తిరుపతి: ఏబీ వెంకటేశ్వరరావు అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారాడని ప్రభుత్వ విప్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. అవినీతి సొమ్ముతో తెలంగాణలో భూములు కొనుగోలు చేశారని, ఆ భూములకు రైతుబంధు పథకం ద్వారా రూ.67 లక్షలు తీసుకున్నాడని చెవిరెడ్డి వివరించారు. ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తిరుపతిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ భద్రతను కాపాడాల్సిన ఒక ఐపీఎస్ అధికారిగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం డీజీగా ఉండి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఏబీ వెంకటేశ్వరరావు అవినీతి అక్రమాలు మరికొన్ని త్వరలోనే బయట పెడతానన్నారు. అవినీతి తిమింగలం అయిన ఏబీ వెంకటేశ్వరరావు విషయాన్ని కేంద్రం సీరియస్గా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయనపై సంఘ విద్రోహం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఘట్టమనేని శ్రీనివాస్ అనే వ్యక్తి ఏబీ వెంకటేశ్వరరావు బినామీ అని చెవిరెడ్డి చెప్పారు. ఆయన అవినీతి అక్రమాలు మిగతా ఐపీఎస్ అధికారులకు కూడా తెలుసన్నారు. విజయవాడ జంట హత్యల కేసులో కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు కాజేశాడన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు దేశం విడిచిపెట్టి పోయే ప్రమాదం ఉందని.. కేంద్రం వెంటనే లుకౌట్ నోటీసులు విడుదల చేయాలని కోరారు. దేశ భద్రత దృష్ట్యా మాట్లాడుతున్నానని, అతనిపై తనకు వ్యక్తిగత కక్షలేమీ లేవని చెవిరెడ్డి వివరించారు. ఇలాంటి వ్యక్తులను ఎవరు మద్దతుగా నిలవకూడదని.. ప్రభుత్వ చర్యలను ప్రతి ఒక్కరూ సమర్థించాలని కోరారు.