ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం

విశాఖపట్నం : ఆర్టీసీ మనుగడ సాధించాలంటే వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ను గెలిపించాలని కార్మికులకు ఆ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరిలో జరిగే ఆర్టీసీ ఎన్నికల్లో తమ యూనియన్ పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. టేబుల్ ఫ్యాన్ గుర్తుపై రాష్ట్రంలోని 126 డిపోల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.

ఈ ఎన్నికల నేపథ్యంలో రవీంద్రనాథ్ రెడ్డి విశాఖపట్నంలో ఆర్టీసీ యూనియన్ నేతలతో సమీక్ష నిర్వహించారు. అనంతరం పి.రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.... ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి దివాలా తీసే యోచనలో చంద్రబాబు సర్కార్ కుట్ర చేస్తోందని మండిపడ్డారు.  ప్రస్తుతమున్న యూనియన్ ల కి... ప్రభుత్వాన్ని, ఆర్టీసీ మేనేజ్ మెంట్ ని నిలదీసే నాయకత్వం లేదన్నారు. ఆర్టీసీ కార్మికులపై మేనేజ్ మెంట్ వేధింపులు ఎక్కువయ్యాయని ఫైరయ్యారు. 

సంస్థలో యూనియన్లు బలంగా ఉంటే రాష్ట్రంలో అద్దె బస్సులు వచ్చేవి కావని ఆయన అభిప్రాయపడ్డారు. తమ పార్టీలోని 67 మంది ఎమ్మెల్యేలతో సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూరు యూనియన్ పని చేస్తుందని పి.రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీ  అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపైనే తొలి సంతకం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు రవీంద్రనాథ్ రెడ్డి చెప్పారు. అందుకోసం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చర్చిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Back to Top