ప్రతిక్షణం ప్రజాహితం

  • ప్రధాన ప్రతిపక్షంగా మూడేళ్లు పూర్తిచేసుకున్న వైయస్సార్సీపీ
  • ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం
  • ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై యుద్ధభేరి
  • నిరంతరం ప్రజల మధ్యే వైయస్ జగన్ 
  • ఎవరికి ఏ ఆపద వాటిల్లినా నేనున్నాంటూ తోడుగా నిలిచిన జననేత
  • వైయస్ జగన్ కు జేజేలు పలుకుతున్న ప్రజలు
అమరావతిః ప్రజల పార్టీ అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా మూడేళ్లు పూర్తిచేసుకుంది. ప్రతిక్షణం ప్రజాహితం కోసం పాటుపడుతూ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అరాచక పాలనపై అలుపెరగని పోరాటం కొనసాగిస్తోంది.  వైయస్సార్సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ చేసినన్నీ పోరాటాలు దేశంలోనే ఏ రాజకీయ పార్టీలు చేయలేదన్నది జగమెరిగిన సత్యం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిన మోసపూరిత సర్కార్ పై ప్రతిపక్ష వైయస్సార్సీపీ నిరంతరం పోరాటం కొనసాగిస్తూ వస్తోంది. ప్రజల గొంతుక వినిపిస్తోంది.  హామీల అమలు కోసం, ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మెడలు వంచేలా ధర్నాలు, దీక్షలు, బంద్ లు, హర్తాళ్ లు, మానవహారాలు ఇలా దశలవారిగా వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తోంది.  ప్రధాన ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ముల్లుకర్రతో పొడిస్తేనే తప్ప ఏ విషయంలోనూ చలించని ప్రభుత్వం ఆంధ్రరాష్ట్రంలో ఉండడం బాధాకరం. గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం ద్వారా నేరుగా ప్రజాసమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ అవినీతి పాలనను ప్రజలకు వివరించి వారిని చైతన్యపర్చే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వైయస్ జగన్ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు.  తమ గోడు వినేందుకు వచ్చిన వైయస్సార్సీపీ శ్రేణులను అక్కున చేర్చుకొని ఆదరిస్తున్నారు ప్రజలు.  

ఎక్కడ ఎవరికి ఏ ఆపద వాటిల్లినా నేనున్నానంటూ వెళ్లి  వైయస్ జగన్ వారి బాధను పంచుకున్నారు.  ఆ కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.  వారికి తోడుగా నిలుస్తూ ధైర్యం నింపారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజల పక్షాన పోరాడారు. ఎవరూ అధైర్యపడొద్దని..కొద్దికాలం ఓపికపడితే మన ప్రభుత్వం వస్తుంది...మళ్లీ అందరికీ ఆ మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి సువర్ణయుగం అందుతుందని భరోసానిస్తున్నారు. రుణాలు మాఫీ గాక పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతుల పక్షాన నిలిచి ప్రభుత్వంపై వైయస్ జగన్ సమరభేరి మోగించారు. రైతులను ఆదుకోవాలని గర్జించారు. ఇచ్చిన హామీ మేరకు రుణాలు మాఫీ చేయడంతో పాటు, మద్దతు ధర కల్పించాలి, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి, అదేవిధంగా రైతులకు అందాల్సిన పంటనష్టపరిహారంతో పాటు ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించాలని అనేకసార్లు ఉద్యమించారు.   డ్రాక్రా అక్కచెల్లెమ్మలను దగా చేస్తున్న ప్రభుత్వంపై పోరాడారు. కర్షకుడు, కార్మికుడు, శ్రామికుడు ఇలా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం వైయస్ జగన్ అహర్నిషలు కృషి చేస్తూ ప్రభుత్వంపై పోరాడుతున్నారు. 

ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయని, విభజన చట్టంలోని హామీలను సాధించలేని అసమర్థ ముఖ్యమంత్రిగా చంద్రబాబు మిగిలిపోయారు.  ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని ఐదుకోట్ల ఆంధ్రుల భవిష్యత్తును ఢిల్లీ నడివీధుల్లో తాకట్టుపెట్టాడు. ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వ తీరును ఎండగడుతూ, రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం ప్రధాన ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్  ఉద్యమబాట పట్టారు. నిరుద్యోగ యువత, రాష్ట్రాభివృద్ధికై  రాష్ట్రానికి ప్రాణవాయువులాంటి ప్రత్యేకహోదా కోసం వైయస్ జగన్ చేయని పోరాటం లేదు. అసెంబ్లీ, పార్లమెంట్ మొదలు గల్లీ నుంచి ఢిల్లీ దాక ఉద్యమించారు. హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని అనేక పోరాటాలు చేశారు. ప్రధాని సహా, కేంద్రమంత్రులను కలిసి పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. హోదా ఇచ్చే పార్టీలకే కేంద్రంతో తమ మద్దతు ఉంటుందని ఖరాఖండిగా చెప్పేశారు. 

రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం లేని వారికి నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి లాంటి వందలాది హామీలకు చంద్రబాబు మంగళం పాడారు. ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇసుక నుంచి మట్టిదాక, సాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్, కాల్ మనీ సెక్స్ రాకెట్ మాఫియా, ప్రాజెక్ట్ లలో విచ్చలవిడి దోపిడీ, చివరకు గుడి భూములను కూడ వదలకుండా ఇందుగలదు అందు లేదని మూడేళ్లలో 3లక్షల కోట్ల వరకు చంద్రబాబు అవినీతి ప్రయాణం సాగింది. దేశంలో అవినీతిలో ఏపీని నంబర్ వన్ గా నిలిపిన ఘనత చంద్రబాబుది. చంద్రబాబు అవినీతిపై ముద్రించిన ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తకాన్ని దేశంలోని వివిధ జాతీయ పార్టీ నాయకులకు అందించి...అవినీతికి అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలని వైయస్ జగన్ బృందం కోరింది.  అంతేకాదు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ చంద్రబాబు ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కోట్లాది రూపాయలు ఇచ్చి కొంటూ వారికి ఏకంగా మంత్రి పదవులిచ్చి రాజ్యాంగాన్ని ఏవిధంగా అపహాస్యం చేస్తున్నారో ప్రధాని, కేంద్రమంత్రులు, జాతీయ నాయకులకు వివరించారు. సేవ్ డెమోక్రసీ పేరుతో అన్ని పార్టీలను ఐక్యం చేశారు. 
Back to Top