అమరావతిలో స్టార్టప్ కాపిటల్ నిర్మాణం కాంట్రాక్టును సింగపూర్ కన్సార్టియంకు కట్టబెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మురిసిపోవచ్చు. ఆ సంతోషంతో అమెరికా యాత్ర చేస్తుండవచ్చు. కానీ ఇందులో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొంటున్న చాలెంజ్ అంటూ ఏమీ లేదు. 1691 ఎకరాల భూమి ప్రజల నుంచి తీసుకుని వారి చేతుల్లో పెడుతున్నాము. దీనిపై ప్రభుత్వం 5000 కోట్లకు పైగా ఖర్చు చేస్తుంది. ఎసెండాస్, సింగ్బ్రిడ్జి,సెంబ్కార్ప్లతో కూడిన కన్సార్టియం పెట్టేది కేవలం 300 కోట్ల వరకే. ఈ భూమి డెవలప్ చేసి అమ్ముతారు గాని పని జరక్కపోతే వారి బాధ్యత వుండదు. పైగా ఇందుకు ఇచ్చిన వ్యవధి పదిహేనేళ్లు. మూడుదశలు. మొదట్లో ఎవరూ రాకపోవచ్చని కూడా ముఖ్యమంత్రి తానే చెబుతున్నారు. మరి ఇన్ని పరిమితులు వుంటే వారికి 58 శాతం ప్రభుత్వానికి 42 శాతం రాబడి నిర్ణయించడం ఎక్కడైనా వుంటుందా?
ఏ పథకమైనా అనుకున్న దానికన్నా ఆలస్యం కావడం సహజం. అంటే దాదాపు ఇరవై ఏళ్లు పట్టే అస్పష్ట ప్రాజెక్టు కోసం రైతుల నుంచి ముందస్తుగా వేల ఎకరాలు భూమి ఎందుకు తీసుకున్నట్టు? భూమి మనది, డబ్బు మనది అయినప్పుడు ఫీజు చెల్లించి తీసుకుంటే పోయేదానికి సగానికి పైగా ఆదాయం వారికి కట్టబెట్టడం మామూలు ఫ్లాట్ల నిర్మాణంలో కూడా చూడమే! ఇంత ఏకపక్ష బేరానికి ప్రభుత్వం ఎందుకింత పాకులాడినట్టు? విభజన మరుసటి రోజునుంచి సింగపూర్ చుట్టూ తిరగడమెందుకు? ఇంతా చేసి వారి అనుభవం రాజధానుల నిర్మాణంలో చాలా తక్కువ. నిన్న చెప్పుకున్నట్టు కోర్ క్యాపిటల్ భవనాలకు వారు సహకరించిందేమీ లేదు. ఎందుకంటే అక్కడ లాభాలు పండవు. హైకోర్టు అక్షింతలు వేసిన తర్వాత కూడా నిబంధనలే మార్చి ఆ సంస్థకే కట్టబెడుతున్నారంటే ప్రభుత్వానికి దానిపై ఎంత ప్రత్యేకాసక్తి వుందో తెలుస్తుంది. దాని తీరుతెన్నులు లోతుపాతులు రాబోయే రోజుల్లో వెల్లడి కాకపోవు.
ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం ఎంత విఫలమైందో మొన్నటికి మొన్న మాకీ అసోసియేట్స్ రాసిన కథనంలోనే చూశాం. చంద్రబాబు హయాంలో ఏపీ అవినీతిలో దూసుకుపోతూ అభివృద్ధిలో ఎంత వెనకబడిందో ఆ ఒక్క సంఘటన చాలు. ఆయన రాసిన ఆర్టికల్ చూస్తేనే తెలుస్తుంది. ఏపీకి పెట్టుబడులు పెట్టడంలో కంపెనీలు ఎందుకు వెనక్కి తగ్గుతున్నాయో.. అవినీతిలో ఏపీని నెంబర్ వన్ చేసి బాబు రాష్ట్రాన్ని మరింత అప్రతిష్టపాలు చేశారు. ఒకప్పడు బీహార్ను అవినీతి, రౌడీయిజం, వెనకబాటుతనంలో ఉదాహరణగా చెప్పేవారు. ఇప్పడు అలాంటి దుస్థితి ఏపీకి పట్టుకుంది. రాజశేఖర్రెడ్డి హయాంలో స్వర్ణయుగంగా వర్థిల్లిన రాష్ట్రం నేడు కరువు, రైతు ఆత్మహత్యలతో రోజురోజుకు అభివృద్ధిలో తిరోగమనంలో సాగుతోంది... ఉత్తుత్తి పర్యటనలు, ఆరంభ శూర వాగ్ధానాలు తప్ప గడిచిన మూడేళ్లలో బాబు ఏపీకి చేసిందేమీ లేదు.