నడిపిస్తున్న అభిమానం.. పాల్గొంటున్న పల్లె జనం

అభిమానం ఎంత పనయినా చేయిస్తుంది. గుండెల్లో నింపుకున్న రాజన్నను తలచుకుంటూ వారు షర్మిల అడుగులో అడుగు వేస్తున్నారు. మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సో దరి అయిన వైయస్ షర్మిల తలపెట్టిన మహా క్రతువులో వారు భాగస్థులవుతున్నారు.
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై ఉన్న అభిమానంతో ఆయన తనయురాలు షర్మిల చేపట్టిన పాదయాత్రలో పాల్గొంటున్నామని ప్రకాశం, అనంతపురం జిల్లాల వాసులు చెప్పారు. షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయ్రాత్రలో వారు ఇడుపులపాయ నుంచి నడుస్తున్నామని చెప్పారు.

ఇడుపులపాయ నుంచి వస్తున్నా : కరీమున్నీసా, కదిరి
     ఇడుపులపాయ నుంచి షర్మిల వెంట పాదయాత్రలో పాల్గొంటున్నాను. జగన్‌మోహన్‌రెడ్డి జైలు నుంచి బయటికి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. జననేత బయటకు వస్తే అజ్మీరును దర్శించుకుని మొక్కుబడి తీర్చుకుంటా.

మహిళలకు వైయస్ ఎంతో మేలు చేశారు: సి. రమణమ్మ, ప్రకాశం

     మహానేత వైయస్‌ఆర్ పొదుపు మహిళలకు ఎంతో మేలు చేశారు. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పింఛన్లు మంజూరు చేసి ఆదుకున్నారు. గతంలో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పోలవరం పాదయాత్రలో కూడా పాల్గొన్నాను.

వైయస్ కుటుంబానికి ప్రజల అండ: గోపిరెడ్డి సుబ్బారెడ్డి, ప్రకాశం
     వైయస్ కుటుంబంపై ప్రజల్లో ఎంతో విశ్వాసం ఉంది. ఆ కుటుంబానికి ప్రజలు అండగా ఉంటారు. వైయస్  రాజశేఖర్‌రెడ్డి రైతులకు ఎంతో మేలు చేశారు. వైయస్‌ఆర్‌పై ఉన్న అభిమానంతో షర్మిలమ్మ చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో పాల్గొంటున్నా.

బాధలు తెలుసుకుంటూ సాగుతున్న షర్మిల
     ఉదయం 10.30 గంటలకు పాదయాత్ర ప్రారంభించిన షర్మిల కార్మికులు, కూలీలు, విద్యార్థులు ఎక్కడ కనిపించినా వారితో మాట్లాడుతూ... వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. షర్మిల పాదయాత్ర చేస్తారని తెలిసి సమీప గ్రామాల నుంచి, పొలాల నుంచి పెద్ద ఎత్తున జనం రోడ్లపైకి వచ్చారు. వారితో మాట్లాడుతూ ముందుకు సాగారు. ఆదోని నియోజకవర్గంలోకి ప్రవేశించగానే మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా జనం తరలివచ్చారు. పాదయాత్ర సాగే సమయంలో బిణి గేరి సమీపంలో ఓ వృద్దురాలు షర్మిలను చూడడానికి వచ్చి వెళుతుండగా, టాటా సుమో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. ఆ విషయం తెలిసిన షర్మిల ఆమె దగ్గరికి వెళ్లి తన చేతులతో అంబులెన్సులోకి ఎక్కించడమే గాకుండా ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి జయరాం వారికి డబ్బులు ఇచ్చారు. పార్టీ నాయకుడు డాక్టర్ హరికృష్ణను ఆమెతో పాటు ఆస్పత్రికి పంపించినప్పటికీ, మార్గమద్యంలోనే ఆమె మృతి చెందింది. ఈ విషయం తెలిసిన వెంట నే ఆ వృద్ధురాలి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Back to Top