రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా ముస్లింలను దూరం పెట్టి, కనీసం మంత్రివర్గంలోనూ స్థానం కల్పించకుండా అవమానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో లబ్ధి కోసం వారికి డిప్యూటి సీఎం పదవి ఇస్తానని చెబుతున్నారు. ముస్లింలను అంటరానివారుగా పరిగణించి, ఇప్పుడు ఎన్నికలు రావడంతో వారికి దగ్గరయ్యేందుకు చంద్రబాబు వ్యూహలు పన్నుతున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఒక్కరైనా ముస్లిం లేని రాష్ట్ర మంత్రివర్గం చంద్రబాబుదే కావడం గమనార్హం. మంత్రి పదవి ఇవ్వడానికి తమ పార్టీ తరఫున ముస్లింలు ఎవరూ ఎమ్మెల్యేగా నెగ్గలేదని ముఖ్యమంత్రి నాలుగున్నరేళ్లు సాకులు చెప్పి తప్పించుకున్నారు. మరోవైపు తన కుమారుడు నారా లోకేశ్ను ఎమ్మెల్సీని చేసి, ఏకంగా మంత్రి పదవి కట్టబెట్టారు. ముస్లింల సంక్షేమం, అభివృద్ధిపై చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అదే మార్గాన్ని అనుసరించి ఉండేవారు. మైనారిటీ సంక్షేమానికి బడ్జె ట్లో కేటాయించిన నిధుల్లో కనీసం 30 శాతం సొమ్మును కూడా టీడీపీ ప్రభుత్వం ఖర్చుపె ట్టలేదు. దీన్నిబట్టి ముస్లింలపై చంద్రబా బుకున్న ప్రేమ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. నాలుగేళ్ల తన పాలనపై ఉన్న వ్యతిరేకతను నాటకీయంగా బీజేపీపైకి నెడుతూ ఆ పార్టీకి స్వతహాగా వ్యతిరేకంగా ఉండే ముస్లిం, ఇతర వర్గాలను దగ్గరకు తీసుకునే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. వైసీపీ నుంచి గెలిపిన చాంద్బాషా, జలీల్ఖాన్లను టీడీపీలో చేర్చుకొని మంత్రి పదవులు ఇస్తానని నమ్మించి మోసం చేశారు. ఎన్నికలకు మూడు నెలల ముందు ఎన్ఎండీ ఫరూక్ను మంత్రివర్గంలోకి తీసుకొని ఈ వర్గానికి ఏదో మేలు చేసినట్లు కలరింగ్ ఇచ్చారు. అయితే చంద్రబాబును ముస్లింలు నమ్మలేదు. దీంతో గుంటూరులో నారా హమారా, టీడీపీ హమారా పేరుతో భారీ బహిరంగ సభ పెట్టినా ముస్లింలు చంద్రబాబును నిలదీయడంతో ఆ వర్గానికి తాయిలాలు ప్రకటించి, ముస్లింలపై ఓట్ల వల విసిరేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ముస్లింలు తనకు ఓట్లు వేయలేదనే అక్కసుతో చంద్రబాబు మంత్రివర్గంలో వారికి స్థానం కల్పించలేదు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి ఇస్తానంటే ఎవరైనా నమ్ముతారా?