చిరకాల స్వప్నం సాకారం

గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలు నేడు జాతికి అంకితం చేయ‌నున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

బ్యారేజీ వ‌ద్ద దివంగ‌త మ‌హానేత వైయ‌స్ఆర్‌, గౌతంరెడ్డిల విగ్ర‌హాల ఆవిష్క‌ర‌ణ‌

నెల్లూరు: జిల్లా ప్రజల దశాబ్దాల స్వప్నం సాకారం. దివంగత సీఎం వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి సంకల్పించిన జలయజ్ఞంను ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి చేసి స్ఫూర్తిగా నిలిచారు. ప్రాజెక్ట్‌లు పూర్తి చేయాలనే చిత్తశుద్ధి లేని గత పాలకుల దుర్నీతి పాలనకు దశాబ్ద కాలంపాటు గ్రహణం పట్టింది. తన తండ్రి సంకల్పించిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలనే దృఢ నిశ్చయంతో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వడివడిగా పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్న మహోజ్వల ఘట్టం నేడు ఆవిష్కృతమవుతోంది.  

దివంగత సీఎం వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా 2006 మే 28న శంకుస్థాపన చేశారు. 2008లో పనులు ప్రారంభించారు. శరవేగంగా కొనసాగిన ఆ పనులు వైయ‌స్ఆర్ హఠాన్మరణంతో ప్రాజెక్ట్‌ల పనులన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయాయి. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం సైతం కమీషన్లు దక్కే పనులకే ప్రాధాన్యం ఇచ్చి పనులను నత్తనడకన సాగించారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రి అయిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ ఆవశ్యకతను సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు.

చిత్తశుద్ధితో బ్యారేజీ పనులకు శ్రీకారం చుట్టారు. అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా జిల్లాకు చెందిన డాక్టర్‌ అనిల్‌కుమార్‌యాదవ్‌ కొనసాగుతుండడంతో అటు సంగం, ఇటు నెల్లూరు బ్యారేజీ పనులకు అత్యంత ప్రాధాన్యత లభించింది. ఈలోపు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం చెందడంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరును నామకరణం చేసి, శరవేగంగా ప్రాజెక్టు పనులు పూర్తి చేశారు. దీంతో పెన్నాడెల్టాలోని 2.47 లక్షలు, కనుపూరు కాలువ కింద 63 వేలు, కావలి కాలువ కింద 75 వేలు మొత్తంగా 3.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు మార్గం ఏర్పడింది. మరో వైపు పెన్నానది వరదలను సమర్థవంతంగా నియంత్రించి, వరద ముంపు ముప్పునకు శాశ్వత పరిష్కారం దక్కింది. నెల్లూరు బ్యారేజీ ద్వారా సర్వేపల్లి, కోవూరు, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గాల పరిధిలో 99,525 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది.

 
నెల్లూరు బ్యారేజ్‌
ఎక్కడ : నెల్లూరు నగరానికి సమీపంలో పెన్నా నదిపై (మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌కు 20 కి.మీ. దిగువన) 
పరీవాహక ప్రాంతం : 51,800 చదరపు కిలోమీటర్లు 
బ్యారేజ్‌ పొడవు : 640 మీటర్లు (బ్యారేజ్‌కు అనుబంధంగా రెండు వరుసల రోడ్‌ బ్రిడ్జి) 
గేట్లు : 51 (పది మీటర్లు ఎత్తు, మూడు మీటర్ల వెడల్పుతో 43 గేట్లు.. పది మీటర్లు ఎత్తు, 
4.3 మీటర్ల ఎత్తుతో ఎనిమిది స్కవర్‌ స్లూయిజ్‌ గేట్లు) 
గేట్ల మరమ్మతుకు సిద్ధం చేసిన స్టాప్‌లాగ్‌ గేట్లు: 6 
గేట్ల నిర్వహణ : వర్టికల్‌ లిఫ్ట్‌ 
గరిష్ట వరద విడుదల సామర్థ్యం : 10,90,000 క్యూసెక్కులు 
గరిష్ట నీటి మట్టం : 14.3 మీటర్లు 
గరిష్ట నీటి నిల్వ : 0.4 టీఎంసీలు 
కనీస నీటి మట్టం : 11.3 మీటర్లు 
ఆయకట్టు : 99,525 ఎకరాలు 
అంచనా వ్యయం : రూ.274.83 కోట్లు 
వైఎస్సార్‌ హయాంలో చేసిన వ్యయం : రూ.86.62 కోట్లు 
టీడీపీ హయాంలో చేసిన వ్యయం : రూ.71.54 కోట్లు (కాంట్రాక్టర్‌ నుంచి కమీషన్లు వసూలు చేసుకోవడానికి సులభమైన పనులను మాత్రమే చేశారు) 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన వ్యయం : రూ.77.37 కోట్లు. 

 
మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌
ఎక్కడ : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం వద్ద పెన్నా (సోమశిల రిజర్వాయర్‌కు 40 కి.మీ. దిగువన) 
పరీవాహక ప్రాంతం: 50,122 చదరపు కిలోమీటర్లు 
బ్యారేజ్‌ పొడవు : 1,195 మీటర్లు (బ్యారేజ్‌కు అనుబంధంగా రెండు వరసల రోడ్‌ బ్రిడ్జి) 
గేట్లు : 85 గేట్లు(12 మీటర్లు ఎత్తు, 2.8 మీటర్ల వెడల్పుతో 79 గేట్లు.. 12 మీటర్ల ఎత్తు, 3.8 మీటర్ల వెడల్పుతో 6 స్కవర్‌ స్లూయిజ్‌ గేట్లు) 
గేట్ల మరమ్మతుల కోసం సిద్ధం చేసిన 
స్టాప్‌ లాగ్‌ గేట్లు : 9 
గేట్ల నిర్వహణ విధానం : వర్టికల్‌ లిఫ్ట్‌ 
గరిష్ట వరద విడుదల సామర్థ్యం : 7,50,196 క్యూసెక్కులు 
గరిష్ట నీటి మట్టం : 35 మీటర్లు 
గరిష్ట నీటి నిల్వ : 0.45 టీఎంసీలు 
కనీస నీటి మట్టం : 32.2 మీటర్లు 
ఆయకట్టు : 3.85 లక్షల ఎకరాలు 
అంచనా వ్యయం : రూ.335.80 కోట్లు 
వైఎస్సార్‌ హయాంలో వ్యయం : రూ.30.85 కోట్లు
టీడీపీ హయాంలో వ్యయం : రూ.86.10 కోట్లు (కాంట్రాక్టర్‌ నుంచి కమీషన్లు వసూలు 
చేసుకోవడానికి సులభమైన పనులను మాత్రమే చేపట్టారు) 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన వ్యయం : రూ.131.12 కోట్లు

 
నాటికి, నేటికి ఇదీ తేడా... 
సంగం, నెల్లూరు బ్యారేజ్‌ల పనులను 2014 నుంచి 2016 వరకూ అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్‌ పూర్తిగా నిలిపివేసింది. ఆ తర్వాత కమీషన్లు వసూలు చేసుకునేందుకు వీలున్న పనులను మాత్రమే చేపట్టారు. చివరకు రెండు బ్యారేజ్‌లను పూర్తి చేయలేక చేతులెత్తేశారు. 2019 మే 30న సీఎంగా బాధ్యతలు చేపట్టాక జలయజ్ఞం ప్రాజెక్టులపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

సంగం, నెల్లూరు బ్యారేజ్‌లను ప్రాధాన్యతగా చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. కరోనా, పెన్నాకు మూడేళ్లుగా వరదలు వంటి ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ రెండు బ్యారేజ్‌లను సీఎం జగన్‌ పూర్తి చేశారు. సాగు, తాగునీటితోపాటు రవాణా సమస్యలను శాశ్వతంగా పరిష్కరించారు. బ్యారేజ్‌ల ద్వారా వరదను సమర్థంగా నియంత్రించి ముంపు ముప్పు తప్పించేలా మార్గం సుగమం చేశారు.

Back to Top