<br/><strong>– రాజీనామా చేసి నిరాహార దీక్షకు దిగిన వైయస్ఆర్సీపీ ఎంపీలు</strong><strong>– ఏపీ భవన్ సాక్షిగా పోరాటం షురూ</strong><strong>– గతంలోనే రాజీనామా ప్రకటన చేసిన జననేత జగన్</strong><strong>– అన్నట్టుగానే పార్లమెంట్ సమావేశాల చివరి రోజు ఎంపీల ఆమరణ దీక్ష</strong><br/><br/>హోదా కోసం ఎందాకైనా అంటూ వైయస్ఆర్సీపీ చేస్తున్న పోరాటంలో కీలక అడుగు పడింది. మూడేళ్లుగా హోదా సాధనే లక్ష్యంగా వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్ఆర్సీపీ పోరాటం చేస్తున్నదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. హోదా సాధనే ధ్యేయమంటూ ఏరోజునైతే వైయస్ జగన్ ప్రకటించారో ఆ రోజు నుంచీ అడుగులన్నీ అటువైపుగానే సాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై యుద్ధంలో ఎక్కడా వెనుకడుగు పడకుండా ప్రణాళిక ప్రకారం సాగారు. ప్రత్యేక హోదా వలన ఉపయోగాలను ప్రజలకు, యువత, విద్యార్థులకు వివరించడం దగ్గర్నుంచి.. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీని అమలు చేయకుండా మోసగించడంపై ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ వైయస్ జగన్ ఒక పద్ధతి ప్రకారం ముందుకు సాగుతూ వచ్చారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మాణం ఇస్తామన్నారు.. 12 రోజులుగా ఇస్తూనే ఉన్నారు. కేంద్రం కుట్రలతో చర్చకు రాకుండా అడ్డుకుంటుందని ముందుగానే ఊహించి.. అవసరమైతే ఎంపీలు రాజీనామాకు వెనుకాడరు అని ఎంపీలతో సమావేశమై వైయస్ జగన్ ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాల చివరి రోజున వైయస్ఆర్సీపీ ఎంపీలంతా రాజీనామా చేస్తామన్నారు. ఏపీ భవన్ సాక్షిగా ఆమరణ నిరాహారదీక్షకు దిగబోతున్నట్టుగా ప్రకటించారు. అన్నట్టుగానే చెప్పిన మాటకు కట్టుబడి రాజీనామా సమర్పించి వచ్చి అక్కడ్నుంచే ఏపీ భవన్కు వెళ్లి నిరాహార దీక్షలో కూర్చున్నారు. <br/><strong>మద్ధతివ్వాల్సిందిపోయి కుట్రలు..</strong><br/>హోదా ముసుగేసుకుని పోయి ఢిల్లీ వెళ్లి రెండు రోజులు ఫోటో షూట్ చేసొచ్చిన చంద్రబాబు.. పోరాడాల్సిన సమయంలో పొత్తు రాజకీయాలు చేసుకున్నారు. రాష్ట్రాన్ని విభజించిందని కాంగ్రెస్ను తిట్టిన నోటితోనే అదే పార్టీతో చేతులు కలపడానికి సంధి చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. ఎంపీలంతా కలిసి పోరాడుదామని వైయస్ జగన్ పిలుపిచ్చినా చెవికెక్కించుకోలేదు. మీరు అవిశ్వాసం పెడతామంటే మద్ధతిస్తామని చెబితే సరేనన్న మనిషి గంటల్లోనే మాటమార్చాడు. తీరా వైయస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామా చేస్తుంటే మీడియా కవరేజ్ కోసం భయపడి ఢిల్లీలో సైకిల్ యాత్రలు మొదలుపెట్టారు. జనాల్లో వైయస్ఆర్సీపీకి మంచిపేరు రాకూడదనే బాధ తప్పించి.. అందరూ కలిసి పోరాడితే ప్రత్యేక హోదా వస్తుందని ఆలోచన ఎక్కడా లేదు. చివరికి పవన్ కల్యాణ్ కూడా తక్కువేం తినలేదు. మీడియా కవరేజ్ కోసం ఆయనదో వింత నాటకం. విజయవాడలో పాదయాత్ర పేరిట కాసేపు హడావుడి చేసి సేదతీరాడు. వీళ్లంతా వైయస్ఆర్సీపీకి మైలేజ్ రాకూడదనే బాధతో ఫొటో యాత్రలు చేస్తున్నారు తప్పించి.. హోదా సాధించాలంటే ఏది అవసరమో దానికోసం మాత్రం చిత్తశుద్ధితో మాత్రం ప్రయత్నం చేయడం లేదని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇది ప్రజల్లో నుంచి వస్తున్న అభిప్రాయమే.