చంద్రబాబు రాజకీయ స్వార్థానికి గోదావరి జిల్లాల వాసులు బలి కానున్నారు. కమీషన్ల కోసం పట్టి సీమ ఎత్తిపోతల పథకం చేపట్టి రూ. 500 కోట్లు వెనకేసుకొన్నారు. అది విజయవంతం అయింది అని చెప్పుకోడానికి అదే పనిగా గోదావరి నీటిని తోడేస్తున్నారు.ఇప్పుడు చూస్తే దిగువన ఉన్న గోదావరి జిల్లాల రైతులకు రబీ సీజన్ కు నీరు ఇవ్వటం కష్టం అని చెబుతున్నారు. రాష్ట్రానికి అన్నపూర్ణగా పేరొందిన గోదావరి డెల్టాలో లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. ఖరీఫ్ పంటకు బాగానే నీరిచ్చిన అధికారులు.. రబీ వచ్చేసరికి చేతులెత్తేస్తున్నారు. మొత్తం మీద 87 టీఎంసీల నీరు అవసరం కాగా.. ప్రస్తుతం అందులో సగమే అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో సగం మేర పంట పొలాలు ఎండిపోవటం ఖాయంగా కనిపిస్తోంది.ముఖ్యంగా పట్టి సీమ పథకం కోసం నీటిని ఎంత లోతు వరకు తోడుకోవచ్చనే దాని మీద ప్రభుత్వం డ్రామాలు సాగించింది. పట్టిసం గ్రామంలో మంత్రి దేవినేని ఉమ దగ్గర ఉండి లోతుగా గొయ్యి చేయించారు. అప్పుడు ఎక్కువ లోతులో నీరు ఉన్నట్లుగా రికార్డులు చూపించారు. అదే పనిగా అక్కడ నుంచి నీటిని తోడేసేందుకు మార్గం సుగమం చేసుకొన్నారు. కానీ దిగువకు వెళ్లేసరికి నీటి ప్రవాహం తగ్గిపోతోంది. తప్పును బయట పడకుండా చేసుకొనేందుకు ఇందుకోసం విద్యుత్ శాఖ అధికారులను వాడుకొంటున్నారు. గోదావరి డెల్టాలో రబీ పంటకు నీరివ్వడం కష్టమేనని ఏపీ జెన్ కో అధికారులు తేల్చిచెబుతున్నారు. సర్కారు చెప్పినట్లుగా నీళ్లిస్తే మూడు విద్యుత్ కేంద్రాలు మూతపడతాయని, అప్పుడు రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం వస్తుందని భయపెడుతున్నారు. మొత్తం మీద చంద్రబాబు, దేవినేని ఉమ ల పంతం కోసం గోదావరి జిల్లా ల పంట పొలాల్ని ఎండ బెడుతున్నారు.