రాయ‌లసీమ ఎత్తిపోత‌ల‌కు లైన్ క్లియ‌ర్‌

పర్యావరణ అనుమతులు అవసరం లేద‌న్న కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ

పొరుగు రాష్ట్రం నుంచి తొల‌గిన అడ్డంకులు

టెండ‌ర్ల ప్ర‌క్రియ‌లో ఉన్న ప్రాజెక్టు

వ‌ర‌ద నీటిని సీమ‌కు మ‌ళ్లించ‌డ‌మే ప్ర‌భుత్వ ధ్యేయం

సీమ‌ను స‌స్య‌శ్యామ‌లం చేయాల‌న్న సీఎం ల‌క్ష్యం నెర‌వేరే రోజు ద‌గ్గ‌ర్లోనే..

అమ‌రావ‌తి: కృష్ణా నదీ జలాల్లో తమ వాటాగా దక్కిన నీటిని వినియోగించుకోవడం ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజలకు సాగు, తాగునీటి కష్టాలను తీర్చాలని ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకంను చేపట్టింది. క‌ర్నూలు జిల్లాలో ఎత్తిపోత‌ల ప‌థ‌కం నిర్మించి, విస్త‌ర‌ణ ప‌నులు చేప‌ట్టి వ‌ర‌ద నీటిని త‌ర‌లించాల‌న్న‌దే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఉద్దేశం.  కాగా, ఈ ప‌థ‌కానికి ప‌లు అవంత‌రాలు ఎదురు కాగా, ఎట్ట‌కేల‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో అడ్డంకులు తొల‌గిపోన‌ట్లు అయ్యింది. అంత‌రాష్ట్ర‌ వివాదంగా మారిన రాయలసీమ ఎత్తిపోథల పథకం అనుమతుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయం సాధించి ముందడుగు వేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ పరమైన అనుమతులు అవసరం లేదంటు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన కమిటీ తేల్చిచెప్పింది. దీంతో ఈ ప్రాజెక్ట నిర్మాణానికి ప్రధానమైన అడ్డంకి తొలగిపోయినట్లయిది. 

 తెలంగాణ అభ్యంతరాలను కొట్టేస్తూ..
రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం నిర్మాణం అక్రమం అంటూ తెలంగాణకు చెందిన రాజకీయ పక్షాలు, మరికొందరు రాజకీయ నాయకులు కోర్టుల్లో కేసులు వేశారు. పర్యావరణ పరమైన అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేప‌ట్ట‌రాద‌ని కోర్టుకెక్కారు. ఈ  అంశంపై రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు కోర్టుల‌ను ఆశ్ర‌యించాయి.  ఇప్పటికే ఎన్జీటి రెండు దఫాలు విచారించి తొలిదశలో నిర్మాణం చేపట్టరాదంటూ స్టే విధించినప్పటికీ ..ఆ తర్వాత స్టే ను ఎత్తివేసి తుది అనుమతులు కేంద్ర పర్యావరణ శాఖ నిర్ణయంపై ఆధారపడి ఉంటాయని తేల్చి చెప్పింది. ఆ మేరకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కమిటీని నియమించింది.  ఈ కమిటీలో రెండు రాష్ట్రాల‌కు సంబంధించిన అధికారులు కూడా సభ్యులుగా ఉన్నారు. కమిటీ తొలుత విచారించి తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాలకు అనుగుణంగా అభ్యంతరాలను వ్యక్తం చేసింది. దానిపై ఏపి ప్రభుత్వం మరీ ముఖ్యంగా నీటి పారుదల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమర్థవంతంగా వాదనలు వినిపించడంతో తెలంగాణ అభ్యంతరాలను కొట్టేస్తూ ఏపి ప్రభుత్వ అభిప్రాయాలతో ఏకీభవించింది. కమిటీ తన తుది నివేదికను తాజాగా పర్యావరణ మంత్రిత్వశాఖకు అనుబంధంగా ఉండే వెబ్ సైట్లో పొందుపరిచింది. దీని ప్రకారం ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి పర్యావరణ మంత్రిత్వ శాఖ ను అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. రాయలసీమ ఎత్తిపోథల పథకం నిర్మాణంలో అడవులు, జంతుజాలం, పర్యావరణం పరమైన సమస్యలేమీ లేవని అందువల్ల పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతివ్వడం అనే సమస్య ఉత్పన్నం కాబోదని తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. 

 రాయలసీమ ఎత్తిపోతల పథకానికి టెండ‌ర్ల ఆహ్వానం
రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఏపీ ప్ర‌భుత్వం టెండ‌ర్లు ఆహ్వానించింది.  ఈ నెల 27వ తేదీ నుంచి టెండర్లు స్వీకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారి చేసింది. జ్యూడిషియల్‌ పర్వ్యూ అనుమతితో టెండర్లకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈపీసీ విధానంలో 3278.18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 30 నెలల్లో పనులు పూర్తి చేసేలా  టెండర్లను ఆహ్వానించారు.  ఈ నెల13వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అప్లీకేషన్‌లు స్వీకరించనున్నట్లు చెప్పారు.13న టెక్నికల్ బిడ్ తెరిచి, 17న రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహించి 19న టెండర్‌ను ఖరారు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.  ఇంత‌లోనే పొరుగు రాష్ట్రం అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసింది. అందులో నీటి లభ్యత, నీటి పై హక్కులతో పాటు పర్యావరణ పరమైన అంశాలను ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా పర్యవరణ అనుమతులు ప్రత్యేకంగా అవసరం లేదంటూ ఇచ్చిన కమిటీ నిర్ణయం వల్ల ఏపి ప్రభుత్వం తన పనులను య‌ధావిధిగా కొనసాగించేందుకు సానుకూల వాతావరణం ఏర్పడింది.  రాష్ట్రంలోనే అతిపెద్దదిగా భావించే ఈ ప్రతిపాదిత ఎత్తిపోతల పథకం పూర్తయితే వరద నీటితో పాటు రాయలసీమ ప్రాజెక్ట్‌కు కేటాయించిన నీటిని వాడుకునేందుకు వీలవుతుంది. 

ఇంత‌వ‌ర‌కు ఎవ‌రికీ రాని ఆలోచ‌న‌..

రాయలసీమ రూపురేఖలు మార్చేందుకు ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి   ‘రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీ‌కారం చుట్టారు. అంత‌రాష్ట్ర వివాదాలను అధిగమిస్తూ, సాంకేతిక సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళుతోంది. రాయలసీమలోనే చేపడుతున్న ఈ పథకం రోజుకు 3 టిఎంసీల నీటిని పంపింగ్ చేసేలా చేపడుతున్నారు. ఇంతవరకు రాష్ట్రంలో ఇంత పెద్ద పంపింగ్ ప్రాజెక్ట్ నిర్మించనే లేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా సంగమేశ్వర వద్ద నిర్మిస్తున్నారు. ఇంత వరకు ఏ ప్రభుత్వానికి, ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన ఆయనకు వచ్చిందే తడవుగా శాస్త్ర‌, సాంకేతిక-సాధ్యసాధ్యాలను అధ్యయనం చేయించాక పని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే రాయలసీమలో అత్యధిక ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించడమే కాకుండా, శతాబ్దాలుగా కరువు వాత పడుతున్న వారిని శాశ్వతంగా ఆదుకునేందుకు సాధ్యమవుతుంది.  ఎన్నో దశాబ్దాలుగా సీమ తాగు, సాగు నీటి అవసరాల కోసం కృష్ణా జలాలను రాయలసీమకు మళ్లించాలని డిమాండ్ ఉన్నప్పటికీ ఈ విధమైన స్పష్టతతో కూడిన కార్యాచరణను ఎవరు ప్రతిపాదించలేకపోయారు. ఏ ప్రభుత్వం కూడా ఆలోచించలేకపోయింది. 

397 మెగావాట్ల భారీ పంపింగ్ కేంద్రం..

ఈ పథకానికి మొత్తం 397 మెగావాట్ల విద్యుత్ వినియోగం అవసరమవుతుంది. ఇంత పెద్ద స్థాయిలో విద్యుత్ ను వినియోగించి ఒక కేంద్రం నుంచి నీటిని పంపింగ్ చేయడం రాష్ట్రంలో ఇంతవరకు ఎక్కడా లేదు. ఏపిలో ఇదే అరుదైనది, పెద్దది అవుతుంది. ఈ పంప్ హౌస్ పనిచేయాలంటే కనీస నీటిమట్టం 243 ఉండాలి. డెలివరీ లెవల్ 273 వద్ద ఉంటుంది.  ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ముఖ్యంగా కొత్త కాలువ తవ్వడానికి 12 వేల ఎకరాల భూమిని సేకరించాలని అంచనా వేశారు.  రాయలసీమ ఎత్తిపోతల పథకం (ఆర్.ఎల్.పి – రాయలసీమ లిప్ట్ ప్రాజెక్ట్) ద్వారా రోజు 3 టిఎంసిల (34722 క్యూసెక్కులు) నీటిని వరదల సమయంలో కృష్ణా నది నుంచి రాయలసీమకు మళ్లించనున్నారు. ఉపనది తుంగభద్ర వచ్చి కృష్ణాలో కలిసే సంగమేశ్వరం ప్రాంతం వద్ద ఈ పథకాన్ని చేపట్టనున్నారు. ఇక్కడ మూడు టిఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా పంపింగ్ కేంద్రాన్ని నిర్మించనున్నారు. 

సీమ అవ‌స‌రాలు తీర్చాల‌న్న‌దే ప్ర‌భుత్వ ఉద్దేశం

జలాశయంలో 800 నుంచి 850 అడుగుల వరకు నీరు ఉన్నప్పుడు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా అవసరాలకు మళ్లించే విధంగా నీటిని పంప్ చేసి పోతిరెడ్డిపాడు సమీపంలోని 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎస్ఆర్ఎంసీలోకి విడుదల చేస్తారు. కృష్ణా నదికి గరిష్టంగా వరదలు ఉన్నపుడు రోజుకు 8 టిఎంసీల వరకు కూడా పంప్ చేసేందుకు ఉపయోగపడే విధంగా నిర్మించి సీమ అవసరాలు తీర్చాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ లో పంప్ హౌస్ తో పాటు సంగమేశ్వర నుంచి ముచ్చుమర్రి వరకు 4.5 కిలోమీటర్ల కాలువ శ్రీశైలం వెనుక జలాల భాగంలో తవ్వుతారు. పంప్ హౌస్ లో 12 మిషన్లు ఏర్పాటు అవుతాయి. ఒక్కొక్కటి 81.93 క్యుమెక్కుల సామర్థ్యంతో 39.60 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేసే విధంగా 33.04 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంప్ లు, మోటార్లు ఏర్పాటు అవుతాయి. 

వ‌ర‌ద నీటిని మళ్లించ‌డ‌మే ల‌క్ష్యం

శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమకు పోతిరెడ్డిపాడు ద్వారా 114 టిఎంసిల నీటిని వినియోగించాల్సి ఉండగా గత రెండు సంవత్సరాలు మినహాయిస్తే మిగిలిన ఏ ఏడాది కూడా సగం నీటిని కూడా సీమ ప్రాజెక్ట్ లకు మళ్లించలేకపోయారు. 2004-5 నుంచి 2019-20 వరకు నీటి వినియోగాన్ని పరిశీలిస్తే ఆ విషయం తేటాతెల్లం అవుతోంది. మొత్తం 16 ఏళ్ళ పాటు పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీటి వినియోగాన్ని పరిశీలిస్తే 2018-19, 2019-20 సంవత్సరాల్లో మినహాయిస్తే మిగిలిన అన్ని సంవత్సరాలు లభించాల్సిన నీటి కన్నా తక్కువ నీరు అందింది. ఆఖరికి కృష్ణాన‌దికి భారీ వరదలు వచ్చి శ్రీశైలం పొంగిప్రవహించి జలాలు సముద్రంపాలు అయినప్పటికీ రాయలసీమ వాసులకు మాత్రం ప్రయోజనం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో తక్కువ సమయంలో ఎక్కువ వరద నీటిని మళ్లించుకోవడమే ఏకైక శరణ్యమని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి తలంచారు. దాంతో ఇంజనీరింగ్ నిపుణులు అధ్యయనం చేసి ఆచరణలో సాధ్యమని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. త్వ‌ర‌లోనే రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం ప‌నులు ప్రారంభ‌మై..ఈ ప్రాజెక్టు పూర్తి అయితే రాయ‌ల‌సీమ రాత‌నాల సీమ కావ‌డం ఖాయ‌మ‌ని ఆ ప్రాంత ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. కేంద్రం అనుమ‌తులు ఇవ్వ‌డంతో రాయ‌ల‌సీమ‌ను స‌స్య‌శ్యామ‌లం చేయాల‌నుకుంటున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న ల‌క్ష్యం నెర‌వేరే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయ‌ని రైతాంగం హర్షం వ్య‌క్తం చేస్తోంది. 

Back to Top