గుంటూరు : మహానేత రాజన్న మరణించిన తరువాత రాష్ట్ర ప్రజల జీవితాల్లో పెనుచీకట్లు ముసురుకున్నాయని అందుకే రాజన్న రాజ్యం మళ్ళీ రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అణగారిన వర్గాలకు సంక్షేమం అందని ద్రాక్షే అయిందని వారంతా వాపోతున్నారు. అసమర్థ కాంగ్రెస్ పాలనలో అష్టకష్టాలు పడుతున్న ప్రజలంతా తిరిగి ఆ మంచి రోజులు రావాలని కోరుకుంటున్నారు. ఎదురు చూస్తున్న వారి కళ్ళకు జననేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి వెలుగురేఖలా కనిపిస్తున్నారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రగా తమ వద్దకే వస్తున్న జగనన్న సోదరి శ్రీమతి షర్మిలకు ఈ విషయాన్నే ప్రజలంతా ఆర్తిగా వివరిస్తున్నారు. త్వరలో రాజన్న రాజ్యం వస్తుందని శ్రీమతి షర్మిల ఇస్తున్న భరోసాతో ప్రజలంతా సాంత్వన పొందుతున్నారు.<br/>పొన్నూరు నియోజకవర్గంలోని మామిళ్ళపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద శ్రీమతి షర్మిల సోమవారం రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను ఏకరువు పెట్టారు. శ్రీమతి షర్మిల స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు.<br/>నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని లక్ష్మి అనే మహిళ వాపోయింది. కరెంటు మూడు గంటలు మాత్రమే ఉంటుందని దీంతో పరీక్షలకు వెళ్ళే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పింది. తమ గ్రామంలో మరుగుదొడ్లు లేక మహిళలకు చాలా కష్టంగా ఉందని చిలంకూరి నరసమ్మ విచారం వ్యక్తం చేసింది. ఇందిరమ్మ పథకం కింద కట్టుకున్న ఇళ్లకు బిల్లులు రావడంలేదని ఆవేదన చెందింది. తమ గ్రామంలో సైడు కాల్వలు లేవని, కరెంటు అసలు ఉండటం లేదని దేవిరెడ్డి సీతామహాలక్ష్మమ్మ తెలిపింది. కరెంటు లేకపోయినా బిల్లులు మాత్రం రెట్లకు రెట్లు వస్తున్నాయని పేర్కొంది. వంద రూపాయల కూలీతో తాము ఎలా బతకాలని వాపోయింది. విద్యుత్ సబ్స్టేషన్ తమ గ్రామంలోనే ఉన్నప్పటికీ విపరీతంగా కోతలు విధిస్తున్నారని దీంతో మోటార్లు పనిచేయక పంటలు ఎండిపోతున్నాయని ములకా శివారెడ్డి అన్నారు. గ్రామంలో కూరగాయల నిల్వ కోసం శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలని కోరారు.<br/>వారి సమస్యలు సావధానంగా విన్న శ్రీమతి షర్మిల మాట్లాడుతూ, దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాలను అధికార కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో కూలీలు ఎలా బతకాలో తెలియని దుర్భర పరిస్థితుల్లో ఉన్నారన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కారణం సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నిర్లక్ష్యమే అన్నారు. మహానేత వైయస్ఆర్ పాలనలో ఒక్క పైసా కూడా కరెంటు చార్జీలు పెంచలేదన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు గిట్టుబాటు లభించేందుకు రూ. 3 వేల కోట్లతో రైతు బడ్జెట్ కేటాయిస్తుందన్నారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లను పెంచుతుందన్నారు. ఒకటవ తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్థులకు వారి తల్లి బ్యాంకు ఖాతాలో స్కాలర్షిప్ల కింద డబ్బులు జమ చేస్తుందన్నారు. జననేత జగనన్న ఏ తప్పూ చేయలేదని శ్రీమతి షర్మిల తెలిపారు. జగనన్న త్వరలోనే బయటకు వస్తారని రాజన్న రాజ్యం తెస్తారని చెప్పారు.