నెల్లూరు: కుల ధ్రువీకరణ పత్రాల కోసం బేడా, బుడగ జంగాల కులస్తులు చేపట్టిన ఉద్యమానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మద్దతు తెలిపారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ను బెడా, బుడగ జంగాల కులస్తులు కలిశారు. ఈ సందర్భంగా వారు తమకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని కోరారు. ఎన్నికల సమయంలో తమకు న్యాయం చేస్తామని ఓట్లు వేయించుకొని చంద్రబాబు మోసం చేశారని వారు వైయస్జగన్ దృష్టికి తీసుకెళ్లారు. బుడగ జంగాల ప్రతినిధులు మాట్లాడుతూ..రాజ్యాంగం ప్రకారం 1954 నుంచి ఎస్సీలుగా సర్టిఫికెట్లు పొందేవారమన్నారు. 144 జీవో తీసుకురావడం వల్ల మాకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. మా పిల్లలను చదివించుకోలేక భిక్షాటన చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా చంద్రబాబు బుగడజంగాలకు న్యాయం చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని మోసం చేశారన్నారు. చంద్రబాబు తీరుకు వ్యతిరేకంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనున్నామన్నారు. మా ఉద్యమానికి వైయస్ జగన్ మద్దతు తెలిపినట్లు ఆయన తెలిపారు. రాకెట్ యుగంలో కూడా కుల సర్టిఫికెట్ల కోసం పోరాటం చేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు. కొత్త కులాలను ఎస్సీ జాబితాలో చేర్చుతామని చంద్రబాబు మోసం చేస్తున్నారని వారు మండిపడ్డారు.