హైదరాబాద్, 28 జూలై 2013:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న చరిత్రాత్మక మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఆగస్టు 4వ తేదీన ముగుస్తుందని పార్టీ ఎం.పి. మేకపాటి రాజమోహన్రెడ్డి ప్రకటించారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగే మహా బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, పార్టీ నాయకులు, శ్రేణులు, ప్రజలు తరలి రావాలని ఆయన ఆహ్వానించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయం తెలిపారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ జిల్లాల కన్వీనర్లు, అనుబంధ సంస్థల బాధ్యులు తెలియజేసి ఆ రోజున జరిగే ముగింపు కార్యక్రమానికి హాజరయ్యేలా చూడాలని పిలుపునిచ్చారు. ఆ రోజు మధ్యాహ్నానికే అందరూ ఇచ్ఛాపురం చేరుకునేలా చూడాలని చెప్పారు.
ఒక మహిళా నాయకురాలు ఎండా, వాన, రాత్రి, పగలు అనకుండా ఇంత సుదీర్ఘమైన పాదయాత్ర చేయడం అపూర్వమైన ఘట్టం అని మేకపాటి రాజమోహన్రెడ్డి అభివర్ణించారు. ముగింపు మహా సభను అందరూ జయప్రదం చేయాలని కోరారు.