రివర్స్‌టెండరింగ్‌తో శుభారంభం

సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయంతోనే రూ. 58.50 కోట్ల ఆదా

ట్రాన్స్‌పరెన్సీ విధానంతో ముందుకెళ్తున్నాం

బాబూ ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకో

లేకుంటే ప్రజలు శాశ్వతంగా ఇంటికి పంపిస్తారు

ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌

 

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న రివర్స్‌టెండరింగ్‌ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బు ఆదా అయిందని ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ చెప్పారు. వంద కోట్ల రూపాయల పనులు దాటితే దాన్ని జ్యూడియల్‌ కమిటీకి అప్పగిస్తామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రమాణస్వీకారం రోజే చెప్పారన్నారు. సీఎం తీసుకున్న రివర్స్‌టెండరింగ్‌ నిర్ణయం ద్వారా పోలవరం లెఫ్ట్‌ కెనాలకు వేసిన టెండర్‌లో గతంలో 4.77 ఎక్సెస్‌తో పనులు దక్కించుకున్న మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా సంస్థ ఇప్పుడు 15.6 శాతం తక్కువ ధరకు దక్కించుకుందన్నారు. సుమారు రూ. 2 వందల కోట్లకు సంబంధించిన పని ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 58.50 కోట్ల ఆదాయం చేకూరిందని వివరించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడారు.

ఏ పనిలోనైనా పారదర్శకత ఉండాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు పదే పదే సూచించడం జరుగుతుందన్నారు. పారదర్శకత పాలన మూలంగానే రాష్ట్ర ఖజానాకు శుభారంభం పలికామన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రభుత్వంపై చంద్రబాబు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, రివర్స్‌టెండరింగ్‌ అంటే వారికి అనుకూలంగా ఉన్నవారికే ఇస్తాడని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు 4.77 శాతం అధిక ధరకు మ్యాక్స్‌ఇన్‌ఫ్రా కంపెనీకి కట్టబెట్టాడని, అదే కంపెనీ సీఎం వైయస్‌ జగన్‌ రివర్స్‌టెండరింగ్‌ విధానంలో 15.6 శాతం తక్కువ ధరకు దక్కించుకుందన్నారు. అంటే చంద్రబాబు పోలవరంలో దోపిడీ చేశారని స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. వైయస్‌ జగన్‌ సర్కార్‌ రాష్ట్ర ఖజానాకి డబ్బులు ఆదా చేసిందని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మరోసారి గుర్తుచేశారు.

వయస్సు పైబడుతుంది ఇంకా చిల్లర రాజకీయాలు, ఛీప్‌ రాజకీయాలు ఎందుకు.. మానుకో చంద్రబాబూ అని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ సూచించారు. టీడీపీ గత ఐదేళ్లలో ప్రతీది అడ్డగోలుగా అవినీతి చేసిందన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ లక్షా 25 వేలకు పైగా ఉద్యోగాలు ఇస్తుంటే దాని మీద కూడా చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నాడన్నారు. ఇంత కంటే దిగజారుడుతనం ఎక్కడైనా ఉంటుందా.. చంద్రబాబూ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలంతా శాశ్వతంగా ఇంటికి పంపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. రివర్స్‌టెండరింగ్‌ విధానం ద్వారా  పోలవరం మెయిన్‌ కెనాల్‌ టెండరింగ్‌ కూడా రాబోతుంది. దానిలో కూడా మంచి రిజల్ట్‌ రావొచ్చు. రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు మిగిల్చే ప్రయత్నం చేస్తామన్నారు.  

Back to Top