ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్‌తో కలుస్తావు బాబూ?


- చంద్రబాబువి కుట్రపూరిత రాజకీయాలు..
వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అబంటి రాంబాబు
విజయవాడః  తెలుగువారి మనోభావాలకు వ్యతిరేకంగా ఆంధ్రపదేశ్‌ను రెండుగా చీల్చిన కాంగ్రెస్‌ పార్టీతో టీడీపీ జతకట్టడం దారుణమని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అబంటి రాంబాబు మండిపడ్డారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ తెలుగు రాష్ట్రాన్ని రెండుగా చీల్చి ద్రోహం చేసిందన్నారు. గురువారం ఆయ‌న విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడారు. 1956కు ముందు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఎలా ఉందో నేడు కూడా అలాగే మిగిలిందన్నారు. నవంబర్‌ 1న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రాహుల్‌ గాంధీని కలవడానికి ప్రయత్నించడం విచారకరమన్నారు. ఏపీని ఛిన్నాభిన్నం చేసినా కాంగ్రెస్‌తో కలవడం దుర్మార్గమన్నారు.  ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్‌తో కలుస్తున్నారో  ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.  కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తెలుగుదేశం ఎన్టీఆర్‌ స్థాపించారని, ఈ దేశం నుంచి కాంగ్రెస్‌ను పారద్రోలతాను అని ప్రారంభించిన రాజకీయ పార్టీ  కాంగ్రెస్‌ పార్టీతో రాజకీయాలకు వెళ్ళాలనే నిర్ణయంలో అశ్చర్యం లేదని, ఎందుకంటే చంద్రబాబు నైజం అలాంటిందని అందరికి తెలుసన్నారు. చంద్రబాబు చరిత్ర అలాంటిందన్నారు. ఎన్టీఆర్‌ టీడీపీ స్థాపించినపుడు చంద్రబాబు కాంగ్రెస్‌లో ఉన్నారని, మీ మామగారు పార్టీ పెట్టారు కాదా ఆ పార్టీలోకి వెళతారా అని మీడియా ప్రశ్నిస్తే.. నేను అలా వెళ్ళే వ్యక్తిని కాదు.. ఇందిరాగాంధీ ఆదేశిస్తే మా మామగారిౖ పెనే పోటీ చేస్తానని చెప్పిన చంద్రబాబు.. సీన్‌ కట్‌ చేస్తే అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలిస్తే దొడ్డిదారిన పార్టీలోకి ప్రవేశించి చంద్రబాబు కీలకభూమికను పోషించాడన్నారు. ఎన్టీఆర్‌ను దేవుడు అన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పోడిచి పార్టీని లాక్కున్నారన్నారు. ఎన్టీఆర్‌  నైతిక విలువలు లేవని చెప్పిన వ్యక్తే చంద్రబాబు నాయుడు అని అన్నారు.గతంలో మోదీ ఆంధ్రప్రదేశ్‌కు వస్తే అరెస్ట్‌ చేస్తామన్న చంద్రబాబే  అదే మోదీతో  జతకట్టారన్నారు. మోడీ,బాబు జోడి ఈ రాష్ట్రానికి అవసరం, కీలక పరిణామం అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.  కేంద్రం ప్రభుత్వం వ్యవస్థలను నీరుగారుస్తుందని చంద్రబాబు చెబుతున్నారని మరి చంద్రబాబు ప్రభుత్వం పాలు గారుస్తుందా అని విమర్శించారు. ఎమ్మార్వోలపై దాడి చేస్తారు. ఐపీఎస్‌ అధికారులపైనే దౌర్జన్యాలు చేస్తారని పక్క రాష్ట్రాలకు వెళ్ళి పోలీసు వ్యవస్థను డబ్బులు పంచే పనులను చేయిస్తున్నారని, వ్యవస్థను విచ్చిన్నం చేసి మరొక వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తున్న వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. తల్లి కాంగ్రెస్,పిల్ల కాంగ్రెస్‌ అని గతంలో చంద్రబాబు విమర్శించారన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ఎప్పుడూ మోదీతో కుమ్మక్కు కాలేదన్నారు. కాంగ్రెస్‌తో కలిసి మేము పోటీ చేశామా అని ప్రశ్నించారు. చంద్రబాబు మళ్లీ అధికారంలో వచ్చే అవకాశం ఉందా అని ప్రశ్నించారు. ఎప్పుడైనా చంద్రబాబు సింగిల్‌గా పోటిచేసారా అని ప్రశ్నించారు..గత ఎన్నికల్లో చంద్రబాబుకు మోదీ కావాలి..పవన్‌ కావాలి. నేడు వారు వద్దు..రాహుల్‌ కావాలని ఎద్దేవా చేశారు.  119 సీట్లులో 13 సీట్లు కోసం కక్కుర్తి పడి ఢిల్లీ వెళ్ళావని విమర్శించారు. గత ఎన్నికల్లో కేవలం ఐదున్నర లక్షల ఓట్లు తేడాతో వైయస్‌ఆర్‌సీపీ ఓడిపోయిందన్నారు. అప్పడు మోదీ,పవన్‌ను చేరొక చేతులో  పట్టుకుని నడిచిన చంద్రబాబుకు నేడు రాహుల్‌గాంధీ కావాల్సి వచ్చిందన్నారు. రాహుల్‌ గాంధీని భూజాన వేసుకోకపోతే  గెలవమని చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. రాహుల్‌ గాంధీని పప్పు అన్నది మీరు కాదా..ప్రత్యేకహోదా అవసరం లేదని చెప్పిన మొదటి వ్యక్తి చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.  ఇప్పుడు హోదా కోసం ధర్మపోరాట దీక్షలని చెవిలో పూలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటలీ దెయ్యం సోనియాగాంధీని తరిమికొట్టమని చెప్పింది మరిచిపోయారా చంద్రబాబును ప్రశ్నించారు.
 



Back to Top