ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుంటాం

దెందులూరులో వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయం ప్రారంభం
పాల్గొన్న ఎమ్మెల్సీ ఆళ్ల నాని, కోటగిరి శ్రీధర్, కొటారి అబ్బయ్యచౌదరి
పశ్చిమగోదావరి: ప్రజలకు, కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని దెందులూరు నియోజకవర్గ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కోఆర్డినేటర్‌ కొటారి అబ్బయ్యచౌదరి అన్నారు. దెందులూరు నియోజకవర్గ వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయాన్ని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని, ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్‌లు ముఖ్యఅతిథులుగా హాజరై ప్రారంభించారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి అబ్బయ్యచౌదరి కృషి చేస్తున్నారని వారు అన్నారు. కార్యకర్తలు, నాయకులు టీడీపీ నేతలు, పోలీసుల బెదిరింపులకు లొంగకుండా పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు.

చంద్రబాబు, లోకేష్‌ మద్దతుతో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ రెచ్చిపోతున్నారని ఎమ్మెల్సీ ఆళ్ల నాని ధ్వజమెత్తారు. పార్టీ కార్యాలయం ప్రారంభం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దెందులూరు నియోజకవర్గంలో దారుణమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఇసుక, మట్టిని విచ్చలవిడిగా అమ్ముకుంటూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి తరువాత ఇంత దారుణ పరిస్థితి దెందులూరులో ఎప్పుడూ చూడలేదన్నారు. చంద్రబాబు పశ్చిమ గోదావరికి ఒక్క పరిశ్రమ అయినా తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. కొల్లేరులో ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా..? శాంతిభద్రతల సమస్యలను పరిష్కరించగలిగారా అని ప్రశ్నించారు. కోట్లాది రూపాయల ప్రజధనాన్ని కొల్లగొడుతుంటే ఎక్కడైనా అడ్డుకట్ట వేయగలిగారా..? అని నిలదీశారు. టీడీపీ పాలనలో జిల్లాలో అరాచకాలు ఎక్కువయ్యాయన్నారు. ఇలాంటి పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని కోరారు. 
 
Back to Top