చిత్తూరు: కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, మన పార్టీ కార్యకలాపాలను గ్రామ స్థాయికి చేరవేయడం అత్యవసరమని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడు ఆధ్వర్యంలో పలమనేరు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ సంస్థాగత నిర్మాణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో కమిటీలను సక్రమంగా రూపొందించడం ద్వారా ప్రతి పంచాయతీకి 70–100 మంది సభ్యులు పార్టీ కార్యాకలాపాల్లో పాలుపంచుకునే అవకాశం ఉంటుందన్నారు. గ్రామ కమిటీలో 9 మంది ప్రధాన సభ్యులతో, 7 అనుబంధ కమిటీలలో 5–10 మంది సభ్యులతో ఏర్పాటు చేయాలని, సోషల్ మీడియా కన్వీనర్ పాత్ర అత్యంత కీలకం అని వెల్లడించారు. ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, రెండు పంచాయతీలకు కో-ఆర్డినేటర్ నియామకం, గుర్తింపు కార్డులు, ఇన్సూరెన్స్ సదుపాయం వంటి ఏర్పాట్లను కూడా ప్రకటించారు. సమావేశంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, నాయకులు చవ్వా రాజశేఖర్ రెడ్డి, వెంకట రెడ్డి యాదవ్, పలమనేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.