గిరిజనుల కలను సీఎం వైయస్‌ జగన్‌ సాకారం చేస్తున్నారు

వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుక

అల్లూరి చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించిన నేతలు

తాడేపల్లి: ఆదివాసీల ప్రయోజనాలను కాపాడుతూ సీఎం వైయస్‌ జగన్‌ అనేక కార్యక్రమాలను చేపట్టారని, గిరిజనుల కలను ముఖ్యమంత్రి సాకారం చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, వరుదు కల్యాణి, పార్టీ ఎస్టీ విభాగం అధ్యక్షుడు హనుమంతు నాయక్‌, డొక్కా మాణిక్యవరప్రసాద్, పార్టీ నేతలు పాల్గొని అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. బ్రిటీష్ వలస పాలకులకు వ్యతిరేకంగా, ఆదివాసీల హక్కులకోసం పోరాడిన విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు. ఆయన చేసిన పోరాటం చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించాలి. ఇంతటి ఘనచరిత కలిగిన‌ స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరిని తరతరాలవారు స్మరించుకునేలా.. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టడం జరిగింది. అల్లూరి స్ఫూర్తితో, ఆదివాసీల హక్కుల్ని కాపాడటంలోనూ, వారికి అన్నిరకాలుగా అండదండలు అందించడంలో వైయ‌స్ఆర్ సీపీ ప్రభుత్వం ముందుంది. గిరిజనులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశాం. వారి ఆధీనంలోని పోడు భూముల వ్యవసాయాన్ని ఎవరూ ఆటంకపరచకుండా వ్యవసాయ పట్టాల్ని ఇచ్చాం. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అల్లూరి లాంటి కారణజన్ములు చాలా అరుదుగా పుడతారు. అలాంటివారిని స్మరించుకోవడం మన ఆదృష్టమని చెబుతూ.. వారికి ఘనమైన నివాళులర్పిస్తున్నాను. 

పార్టీ సీనియర్ నేత , ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. దేశచరిత్రలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు వింటేనే ప్రతి ఒక్కరిలో పోరాట స్ఫూర్తి రగులుతుంది. బ్రిటీషు పాలకులను ఎదిరించి పోరాడిన వీరుడు, యోధుడు మన అల్లూరి. ఈ సందర్భంగా అల్లూరికి ఘనమైన నివాళులర్పిస్తున్నాను.
 
డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధులు, విప్లవకారుడు, తెలుగుజాతి ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు 126వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి, వైయ‌స్‌ఆర్‌సీపీ కార్యకర్తలకు శుభాకాంక్షలు. ఆ మహానుభావుడ్ని తలుచుకోవడమే తెలుగువారి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటుతున్నట్లుగా మనం భావించాలి. అక్షరజ్ఞానం తెలియని అటవీజనాన్ని కూడా స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనేలా చేసిన మహాపురుషుడు అల్లూరి. తెలుగువారి చరిత్రలో అల్లూరి త్యాగానికి ప్రత్యేకస్థానం ఉంది. ఎమ్మెల్సీ వరదు కల్యాణి మాట్లాడుతూ.. అల్లూరిని స్ఫూర్తిగా తీసుకుని గిరిజనుల సంక్షేమంపై సీఎం వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో  పనిచేస్తుందని చెప్పేందుకు గర్విస్తున్నాను.

 

Back to Top