మీ అభ్యర్థి.. శ్రీదేవమ్మ


- పత్తికొండ నియోజకవర్గ అభ్యర్థిగా కంగాటి శ్రీదేవి పేరు ప్ర‌క‌ట‌న‌
-  ఎన్నికలకు ఏడాది ముందే అభ్యర్థి పేరు ఖరారు

క‌ర్నూలు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌ర్నూలు జిల్లా నుంచి ఎన్నిక‌ల శంఖారావం మ్రోగించారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీకి పోటీచేసే తొలి అభ్యర్థి పేరు ముందుగానే ఖరారు చేశారు.  పత్తికొండ నియోజకవర్గ అభ్యర్థిగా దివంగ‌త నేత చెరుకుల‌పాడు నారాయ‌ణ‌రెడ్డి స‌తీమ‌ణి కంగాటి శ్రీదేవి పేరు ప్రకటించారు. మీ అభ్య‌ర్థి శ్రీ‌దేవ‌మ్మ అంటూ అశేష జ‌న‌వాహిణి న‌డుమ జ‌న‌నేత పేరు వెల్ల‌డి చేయ‌డంతో నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం కృష్ణగిరిలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి.. పత్తికొండ నియోజకవర్గ ప్రజలకు తీపి కబురు అందించారు. ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయమున్న తరుణంలోనే పత్తికొండ అభ్యర్థిగా కంగాటి శ్రీదేవిని ప్రకటించారు. రెండింతల మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గతంలో కూడా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  వైయ‌స్ఆర్‌సీపీ తొలి అభ్యర్థిగా డోన్‌ నియోజకవర్గం నుంచి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని ప్రకటించారు. రాష్ట్రంలో ఎక్కడా ఎవరికి సీటు ఇచ్చే విషయాన్ని ఏ రాజకీయ పార్టీ  ఇప్పటివరకు ప్రకటించ లేదు. తొలిసారి  పత్తికొండ అభ్యర్థిగా శ్రీదేవి పేరును ఖరారు చేశారు. గతంలో డోన్‌లో బుగ్గనను ప్రకటించిన సమయంలో టీడీపీ నుంచి కేఈ కృష్ణమూర్తి ఎమ్మెల్యేగా ఉండగా, ఈసారి పత్తికొండ నుంచి కూడా ఎమ్మెల్యేగా ఆయనే ఉండడం యాదృచ్ఛికం.   
Back to Top