తాడేపల్లి: ఆగస్టు 16న స్కూళ్లు పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. విద్యాశాఖకు సంబంధించిన నాడు-నేడు కార్యక్రమంపై సీఎం వైయస్ జగన్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ ..ఆగస్టు 16న పండుగలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. తొలి విడత నాడు-నేడు కింద 15 వేలకు పైగా స్కూళ్లను తీర్చిదిద్దామని పేర్కొన్నారు. రెండో దశ కింద 16వేల స్కూళ్ల పనులను ప్రారంభిస్తామని, విద్యాకానుక కిట్లు కూడా అందించబోతున్నామని తెలిపారు. ప్రీ ప్రైమరీ నుంచి ప్లస్ టూ వరకు మంచి విద్యావ్యవస్థను తీసుకొస్తున్నామన్నారు. ఆగస్టు 16న నూతన విద్యా విధానంపై సమగ్రంగా వివరిస్తామని పేర్కొన్నారు. చర్లందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేశామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. సాయంత్రం 4 గంటలకు ఇంటర్ ఫలితాలు ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల చేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. పరీక్ష ఫలితాలను వెబ్సైట్లలో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఇంటర్ రెండో ఏడాది విద్యార్థులు 2019లో పది, 2020లో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను రాశారు. ఈ రెండింటిని కలిపి రెండో ఏడాది మార్కులను ఖరారు చేయాలని ఛాయరతన్ కమిటీ నిర్ణయించింది. పదోతరగతి మార్కులకు 30శాతం, బైపీసీ, ఎంపీసీ విద్యార్థులకు ప్రథమ సంవత్సరంతో పాటు ఇటీవల నిర్వహించిన ప్రయోగ పరీక్షలతో కలిపి 70 శాతం చొప్పున వెయిటేజీ తీసుకొని రెండో ఏడాదికి వంద శాతానికి మార్కులు కేటాయిస్తారు. ఆర్ట్స్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు ఉండనందున ఇంటర్ ప్రథమ సంవత్సరం మార్కులు, పదో తరగతి మార్కుల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వ పరీక్షల విభాగాన్ని ఇంటర్ విద్యామండలి కోరింది. ఈ వెబ్సైట్లలో ఫలితాలు.. examsresults.ap.nic.in, bie.ap.gov.in results.bie.ap.gov.in, results.apcfss.in