రైల్లో ఎక్కాను. యర్రగుంట్ల నుంచి కాచిగూడ కేసి ప్రయాణం. ఆ ఎ.పి. సంపర్క్క్రాంతి ఎక్స్ప్రెస్లో, అప్పటికే నేనెక్కిన కంపార్ట్మెంట్లో పదిమందికి పైగా వున్నారు. ఎంత దూరప్రయాణమైనా, సాధ్యమైనంతవరకు పగలు ప్రయాణం చేయాలన్న తపన నాది. అంతంత దూరాలు..రాత్రి ఎక్కితే సరిపోదూ...పడుకుని తెల్లారి హాయిగా దిగేయొచ్చు...భలే తిక్కప్పా నీకు అనే వాళ్లు ఎందరో వున్నారు నన్ను. ఎవరి పిచ్చి వారికానందం. ప్రయాణంలో సాటి ప్రయాణికుల మాటలు వినడం, వారితో మాటలు కలపడం నాకు భలే సరదాగా వుంటుంది. అంతేకాదు, అదే సమయంలో పదిరకాల మనుషులు, ఆలోచనలు, పదిరకాల ప్రాంతాల భాష,యాసలు బయటపడుతుంటాయి. మొత్తానికి నా అలవాటు కొద్దీ ఈరోజు ఉదయం తొమ్మిదికి బయల్దేరి, రాత్రి ఎనిమిదింటికి హైదరాబాద్కు చేరుకునే రైలుబండినెక్కాను. వెంట తెచ్చుకున్న లగేజీ బ్యాగు సీటు కింద సర్దేసి...చుట్టూతా చూశాను. అందరూ అప్పటికే సర్దుకుని కూర్చున్నారు. ఓ అవ్వ, పక్కనున్న మనవడితో కాబోలు ఏదో చెబుతూనే వుంది. చుట్టూ ఎవరిని పట్టించుకోకుండా మాట్లాడేస్తోంది. అలా ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా సహజంగా, స్వచ్చంగా మాట్లాడేవారంటే నాకు నిజంగా చాలా ఇష్టం. కుతూహలం కొద్దీ ఓ చెవిని అలా పడేశా. కాదురా, ఇంజినీరింగ్ అయిపోయాక మీ నాయనకేదో ఉపయోగపడతావనుకుంటే...ఇదేందిరా, అయిపోయి సంవత్సరం అయినా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదంటావు. ఇవ్వాలంటే లక్షరూపాయలు కట్టాలంటావు. ఇప్పటికిప్పుడు యాట్నుంచి తెస్తానమ్మా అంటూ మీ నాయన తెగ బాధపడిపోతున్నాడు. పాపం పుట్టినప్పటినుంచి వాడిదీ ఒకటే కష్టమయిపోయా. చూడు నాయనా...ఇంతకాలం ప్రాణంగా పెట్టుకున్న ఆ అరెకరం ముక్కను అమ్మేసి, ఆ డబ్బులేవో నేనే కట్టాలనుకుంటున్నాను. మీనాయనకేమీ చెప్పొద్దు. నీ సర్టిఫికెట్లు తెచ్చుకుని, ఏదో ఒక పనిచేసయినా, ఆ తిక్కలోడి రెక్కల కష్టం తగ్గించునాయనా...అంటోంది. ఆ మనవడు బుద్దిమంతుడులానే వున్నాడు. అవ్వమాటలన్నీ శ్రద్దగా వింటున్నాడు. తల వూపుతున్నాడు. ఒక్కసారిగా వైయస్ రాజశేఖరరెడ్డిగారు గుర్తొచ్చారు. పేదవాడి పెద్దచదువులకు డబ్బులేనితనం అడ్డుకాకూడదనుకుని, ఫీజురీయింబర్స్మెంట్ పథకం పెట్టిన ఆయన ఎంత మేలు చేసిపోయాడో అర్థమయింది. ఇప్పుడేమో, ఓవైపు కాలేజీల ఫీజులు పెరిగిపోయి, ఫీజురీయింబర్స్ మెంటేమో సమయానికి రాక, వచ్చినా అరకొరగా వచ్చి, ప్రొఫెషనల్ కాలేజీలో చదువుకుంటున్న పిల్లలు, ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. ఇది రాష్ట్రంలోని అన్నిప్రాంతాల్లోనూ కనిపిస్తున్న సమస్యే. నా ఎదురుగా కూర్చున్న పెద్దాయన నాకేసే చూస్తుంటే, యావూరు పెద్దాయన అన్నాను. మాది తాడిపత్రిలే...నీది అన్నాడు. యర్రగుంట్లదగ్గర పల్లెలే. వెంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చింటివా? అన్నాను. అంత లేదులే అప్పా...మా ఇంటిది చాలా అనారోగ్యం పాలయింది. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నా. ఒక్కోచోట ఒక్కోటి చెబుతున్నాడు. ఆపరేషన్ చేయాలంటారు. ఏందో..ఆ ఆరోగ్యశ్రీ ఉంది కదాని ఆశ చావక తిరగతా వుంటే...కళ్లు తిరగతాన్నాయే కానీ ...పని అయ్యేటట్టు లేదు. ఒక చోటికి పోతే...అసలు ఆరోగ్యశ్రీ లిస్ట్లోనే ఆ రోగం లేదంటారు. ఇంకో చోటికి పోతే ఇంతయితాది...ఇంతిప్పిస్తాం...మాకేంటి అంటారు. యాటికి పోయినా, అయ్యో పాపం, ఏమయింది, సన్నకారు రైతులా వున్నావు కదాప్పా...చూద్దాం, ఏదో ఒకటి చేద్దాం అనే నాథుడే కనిపించలే. ఆయప్ప రాజశేఖరరెడ్డి వున్నప్పుడు మా వూళ్లో...కూలోళ్లు కూడా సిటీల్లో పెద్ద పెద్ద ఆస్పత్రుల్లోనే చేరి రోగాలు నయం చేసుకున్నారు. మా ఖర్మ కొద్దీ ఇప్పుడీ పాడుకాలం దాపురించిందని బాధపడ్డాడు. అవును పెద్దాయన రుణమాఫీ అయిందా నీకు? అని అడిగా. అయినకాడికి అయింది గానీ, సెంద్రబాబును నమ్మిన పాపానికి అప్పు బారెడు, వడ్డీలు మూరెడయ్యి, లక్షా ఇరవైవేలు అప్పుగా నెత్తిన బండయింది అని యాష్టపోయాడు. అప్పటిదాకా మా మాటలు వింటున్న ఒకాయన...ఎంతయినా చెప్పండి. వైయస్సార్ వైయస్సారే. చంద్రబాబు చంద్రబాబే. ఉచిత కరెంటు అన్నాడు ..అట్లా ప్రమాణం చేయగానే ఇట్లా అమలు చేసేశాడు. ఆ రోజు నుంచి ఐదేళ్ల పాటు...అదేందో ఎవరో నిలదీసి ప్రశ్నిస్తున్నట్టుగా...తనే జవాబుదారీ అన్నట్టుగా పరుగుల మీద పరుగులు పెట్టినట్టు సంక్షేమపథకాలు, అభివృద్ది పథకాలు చేస్తూపోయాడు. ఇక ప్రాజెక్టులను తలపెట్టడంలో ఆ మహానుభావుడి తర్వాతే ఎవరైనా అనిపిస్తుంది...అన్నాడు. ప్యాంటు షర్టేసుకున్న ఆయన భాష వింటుంటే చదువుకున్నవాడనిపించింది. ఏంచేస్తారు సార్...అంటే రైల్వేలో ఉద్యోగం చేసేవాడిని. పిల్లలు లేరు. ఇంకేం చేద్దాంలే అనుకుని వీఆర్ఎస్ తీసుకున్నా. ఓ పదిమంది పేద పిల్లలను దగ్గరకు తీసుకుని చదివిస్తున్నానయ్యా...అన్నాడు. మనసులోనే ఆయనకు దండం పెట్టుకున్నాను. అంతా ఆ వైయస్సార్ గారి స్పూర్తే లేప్పా...అంటూ నాకేసి చూశాడు. మా మాటలన్నీ ఎంత సేపట్నుంచి వింటున్నాడో గానీ, అప్పటికే పైన పడుకున్న ఒకాయన దిగ్గున లేచి...ఆయప్ప పేరు గుర్తుచేయకండప్పా. గుండె అంతా బేజారయిపోతాది. మహానుభావుడు వెళ్లిపోయాడు. ఉన్నంత కాలంలో ప్రజల ఆశలా వుండేవాడు. దగ్గరుండి కష్టాలు తీర్చే మనిషిలా కనిపించేవాడు. ఆయప్ప పాయా...ప్రజలకు దరిద్రం పట్టే. పెద్దోళ్లు, డబ్బులున్నోళ్లు, రాజకీయం తెలిసినోళ్లకు తప్పా, ఇక్కడ మామూలు జనం బతుకులు మాత్రం తెల్లారిపోతున్నాయి. ఇంక మా పల్లెలు, రైతుల గోడయితే చెప్పేకే లేదు. రాత్రనక, పగలనక మేం చచ్చీచెడీ పండించిన పంటకు రేటూ సరిగా కట్టరు. పంటపోతే పట్టించుకున్న పాపానే పోరు...చేసిందింత...చెప్పుకునేది అంతలా వుంది బాబుగారి కథ అంటూ ...చెప్పాల్సిందంతా చెప్పేశాననుకున్నాడు. అన్నీ సరేలే అన్నా...ఇంతకాలం పట్టించుకోకపోయినా, బాబుగారిప్పుడు రైతులంటున్నాడు, డ్వాక్రామహిళలంటున్నాడు, నిరుద్యోగభృతి అంటున్నాడు, పసుపుకుంకుమలు పెడతానంటున్నాడు, అగ్రిగోల్డ్ బాధితుల్ని పట్టించుకుంటానంటున్నాడు...మీకోసం నేను, మరి నాకోసం మీరు ఓటెయ్యరా? అని అంటున్నాడు. మీరేమంటారన్నా అన్నా... అనేదానికి ఏంది వుందప్పా....బాబుగారి తీరు చూసిందే కదప్పా? ఈయప్ప ఎన్నికలు దగ్గరకు వచ్చాయంటే చాలు...ఇట్లాగే మాట్లాడతాడు, ఏందేందో చేసేస్తానంటాడు, చేసేశానంటాడు. యాడలేని ఆశలు పుట్టిస్తాడు. ఆయప్ప దంతా ...ఒడ్డుకు చేరాకా బోడి మల్లన్నా...అనే తీరే కదాప్పా...అన్నాడు. ఏది చేసిన చంద్రబాబు పనిలో దగా, మోసం, కుట్ర అని స్పష్టంగా కనిపిస్తున్నాయి. మోసం చేయడానికి ఏమాత్రం సిగ్గుపడని వ్యక్తి వున్నాడంటే అది చంద్రబాబే అన్నాడు స్వచ్చందసేవకుడు..మాజీ రైల్వే ఉద్యోగి. అన్నీ సరేగానీ, ఈసారి ఎన్నికలకు మూడునెలల ముందు బాబుగారు ఈ తీరుగా ప్రజలో...ఓనా ప్రజలో అంటూ గోలెత్తిపోతున్నాడంటే...అంతా ఆయప్ప కొడుకు మహిమే. ఆ జగన్ ఎండనకా, వాననకా నడిచి, నడిచి జనం మాటలు విని,సమస్యలు తెలుసుకుని...వాళ్ల నాయనా లాగానే మీతో నేనుంటానంటున్నాడు. ఆ పిల్లోడు ఏం చేస్తానంటున్నాడో...అంతా జనం నమ్మడం చూసి బాబుకు భయం పట్టుకున్నట్టుంది. ఈసారి ఉత్త డబ్బులతో పనైపోయేటట్టు లేదని...ఇప్పుడే ఎంతో కొంత చేసేయాలని ట్రిక్కులేస్తున్నాడు. ఆయప్ప కథ తెలీంది ఎవరికప్పా? అంతకు ముందు కాలం పక్కన పెట్టు...ఇప్పడు కూడా ఈ ఐదేళ్ల కాలంలో ఆయప్ప ఏం వూడబెరిగాడో..గట్టిగా చెప్పమను. జనాల్ని పిచ్చోళ్లకునే చంద్రబాబును...ఆ జనాలు ఎట్లా నమ్ముతారప్పా...నమ్మితే నట్టేట మునిగినట్టేనని వారికి తెలియదా?