ప్రవాస ఆంధ్రులను తక్షణం సురక్షితంగా తీసుకురావాలి

రాష్ట్ర ప్రభుత్వానికి వైయస్‌ జగన్‌ విజ్ఞప్తి

తాడేప‌ల్లి: మధ్య పాశ్చ్య దేశాల్లో నెలకొన్న యుద్ద వాతావరణం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ప్రవాస ఆంధ్రులను సురక్షితంగా తీసుకురావాలని మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వేలాది మంది గల్ఫ్‌ దేశాల్లో పని చేస్తున్నారని, ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితుల్లో అక్కడ అనిశ్చితి నెలకొనడంతో పాటు, భద్రత కొరవడిందన్నారు. మరోవైపు పలు విమానాశ్రయాల్లో ఆంక్షలు, విమాన సర్వీసుల రద్దు వల్ల చాలా మంది ఎక్కడకిక్కడ చిక్కుకుపోయి, అనేక ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. అందువల్ల రాష్ట్రానికి చెందిన వారందరినీ సురక్షితంగా ఇక్కడికి తీసుకురావడంలో ప్రభుత్వం చొరవ చూపాలని, ఈ విషయంలో కేంద్రంతో సమన్వయం చేసుకుని, ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా వారందరినీ తరలించాలని కోరారు. ఇంకా గల్ఫ్‌ దేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలతో కూడా సమన్వయం చేసుకుని, ప్రవాస ఆంధ్రుల పరిరక్షణకు చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

ఇంకా అక్కడి వారి పరిస్థితిని ఎప్పడికప్పుడు, వారి కుటుంబాలకు తెలియజేసే విధంగా ఇక్కడ ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేసి, హెల్ప్‌లైన్‌ నెంబర్లు కూడా అందుబాటులోకి తేవాలని సూచించారు. ప్రవాసాంధ్రుల భద్రత, వారి సురక్షిత ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అన్న శ్రీ వైయస్‌ జగన్, ఈ సంక్షోభ సమయంలో రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం పని చేయాలని విజ్ఞప్తి చేశారు.

Back to Top