తాడేపల్లి: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కూటమి పార్టీలకు భారీ షాక్ తగిలింది. బీజేపీ, టీడీపీకి చెందిన కీలక నేతలు ఆ పార్టీని వీడి వైయస్ఆర్సీపీ గూటికి చేరారు. ఇవాళ తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ సమక్షంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ బీజేపీ, టీడీపీ నాయకులు వైయస్ఆర్సీపీలో చేరారు. కె.ఆర్.మురహరి రెడ్డి (ఎమ్మిగనూరు బీజేపీ అసెంబ్లీ ఇంఛార్జ్), కిరణ్ కుమార్ (బీజేపీ ఎమ్మిగనూరు టౌన్ ప్రెసిడెంట్), మాల మధుబాబు (టీడీపీ మాజీ కౌన్సిలర్ - ఎమ్మిగనూరు), చేనేత మల్లికార్జున (టీడీపీ ఎమ్మిగనూరు సిటీ జనరల్ సెక్రటరీ)లకు వైయస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బుట్టా రేణుక, కర్నూలు జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎస్ వి మోహన్ రెడ్డి, కర్నూలు పార్లమెంట్ వైయస్ఆర్సీపీ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎర్రకోట జగన్మోహన్రెడ్డి, పలువురు కర్నూలు జిల్లా నాయకులు పాల్గొన్నారు.