శ్రీకాకుళం(ఆమదాలవలస): చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని వైయస్ఆర్సీపీ నాయకుడు తమ్మినేని సీతారాం విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం పూర్తిగా విఫలమయ్యారని, డ్వాక్రా మహిళలు, రైతులు, నిరుద్యోగులు ఇలా అందరినీ దగా చేశారని ఆయన ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలోని చిట్టివలస పంచాయతీలో పార్టీ మండల అధ్యక్షులు తమ్మినేని శ్రీరామూర్తి ఆధ్వర్యంలో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీతారాం ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ రూపొందించిన ప్రజాబ్యాలెట్ పంపిణీ చేసి బాబు పాలనను తూర్పారబట్టారు.
ప్రభుత్వ విప్ కూన రవికుమార్ చిట్టివలస గ్రామాన్ని దత్తత తీసుకుని రెండేళ్లు గడుస్తున్నా నేటికీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని మండిపడ్డారు. గ్రామంలో ఇళ్లపై నుంచి విద్యుత్ తీగలు వేలాడుతూ ప్రమాదాలకు నిలయంగా మారుతుందని, పంట పొలాలకు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజన్న పాలన మరలా రావాలంటే వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని వెంకట చిరంజీవి నాగ్ (నాని), మున్సిపల్ వైస్ ప్లోర్లీడర్ అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు (చిన్ని), పార్టీ నాయకులు సైలాడ దాసునాయుడు, గురుగుబెల్లి శ్రీనివాసరావు, ఇసా అప్పారావు, గురుగుబెల్లి చలపతిరావు, మొండేటి కూర్మారావు, మండల నారాయణరావు, సీరా ఆదినారాయణ, తిర్లంగి శ్రీనివాసరావు, పి.వి.రమణ(ముద్దు), చిగురుపల్లి సత్యన్నారాయణ, సీర కడపయ్య, సీర నర్సయ్య, సీర రమణ, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.