వాటర్‌ స్కీములు కూడా దెబ్బతిన్నాయి. అన్నమయ్య నుంచి వెళ్లే తాగునీటి సరఫరా వ్యవస్థలకు తీవ్ర నష్టం వాటిల్లింది:

అధికారులు చాలా బాగా పనిచేశారు..
ఇరిగేషన్‌కూ తీవ్ర నష్టం ఏర్పడింది. బ్రిడ్జిలు, రోడ్లు తెగిపోవడం వల్ల చాలా గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. వరద బాధిత ప్రాంతాల్లో అధికారులు చాలా బాగా పనిచేశారు. విద్యుత్ సహా అన్నిరకాల శాఖలు చాలా బాగా పనిచేశాయి. అత్యవసర సర్వీసులను వెంటనే పునరుద్ధరించడంలో అధికారులు చాలా బాగా పనిచేశారు. ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు ఇంత త్వరగా కరెంటు పునరుద్ధరణ అన్నది సహజంగా జరగదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ప్రశంసనీయం. సహాయ కార్యక్రమాలకోసం కలెక్టర్లకు వెంటనే నిధులు ఇచ్చారు. దీనివల్ల పనులు చాలా వేగంగా జరిగాయి. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఏర్పాటును మేం చూడలేదు. ఈ డబ్బును బాధితులను వెంటనే ఆదుకునేందుకు వాడుకున్నారు. అలాగే జేసీబీలు పెట్టి.. అవసరమైనచోట యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. సహాయక శిబిరాలను తెరిచి ముంపు బాధితులను ఆదుకున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు తీసుకున్న ఈ చర్యలన్నీ ప్రశంసనీయం. వరదల వల్ల జరిగిన నష్టంలో 40శాతం రోడ్లు, భవనాలు ల్లాంటి రూపేణా జరిగింది. 32 శాతం నష్టం వ్యవసాయం, అనుబంధ రంగాల్లో జరిగింది, ఇగిగేషన్‌ స్కీంల రూపేణా 16శాతం మేర జరిగింది. వీలైనంత మేర ఆదుకోవడానికి మావంతు సహకారాన్ని అందిస్తాం అని కేంద్ర బృందం ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించింది. 

ధాన్యం కొనుగోలులో నిబంధనల సడలింపు చేయాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ కోరారు. భారీ వర్షాలు కారణంగా పంటలు దెబ్బతిన్నంటున తేమ, ఇతరత్రా నిబంధనల విషయలో సడలింపులు ఇవ్వాలని కోరారు. 

కేంద్ర బృందంతో సీఎం ఏమన్నారంటే..

ఇలాంటి విపత్తు హృదయవిదారకరం. న‌ష్టం అంచనాలకోసం మీరు ఆయా ప్రాంతాల్లో పర్యటించినందుకు ధన్యవాదాలు. ఉదారంగా, మానవతా పరంగా స్పందించాలని కోరుతున్నా. మేం పంపించిన నష్టం వివరాల్లో ఎలాంటి పెంపు లేదు. నష్టం అంచనాల తయారీకి క్షేత్రస్థాయిలో మాకు సమర్థవంతమైన వ్యవస్థ ఉంది. ప్రతి గ్రామంలో ఆర్బీకే ఉంది, ప్రతి రైతు పంటకూడా ఈ–క్రాప్‌ అయ్యింది. సోషల్ ఆడిట్ కూడా చేయించాం. ఈ– క్రాప్‌కు సంబంధించి రశీదుకూడా రైతుకు ఇచ్చాం. న‌ష్టపోయిన పంటలకు సంబంధించి కచ్చితమైన, నిర్దారించబడ్డ లెక్కలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో నష్టానికి సంబంధించి వాస్తవ వివరాలను మీకు అందించాం. కోవిడ్‌ నియంత్రణ చర్యల కోసం వినియోగించినందువల్ల ఎస్టీఆర్‌ఎఫ్‌ నిధులు నిండుకున్నాయని మా ఆర్థిక శాఖ కార్యదర్శి మీకు వివరించారు. పనులు చేయాలంటే నిధులు అవసరం, వెంటనే అడహాక్‌ ప్రాతిపదికన నిధులు ఇవ్వాలని కోరుతున్నాం. కేంద్ర బృందం చేసిన సూచనలనూ పరిగణలోకి తీసుకుంటాం. దీర్ఘకాలంలో ఇలాంటి విపత్తులను నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. వరదనీటిని తరలించడానికి ఇప్పుడున్న కాల్వల సామర్థ్యాన్ని పెంచేలా ఇటీవలే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. వీలైనంత త్వరగా పెద్దమొత్తంలో నీటిని తరలించే అవకాశం ఏర్పడుతుంది. ఈకార్యక్రమంలో భాగంగా ఇప్పుడున్న రిజర్వాయర్లు, డ్యాంలపై పరిశీలన చేసి తగిన చర్యలు చేపడతాం. ఆటోమేటిక్‌ వాగర్‌ గేజ్‌ సిస్టంపైనా దృష్టిపెడతాం అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ వివ‌రించారు. 

Back to Top