<strong><br/></strong><strong>జల సంకల్పయాత్ర పేరిట ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి పాదయాత్ర</strong><strong>8 నుంచి 16వ తేదీ వరకు</strong><strong>హంద్రీనీవా ఆయకట్టుకు నీరు ఇవ్వాలని డిమాండ్</strong><strong>ఫిరాయింపుదారులపై తక్షణమే అనర్హత వేటు వేయాలి</strong>అనంతపురం: హంద్రీనీవా ఆయకట్టు నీటి కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి పోరుబాటకు సిద్ధమయ్యారు. ఆయకట్టుకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జల సంకల్ప యాత్ర పేరుతో మార్చి 8 నుంచి 16వ తేదీ వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. ఉరవకొండలో ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా 130 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి నీటి విడుదలపై చంద్రబాబు చేస్తున్న మోసాన్ని వివరించడంతో పాటు నీటి కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేనున్నామన్నారు. కరువు రైతులను ఆదుకోవాలనే చిత్తశుద్ధి చంద్రబాబుకు లేదన్నారు. హంద్రీనీవా డిస్ట్రిబ్యూటరీ పనులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం దుర్మార్గమన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రులు ఫొటోలకు ఫోజులివ్వడం తప్ప నాలుగేళ్లుగా సాధించేందేమీ లేదన్నారు. దివంగత మహానే వైయస్ రాజశేఖరరెడ్డి హంద్రీనీవా ప్రాజెక్టును దాదాపు 90 శాతం పూర్తి చేశారని మిగిలిన 10 శాతం పనులను పూర్తి చేయకుండా ప్రాజెక్టుల అంచెనాలను పెంచి కమీషన్లు తీసుకుంటున్నారన్నారు. <br/>వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి చంద్రబాబుకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. ఫిరాయింపుదారులపై వేటు వేసిన మరుక్షణమే వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తామన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించకుండా నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇప్పటికీ వైయస్ఆర్ సీపీ సభ్యులుగా గుర్తించడం చంద్రబాబు దివాళా కోరుతనానికి నిదర్శనమన్నారు.