ప్రకాశం: ప్రత్యేక హోదా సాధనకు వైయస్ఆర్సీపీ ఎంపీలతో పాటు టీడీపీ నేతలు కూడా రాజీనామా చేయాలని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి డిమాండు చేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న వైయస్ఆర్సీపీ నేతలపై కేసులు పెట్టి వేధించిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చీరాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. నాలుగేళ్లు అధికారాన్ని అనుభవించి ఇప్పుడు రాజీనామాలు చేస్తే ప్రజలు హర్షించరన్నారు. సర్వజనుల కోరిక మేరకు ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రావాలని డిమాండు చేశారు.