<br/>కడప: చంద్రబాబు ప్రజలను నిలువునా మోసం చేశాడని.. ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి అమలుచేయలేక చతికిలబడిన సీఎం ప్రజలను దగా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని.. ప్రజలు నమ్మితే చివరకు విమానాన్ని కూడా కొనిస్తానని చెబుతాడని వైయస్ఆర్ సీపీ నేతలు ఎద్దేవా చేశారు. జమ్మలమడుగులో మాజీమంత్రి, సీజీసీ సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డి, రాజంపేటలో జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, బద్వేలులో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, జమ్మలమడుగు, బద్వేలు నియోజకవర్గాల సమన్వయకర్తలు డాక్టర్ సుధీర్రెడి, డాక్టర్ వెంకటసుబ్బయ్యలు గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైయస్ఆర్ సీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని.. ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టి అవినీతే అజెండాగా బాబు ముందుకుపోతున్నారన్నారు. రుణమాఫీ, డ్వాక్రా మాఫీ, ఇంటింటికి ఉద్యోగం, నిరుద్యోగ భృతి, పేదలందరికీ పక్కా గృహాల పేరుతో బాబు అధికారంలోకి వచ్చినా ఎవరికి ఎటువంటి సాయం చేయకుండా ముందుకుపోతున్నారని వారు ఆరోపించారు. దివంగత సీఎం వైయస్ఆర్ హయాంలో పేదలకు ఎన్నో సంక్షేమపథకాలు అందాయని.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఎటువంటి సంక్షేమ పథకాలు అందలేదన్నారు. జమ్మలమడుగులో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, సమన్వయకర్త డాక్టర్ సుధీర్రెడ్డిలు జమ్మలమడుగులోని 11, 12వ వార్డులలో ఇంటింటికి తిరగగా.. రాజంపేటలోని ఈడీపేట, ఉస్మాన్నగర్ల్లో జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, పట్టణ కన్వీనర్ పోలా శ్రీనివాసరెడ్డిలు గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం చేపట్టారు. బద్వేలు నియోజకవర్గంలోని గోపవరం మండలం రాచాయపేట గ్రామంలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, సమన్వయకర్త వెంకటసుబ్బయ్యలు కార్యక్రమంలో పాల్గొన్నారు.