అభిమానమే వీరికి ఆలంబన

మహబూబ్‌నగర్:

దివంగత మహానేత పట్ల గుండెల్లో నింపుకున్న అభిమానాన్ని వారు పాదయాత్రలో చూపుతున్నారు. ఆ అభిమానమే వారిని శ్రీమతి షర్మిలతో నడిచేలా చేస్తోంది.  దివంగత నేత కుటుంబాన్ని వేధిస్తున్న తీరు  వారిని కదిలించింది! అన్యాయంగా తమ అభిమాన నేతను జైలుపాలు చేయించిన కుట్రలు వారిని తట్టిలేపుతున్నాయి!! అందుకే దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అండగా నిలవాలనీ,  నీచ రాజకీయాలకు పాతరేయాలని నిర్ణయించుకున్నారు. తమ పనులను సైతం వదిలేసి ఎండనక వాననక షర్మిల వెంట అడుగులో అడుగు వేస్తున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి చెల్లెలు శ్రీమతి వైయస్ షర్మిల అక్టోబర్ 18న మరో ప్రజాప్రస్థానం ప్రారంభించిన నాటినుంచి వారు ఆమె వెంట నడుస్తున్నారు.  వైయస్ కుటుంబంపై అభిమానంతో అన్ని కష్టాలను ఆధిగమిస్తూ షర్మిలతో నడుస్తున్నామని వారు చెబుతున్నారు. యాత్రలో నడిచేవారిలో ఎవరికైనా చేతులు, కాళ్లు నొప్పులు వస్తే విశ్రాంతి తీసుకోవాలని షర్మిల కోరినప్పటికీ.. అందుకు ఎవ్వరూ ఒప్పుకోకుండా ‘మీ వెంటనే నడుస్తాం’ అంటూ ముందుకు కదులుతున్నారు.

ప్రాక్టీసును వదులుకుని నడుస్తున్న వైద్యుడు

     అనంతపురం
జిల్లా పుట్టపర్తి మండలం ఎనుముపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ హరికృష్ణ
కూడా శ్రీమతి షర్మిల వెంట నడుస్తున్నారు. ఇందుకోసం ఆయన తన క్లినిక్‌ను
విడిచిపెట్టారు.  ఎన్నో కుటుంబాలకు చెందిన వారు వైద్యం సక్రమంగా అందక,
మృత్యువాతపడ్డారని, ఇలాంటి పరిస్థితుల్లో  ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం
సంజీవనిగా నిలిచిందన్నారు. ఎందరికో మేలు చేసిన వైయస్ కుటుంబాన్ని పాలకులు
ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తన క్లినిక్‌ను వదులుకొని ప్రజా
సమస్యలు తెలుసుకునేందుకు షర్మిల చేపట్టిన యాత్రలో పాల్గొంటున్నానని
చెప్పారు.


మహానేత కారణంగానే సర్పంచునయ్యాను: వెంకటయ్య

     మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం చందాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ ఎ.వెంకటయ్య. స్వతహాగా వికలాంగుడు. . కర్ర లేనిదే నడవలేని పరిస్థితి. 2003లో మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్నారు.  డాక్టర్ వైయస్ పేరు చెప్పుకొని ఆరేళ్ల కిందట సర్పంచిగా గెలిచాననీ, ఆ ఆ కృతజ్ఞతతోనే రోజుకు 15 నుంచి 18 కిలోమీటర్లు నడవటం కష్టమైనా ఏమాత్రం అలసట లేకుండా 50 రోజులుగా షర్మిలమ్మ వెంట నడుస్తున్నాని చెప్పారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిని అన్యాయంగా జైలు పాలు చేశారనీ, ఆ కుటుంబం నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ వారికి అండగా నిలబడాలని కోరారు.

అండగా నిలిచేందుకే నడుస్తున్నా...

    కడప జిల్లా సింహాద్రిపురం మండలం కసునూరు గ్రామానికి చెందిన  కసునూరు రఘునాథరెడ్డి కాంట్రాక్టర్. మొదట్నుంచీ మహానేత కుటుంబమంటే ఎంతో అభిమానం. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆదుకునే మనస్తత్వం డాక్టర్ వైయస్ కుటుంబానికి మొదట్నుంచీ ఉందని చెప్పారు. మహానేత రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన నేతలు, ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ జగన్‌ను అక్రమంగా జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకే కాంట్రాక్టు పనులను వదులుకొని శ్రీమతి షర్మిల వెంట నడుస్తున్నానన్నారు.

నడవడం కష్టమా... ఏమీ లేదు

     అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి. పాలక, ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలు గాలికొదిలేయడంతో వారి సమస్యలను, బాధలను నేరుగా వినేందుకు శ్రీమతి షర్మిల యాత్ర చేపట్టారని భారతి తెలిపారు. శ్రీమతి షర్మిల తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని ఒక మహిళగా ప్రసంశిస్తూ తాను కూడా  అడుగులో అడుగు వేయాలని నిర్ణయించుకొని వెంట నడుస్తున్నట్లు చెప్పారు. 50 రోజులుగా నడుస్తున్నా తనకేమీ కష్టం అనిపించడం లేదన్నారు.

ఆరోగ్యశ్రీ లేకుంటే ఈ నడకే లేదు..

     ప్రకాశం జిల్లాకు చెందిన ఎన్. దయామణి నాలుగేళ్ల కిందట పులివెందులకు వచ్చి స్థిర పడ్డారు. వెన్నెముక నొప్పి రావడంతో ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. చేతిలో చిల్లి గవ్వలేదు. మహానేత డాక్టర్ వైయస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కార్డు వల్ల లక్ష రూపాయల విలువ చేసే అపరేషన్ ఉచితంగా చేయించుకున్నానని తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వకపోతే ఈనాడు ఇలా నడిచేదాన్ని కాదన్నారు. పేదలకు వైయస్ మంచి పనులు చేశారని, ఆయన మరణానంతరం ఆ ఆశయాలు కొనసాగించేందుకు జగన్ ప్రజల్లోకి వెళ్తుంటే అన్యాయంగా జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వైయస్ ద్వారా లబ్ధి పొందిన మాలాంటి వాళ్లు షర్మిల వెంట నడుస్తున్నామని తెలిపారు.

Back to Top