<strong>* హోదా సాధనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం</strong><strong>* బాబు పాలనలో రైతుల ఇబ్బందులు వర్ణణాతీతం</strong><strong><br/></strong>ఒంగోలు: ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాడుతున్న పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, హోదా సాధించడమే తమ ధ్యేయమని, ఊపిరి ఉన్నంత వరకు హోదా కోసం పోరాడుతూనే ఉంటామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. జననేత వైయస్ జగన్ వెంట పాదయాత్రలో ఉన్న వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో బాబు చిత్తశుద్ధితో పనిచేయడం లేదన్నారు. బాబుకు దమ్ముంటే మా నాయకుడు వైయస్ జగన్ విసిరిన అవిశ్వాసన తీర్మానం సవాల్ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏలో భాగస్వామి అయిన చంద్రబాబు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేయకపోగా.. హోదా కోసం పోరాడుతున్న వాళ్లను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, ప్రజల కోసం నాడు సోనియా గాంధీతోనైనా, నేడు మోడీ తోనైనా పోరాడడానికి తాము సిద్ధమన్నారు. చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. మరీ ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పాటు, ప్రాజెక్టులు ఏవీ పూర్తి చేయకపోవడంతో లక్షల ఎకరాలు ఎండిపోయాయన్నారు. రైతులు అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. బాబుకు ప్రజలు గుణపాఠం చెప్పే రోజు దగ్గరల్లోనే ఉందని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.