గుంటూరు: గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ షేక్ నూరి ఫాతిమా గురువారం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కతావతే మయూర్ అశోక్ (IAS) గారిని మర్యాదపూర్వకంగా కలిసి తూర్పు నియోజకవర్గంలో నెలకొన్న పలు ప్రజా సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. నియోజకవర్గంలో తీవ్ర రూపం దాల్చిన వీధి కుక్కల బెడదపై తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అలాగే మురుగు కాలువల (సైడ్ డ్రైన్లు) పూడికతీత పనులు నిలిచిపోవడంతో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య లోపాలు, చెత్త సక్రమంగా తొలగించకపోవడం, వెలగని వీధి దీపాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఈ సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని కమిషనర్ను డిమాండ్ చేశారు. ప్రజల ప్రాథమిక అవసరాలు తీరేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ కార్పొరేటర్ అబిద్, 4వ డివిజన్ కార్పొరేటర్ మెహమూద్, కో-ఆప్షన్ సభ్యుడు పూనూరి నాగేశ్వరావు, రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ జనరల్ సెక్రటరీ చింకా శ్రీను, స్టేట్ బూత్ కమిటీ సెక్రటరీ చిలక రమేష్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ నందెటి రాజేష్, జిల్లా జనరల్ సెక్రటరీ చదలవాడ వేణు, డివిజన్ అధ్యక్షులు షేక్ నజీర్, జాఫర్, రామయ్య, జబీరా, తూర్పు నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షుడు షేక్ లియాఖత్, పార్టీ ముఖ్య నాయకులు అయూబ్ జానీ, బషీర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.