అదిగో జగన్‌ జనప్రభంజనం...



హైదరాబాద్ 25 అక్టోబర్ 2012 :  షర్మిల 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్రకు పెల్లుబికిన ఆదరణను బట్టి రానున్న కాలంలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం తప్పదని స్పష్టమవుతోంది. నిత్యం ప్రజాసమస్యలపై స్పందిస్తూ, జనంతో మమైకమవుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు ఆదరిస్తున్న తీరును బట్టి ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్ నాయకత్వంలో పార్టీ విజయభేరి మోగిస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. జగన్ ప్రభంజనాన్ని తట్టుకోలేక కాంగ్రెస్, తెలుగుదేశం, సీబీఐలు ఒక్కటై టార్గెట్ జగన్ ఆపరేషన్ సాగిస్తున్న సంగతి బహిరంగ రహస్యమే. దీనిని జనం బలంగా నమ్ముతున్నారు.
జననేతను జనంలో ఉండనివ్వకూడదనే ఉద్దేశ్యంతేనే కేసులలో ఇరికించి జైలులో బంధించి ఉంచారని ప్రజలు భావిస్తున్నారు. ఇది మొన్నటి ఉపఎన్నికల్లో ఓట్ల రూపంలో వెల్లడైంది కూడా. రాష్టంలో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ సాధించిన ఘనవిజయం ప్రజల్లో విశ్వాసాన్ని, భరోసాని నింపింది. రానున్నది రాజన్న రాజ్యమేనన్న రాష్ట్ర ముఖచిత్రం స్పష్టంగా వెల్లడౌతోంది.ఎన్ని శక్తులు ఏకమైనా రాష్ట్రంలో యువనేత జగన్ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని.. కాంగ్రెస్ టీడీపీలు కుమ్మక్కైనా గత ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే అందుకు నిదర్శనమని వైయస్ఆర్ సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజల కష్టాలు ప్రభుత్వానికి తెలియజేయాలనే లక్ష్యంతో పాటు, సమీప భవిష్యత్తులో స్వర్ణయుగం సాకారం కానుందనే భరోసా ఇస్తూ చేయాలనుకున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను  తొలుత జగనే చేయాలని యోచించారు. కానీ ప్రజల మధ్య ఉంటున్నారన్న ఒకే ఒక్క కారణంతో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై జగన్‌ను జైల్లో పెట్టించడంతో అన్న ఆశయాన్ని ప్రస్తుతం షర్మిల ముందుకు తీసుకువెళ్తున్నారు. షర్మిల పాదయాత్రకు వస్తున్న అపూర్వ ఆదరణ చూస్తుంటే  జగన్‌పై విశ్వాసంతోనే గత రెండు ఎన్నికల్లోనూ వైయస్ను చూసే జనం ఓట్లేశారని, సోనియాను చూసి కాదన్న విషయం కాంగ్రెస్‌ నాయకులకు ఇప్పుడిప్పుడే బోధపడుతోంది.

రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకు సాగునీరందించే పోలవరం వంటి ప్రాజెక్టులకు వైయస్ శ్రీకారం చుడితే వాటిని ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తొంది. రాష్ట్రంలో పలు ప్రాజెక్టులను, పథకాలను చేపట్టలేమని ప్రభుత్వం ఎప్పుడో చేతులెత్తేసింది. ఫీజుల రీ ఇంబర్స్‌మెంట్‌ పథకానికి గండి కొట్టింది. ఆరోగ్యశ్రీకి కూడా కత్తెరలు వేసింది. వ్యవసాయం గురించి ఎవరికీ పట్టలేదు. కరెంటు సంక్షోభం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టింది. రైతులు, కార్మికులు, చిన్న,మధ్య తరహా పరిశ్రమలవారు చితికిపోతున్నారు. వైయస్ హయాంలో అన్నివర్గాలవారికీ న్యాయం జరిగింది. కానీ ఇప్పుడు తామంతా అన్యాయమైపోయామని జనం భావిస్తున్నారు. ప్రస్తుతం అసలు ప్రభుత్వం ఉందా? అన్న భావన ప్రజల్లో బలంగా నాటుకుపోతోంది. ప్రజాసమస్యలపై పోరాటం చేయడమే లక్ష్యంగా జగన్‌మోహనరెడ్డి వైయస్ఆర్ సీపీని ముందుకు నడిపిస్తున్న తీరును ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ప్రజల్ని మభ్యపెట్టడానికి చంద్రబాబు తెరలేపిన పాదయాత్రను, ఆయన చేస్తున్న అమలు కాని వాగ్దానాలను జనం నమ్మడం కష్టమేనని ఆపార్టీకి చెందిన నేతల్లో అనుమానాలున్నాయి. చంద్రబాబుకు విశ్వసనీయత లేకపోవడం టిడిపికి పెద్ద మైనస్ పాయింట్. అంతే కాదు, ప్రభుత్వంతో చంద్రబాబు కుమ్మక్కు అయ్యారని జనం నమ్ముతున్నారు. తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు పనితీరు.. కాంగ్రెస్‌తోఆడుతున్న నాటకాన్ని జనం గమనిస్తున్నారు. జగనన్న ఆశయంతో పాదయాత్ర చేస్తూ జనంలోకి వచ్చిన షర్మిలకు ప్రజలు బ్రహ్మరథం పడుతూ.. అక్కున చేర్చుకోవడం చూస్తే రానున్నది జగన్ ప్రభంజనం..రాజన్న రాజ్యమేనని ప్రజల కళ్లలో ఆశలు చిగురిస్తున్నాయనడంలో ఇక ఏ సందేహమూ అక్కర్లేదు.

Back to Top