ఏడాదిలో ఒక్క పనీ పూర్తిచేయని రికార్డు

() రాజధాని ప్రాంతంలో భూసమీకరణకు ఏడాది పూర్తి

() హామీలు నెరవేర్చకుండా కాలక్షేపం

() ప్లాట్లు మొదలుకొని పరిహారం దాకా సాగతీత 

విజయవాడ) ఏరు దాటే దాకా ఏటి మల్లన్న, ఏరు దాటేక
బోడి మల్లన్న అన్నట్లుగా సాగుతోంది చంద్రబాబునాయుడు పాలన. అమరావతి రాజధాని కోసం
రైతుల నుంచి భూములు లాక్కొనేటప్పుడు ఎన్నెన్నో హామీలు గుప్పించారు. వరాల జల్లు
కురిపించారు. భూ సేకరణ మొదలెట్టి ఏడాది పూర్తయింది కానీ, హామీలు మాత్రం అమలు కావటం
లేదు. దీంతో అమరావతి గ్రామీణ ప్రజల్లో తీవ్ర నిరాశ నెలకొంది.

 

వరాల జల్లు..!

వేల ఎకరాల భూముల్ని లాగేసుకొనేందుకు ప్లాన్
చేసుకొన్న చంద్రబాబు అందుకు తగినట్లుగానే రైతుల్ని మభ్య పెట్టడానికి తన
యంత్రాంగాన్ని రంగంలోకి దించారు. పెద్ద ఎత్తున గ్రామాల్లోకి చంద్రబాబు దండు కదలి
వచ్చింది. భూములు ఇస్తే ఎన్నెన్నో ప్రయోజనాలు అంటూ నమ్మ బలికింది. అరచేతిలో
స్వర్గాన్ని ఆవిష్కరించి చూపించారు. ఈ మాటలు నమ్మి అమాయక రైతులు తమ భూముల్ని
ప్రభుత్వం చేతిలో పెట్టారు.

 

ఆవిరైన ఆశలు

జనవరి, 2015 లో మొదలైన భూ సేకరణ కొన్ని నెలల
పాటు సాగింది. ఈ జనవరితో ఈ తంతుకు ఏడాది నిండింది. రైతుల్లో కొందరికే కౌలు
చెక్కులు అందుబాటులోకి వచ్చాయి. అటవీ, సీలింగ్, వాగు, చెరువు, భూమి దారులకు కౌలు
ఊసే లేదు. స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ సైనికులు వంటివారిని గాలికి వదిలేశారు.
గ్రామ కంఠాల పరిస్థితి ఏమిటన్నది ఇప్పటిదాకా అర్థం కావటం లేదు. రైతులందరికీ
ఏకబిగిన రుణమాఫీ చేస్తామని ప్రగల్బాలు పలికారు. ఆ మాట నీటి మూటగానే మిగిలిపోయింది.
రైతులు, రైతు కూలీల పిల్లలు ఉచితంగా విద్య అందిస్తామన్నారు. కానీ ఆచరణలో ఒక్క
విద్యార్థికి కూడా ఈ పథకాన్ని అప్లయ్ చేయలేదు. రైతుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేస్తామంటూ
హడావుడి చేశారు. తీరా చూసి శిక్షణ తప్ప ఉద్యోగం ఇవ్వకుండా నాటకం ఆడారు.

 

సామాన్యుల సంగతి మరింత దుర్భరం

రైతుల సంగతి అలా ఉంటే, కూలీలు, సామాన్యుల
పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. రైతు కూలీలకు నెలకు రూ. 2,500 చొప్పున పింఛన్
ఇస్తామని ప్రకటించారు. కానీ చాలా మందికి అందటం లేదు. అసలు ఆ జాబితా తయారు
చేయటంలోనే పెద్ద గందరగోళం చోటు చేసుకొంది. రేషన్ కార్డులు లేవని, కొత్తగా
పెళ్లయినవారని రక రకాల కారణాలు చెప్పి చాలా మంది పేర్లను తొలగించేశారు. గ్రామాలకు
అభివ్రద్ది నిధులు అన్నారు కానీ, ఆ ఊసెక్కడా కనిపించటం లేదు. తూళ్లూరు, మందడం,
ఎర్రబాలెం, పెనుమాక వంటి గ్రామాల్లో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి రూ. 5 కే
భోజనం ఇస్తామని చెప్పారు. ఒక్కరంటే ఒక్కరికి ఇటువంటి భోజనం పెట్టలేదంటే దాన్ని
అర్థం చేసుకోవచ్చు. 

Back to Top