మహానేత పాలన వైయస్ జగన్ కే సాధ్యం

వైయస్‌ఆర్‌ జిల్లా: రాయలసీమ ప్రాంతానికి టీడీపీ సర్కార్ తీరని ద్రోహం చేస్తుందని వైయస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు కడప జిల్లాకు శాశ్వత కరువు మిగిల్చే పరిస్థితి తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  చంద్రబాబు సీమకు చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ కడప కలెక్టరేట్ వద్ద వైయస్సార్సీపీ రైతు మహాధర్నా చేపట్టింది. ఈసందర్భంగా నేతలు బాబు పాలనను తూర్పారబట్టారు. 

వైయస్  వివేకానందరెడ్డి(వైయస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి)
ప్రజాభిష్టాన్ని కాలరాసి కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు రాష్ట్రాన్ని దుర్మార్గంగా విభజించాయని వైయస్సార్సీపీ సీనియర్ నేత వివేకానందరెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని వైయస్సార్సీపీ అంకుటిత దీక్షతో నినదించి ఉద్యమించిందని చెప్పారు. ఈప్రాంత అభివృద్ధి కోసం మహానేత వైయస్ఆర్ ఎంతో పరితపించారని పేర్కొన్నారు. పార్లమెంట్  సాక్షిగా ఇచ్చిన  హోదా హామీని కూడా సాధించుకోలేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉందని ఎధ్దేవా చేశారు. రాయలసీమలోని ప్రాజెక్ట్ లకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉండి కూడా ఇవ్వకుండా చంద్రబాబు  దిగువకు మళ్లిస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమకు న్యాయంగా దక్కాల్సిన నీళ్లను దక్కనీయకుండా... చంద్రబాబు, కేసీఆర్ లను పోటీపడి మరి  నీళ్లు తరలించుకుపోతున్నారని ధ్వజమెత్తారు. కడపకు చంద్రబాబు శాశ్వత కరువును మిగిల్చే పరిస్థితిని తీసుకొస్తున్నారని మండిపడ్డారు. శ్రీశైలం రిజర్వాయర్ లో 870 అడుగుల నిల్వసామర్థ్యాన్ని మెయింటైన్ చేయాలని డిమాండ్ చేశారు. కడపలో ఉక్కుఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ హామీ ఏమైందని బాబును ప్రశ్నించారు. మనందరిలో స్ఫూర్తి రగిలించడానికే వైయస్ జగన్ రైతు మహాధర్నా చేపట్టారని చెప్పారు. ప్రభుత్వంలో చలనం రావాలంటే అందరం కలిసికట్టుగా ఈప్రాంత అభివృద్ధి కోసం న్యాయం జరిగే వరకు పోరాడుదామని పిలుపునిచ్చారు. హోదాను సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.  

ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి(వైయస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు)
రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ ప్రాంతానికి పూర్తిగా అన్యాయం చేస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు అభివృద్ధిలో వెనుకబడిన రాయలసీమ ప్రాంతాలకు సకల సదుపాయాలు కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టిన పాపాన పోలేదన్నారు. సీమలో రైతాంగం సమస్యలను చూసి పోతిరెడ్డి హెడ్‌రెగ్యులేటర్‌ సామర్ధ్యం పెంచిన మహానుభావుడు వైయస్సార్ అని గుర్తు చేశారు.  రైతుల కడుపు నింపిన ఏకైక వ్యక్తి వైయస్‌ఆర్‌ అని కొనియాడారు. ఇప్పటికే వైయస్‌ఆర్‌ జిల్లాకు 15 సార్లు వచ్చిన చంద్రబాబు రేపు నెలలో నీళ్లు ఇస్తాం అంటూ తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలే నీటి కోసం గడ్డాలు పెంచుకొని ఎదురుచూస్తున్నారని ఎద్దేవా చేశారు. వైయస్‌ జగన్‌ కడప జిల్లాలో మహాధర్నా కార్యక్రమం చేపడుతున్నారని తెలుసుకొని హుటాహుటిన చంద్రబాబు రాయచోటిలో పర్యటించి రెయిన్‌ గన్స్‌ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారన్నారు.  పైర్లు ఎండిపోయాక  రెయిన్‌ గన్స్‌తో ఏం ప్రయోజనమని ప్రశ్నించారు.  పరిపాలనను గాలికొదిలేసి ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నేను నిప్పుని అని చెప్పుకుంటూ విచారణను ఎదుర్కోకుండా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చకున్నారన్నారు. నిత్యం నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు ప్రజల ఆగ్రహానికి బూడిదైపోతారని హెచ్చరించారు. 
 
శాస‌న‌మండలి స‌భ్యులు గోవింద‌రెడ్డి
అధికార పార్టీగా టీడీపీ పూర్తిగా వైఫ‌ల్యం చెందింద‌ని... ప్ర‌తిప‌క్ష పార్టీగా వైయ‌స్సార్‌సీపీ స‌మ‌ర్థ‌వంతంగా పనిచేస్తుందని శాస‌న‌మండ‌లి స‌భ్యులు గోవింద‌రెడ్డి అన్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీపై అన‌వ‌స‌రంగా విరుచుకుప‌డ‌డం తప్ప చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు చేసే మేలు ఏమీ లేదని ఎత్తిపొడిచారు. ఎన్నిక‌ల‌కు ముందు బాబు ఇచ్చిన హామీల‌కు ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న పాల‌న‌కు ఏమాత్రం పొంత‌న‌లేదన్నారు. ఆనాడు అర‌చేతిలో వైకుంఠం చూపించిన చంద్ర‌బాబు.. అధికారంలోకి రాగానే ప్ర‌జ‌ల‌ను న‌ట్టేటా ముంచారని ధ్వజమెత్తారు. చంద్ర‌బాబు మోస‌పూరిత పాల‌న‌ను వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ప్రతిరోజు ప్ర‌జ‌లు దృష్టికి తీసుకొస్తున్నార‌ని తెలిపారు. బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలోని బ్ర‌హ్మ‌సాగ‌ర్ ప్రాజెక్టుకు 2006లో 12 టీఎంసీల నీళ్లను తీసుకొచ్చిన ఘ‌న‌త దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికే దక్కిందన్నారు. బాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బ్ర‌హ్మ‌సాగ‌ర్ కు ఒక్క టీఎంసీ నీటినైనా తీసుకొచ్చేవారని అన్నారు.  దివంగ‌త మ‌హానేత వైయ‌స్సార్ పాల‌న కేవ‌లం ఒక్క వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికే సాధ్య‌మ‌న్నారు. 

 రఘురామిరెడ్డి(మైదుకూరు ఎమ్మెల్యే)
రాయలసీమ ప్రాంత ప్రజలు నీటి కోసం అల్లాడుతుంటే, టీడీపీ నేతలకు నీరు–చెట్టు పథకం కావాలని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఎద్దేవా చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగులకు పైగా నీరున్నా..రాయలసీమకు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పాటుపడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌ జిల్లాకు ఇప్పటి వరకు 13 సార్లు వచ్చిన చంద్రబాబు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు.
 


Back to Top