కేంద్రం మొండివైఖ‌రి వీడాలి


- బీజేపీ, టీడీపీ రెండూ రాష్ట్రాన్ని ముంచాయి
-  సిగ్గూశరం ఉంటే ఇప్పటికైనా స్పందించాలి
- ప్ర‌ధాని మోడీ మాట నిల‌బెట్టుకోవాలి
 
 
న్యూఢిల్లీ:  ప్ర‌త్యేక హోదాపై ఉద్య‌మం తీవ్ర‌రూపం దాల్చినా..ఎంపీలు ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేసినా..ప్ర‌జ‌లు రోడ్ల‌పైకి వ‌చ్చినా కేంద్రం మొండివైఖ‌రి అవ‌లంభిస్తుంద‌ని  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. బీజేపీకి సిగ్గూశరం ఉంటే ఇప్పటికైనా స్పందించాలని, మాట తప్పిన ప్రధాని అని అనిపించుకోకూడదునుకుంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని ఆయ‌న పేర్కొన్నారు. బుధవారం  ఎంపీల దీక్షా ప్రాంగణంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘మంగళవారం నుంచే ఎంపీల ఆరోగ్య పరిస్థితి దిగజారుతోంది. కళ్లు తిరగడం, తలనొప్పి, శరీరం సహకరించకపోవడం జరిగింద‌న్నారు.  యువకులు కాబట్టి తట్టుకోగలుగుతున్నారన్నారు.

కేంద్రంలో చ‌ల‌నం లేదు
చరిత్రలో తొలిసారిగా ఎంపీలు ఇలా రాజీనామా చేసి ఢిల్లీలో దీక్షకు కూర్చుంటే కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. కదలిక లేకుండా.. పూర్తిగా మొండివైఖరితో ఉంద‌ని స‌జ్జ‌ల అన్నారు.  పరిశీలిస్తామని గానీ, వారి దూతలను పంపడం గానీ జరగలేదు. మా ఎంపీలు జనం తరపున పోరాడుతున్నారు. ఈ ఆందోళన జనంలోకి వెళ్లింది. అక్కడ కూడా వీరికి మద్దతుగా నిరంతర పోరాటం సాగుతోంది. రహదారుల నిర్బంధం, రైల్‌రోకో జరుగుతోంది. ప్రజా ఉద్యమంగా మారడంలో ఎంపీలు కీలకంగా మారారు. మరోవైపు వారి ఆరోగ్యం క్షీణిస్తోంది. యువకులు కాబట్టి తట్టుకున్నప్పటికీ ఆరోగ్యం మరింత విషమిస్తే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరించారు. ఆ మేరకు డాక్టర్లు పోలీసులకు సలహా ఇచ్చారు. ఎంపీలు ఇంకా జనం కోసం పోరాడాల్సి ఉంది. వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం’ అని తెలిపారు.

పార్ల‌మెంట్‌లో చేసిన చ‌ట్టాల‌కు విలువ లేదు
‘బహుశా ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడా ఉండదు. అత్యున్నత వేదిక, ప్రజాస్వామ్య దేవాలయం లాంటి పార్లమెంటులో చేసిన చట్టానికి విలువ లేదు. ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలంటే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. అన్ని పక్షాల మద్దతుతో వెలువడిన ప్రధాని ప్రకటనకు విలువ లేదు. వీటిలో భాగస్వాములైన బీజేపీ, కేంద్ర ప్రభుత్వం, అందులో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని ముంచేశారు. కాంగ్రెస్‌ ఎలాగూ శవం. రాష్ట్రంలో చచ్చిపోయింది. టీడీపీ, బీజేపీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి అమలు చేయాల్సిన బాధ్యత పెట్టుకుని ఇప్పుడు మాకేం సంబంధం అంటూ పక్కకు పడేశారు. ఎన్నికలొస్తున్నాయని చివరి నిమిషంలో యూటర్న్‌ తీసుకున్నప్పటికీ జనంలోకి పోవడానికి టీడీపీ భయపడుతోంది. ఇప్పటికే తన బస్సు యాత్రను నిలిపివేసింది. ఇక బీజేపీకి ఇప్పటికైనా హోదా ప్రకటించి ప్రజల మన్నన పొందేందుకు ఆస్కారం ఉంది.

ఏమాత్రం వారికి సిగ్గూశరం ఉన్నా, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్నా, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనుకున్నా, దేశమంతా దీన్ని చర్చించుకుంటున్నందున మాట తప్పిన ప్రధానిగా, మాట తప్పిన ప్రభుత్వంగా అనిపించుకోకుండా ఉండాలంటే ఇప్పటికైనా వాళ్లకు అవకాశం ఉంది. కానీ సానుకూలత కనిపించడం లేదు. జనంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పుట్టి ఏడేళ్లయినా అందులో నాలుగేళ్లుగా పోరాటంలోనే ఉంది. హోదా అంటే ఏంటో జనంలో చైతన్యం తెచ్చింది. హోదా లేనిపక్షంలో భవిష్యత్తు లేదని వివరించింది. సెంటిమెంటుగా మార్చగలిగింది. అది జగన్‌మోహన్‌రెడ్డి చేసిన కృషి ఫలితం. ఎంపీల రాజీనామా, దీక్షతో ఇది మరింత తీవ్రమైన స్థాయికి వెళ్లింది. ప్రజలంతా కదిలివస్తున్నారు. అందుకే ప్రజా ఉద్యమంగా మారింది. కేవలం మా కార్యకర్తలు వస్తే రోడ్లు కొద్దిసేపు మాత్రమే ఆపగలం. కానీ ప్రజలు తరలివస్తున్నారు. ప్రజలు ఈ ఉద్యమంతో ఉన్నారు. ఇదే ప్రాతిపదికన రేపు ప్రజాతీర్పు కోరుతాం’ అని ఆయన పేర్కొన్నారు.
Back to Top