సచివాలయం: రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ నెలలో కీలక పథకాలను ప్రారంభించనుంది. సచివాలయంలో జరిగిన పలు శాఖలపై జరిగిన సమీక్షా సమావేశాల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఈ విషయాలను వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు. నవంబర్లో చేపట్టబోయే పథకాలు.. – నవంబర్ 2 నుంచి వైయస్ఆర్ కంటి వెలుగు రెండో విడత ప్రారంభం కానుందని సీఎం వైయస్ చెప్పారు. తొలి విడతలో 69.03 లక్షల మంది పిల్లల్లో 65.03 లక్షల మందికి కంటి పరీక్షలు చేసినట్లు వివరించారు. ఇందులో 4.3 లక్షల మంది పిల్లలు కంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ స్కూల్స్ ప్రాంగణాల్లోనే రెండో విడత కంటి వెలుగు ప్రారంభం కానుందని, పిల్లలకు స్క్రీనింగ్ చేసి కంటి అద్దాలు అందజేయనున్నట్లు చెప్పారు. – నవంబర్ 1వ తేదీ నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఆరోగ్యశ్రీ అమలు. ఇప్పటి వరకు దాదాపు 130 ఆస్పత్రులు ఎంప్యానల్ అయ్యాయని సీఎం చెప్పారు. ప్రభుత్వాస్పత్రుల్లో 500 రకాల మందులు లభిస్తాయి. నవంబర్ 20 నుంచి ప్రభుత్వాస్పత్రులకు మందుల పంపిణీ చేయనున్నామని, ప్రభుత్వ ఆస్పత్రులను కలెక్టర్లు తనిఖీ చేయాలని సూచించారు. – నవంబర్ 7న అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు. రూ. 10 వేల లోపు డిపాజిట్దారులకు రూ.264 కోట్లు విడుదల. మొత్తం 3 లక్షలకుపైగా బాధితులకు చెల్లింపులు చేస్తామని సీఎం వివరించారు. – నవంబర్ 14 నుంచి పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమం. తొలి విడతలో 15 వేలకు పైగా స్కూళ్లలో అభివృద్ధి కార్యక్రమాలు. వచ్చే ఏడాది మార్చి 30 నాటికి అభివృద్ధి పనులు పూర్తి కావాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. వచ్చే ఏడాది 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం.. ఆ తరువాత ఏడాది 9వ తరగతి, మరుసటి ఏడాది పదో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. – నవంబర్ 21న మత్స్యకారులకు సబ్సిడీపై డీజిల్, సముద్రంలో వేటకు వెళ్లే కుటుంబానికి రూ.10 వేల సాయం అందించనున్నట్లు సీఎం వైయస్ జగన్ వివరించారు. లీటర్ డీజిల్పై రూ.6.03 ఉన్న సబ్సిడీ రూ.9లకు పెంచామన్నారు. ముమ్మిడివరంలో జరిగే కార్యక్రమంలో సీఎం వైయస్ జగన్ పాల్గొననున్నారు. – డిసెంబర్ 3న వైయస్ఆర్ లా నేస్తం పథకం ప్రారంభం. యువ న్యాయవాదులకు ఉపకార వేతనంగా రూ. 5 వేలు అందించనున్న ప్రభుత్వం. Read Also: రేపు ఏపీ మంత్రి వర్గ సమావేశం