<br/><br/>నెల్లూరు: రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఆదుకుంటానని వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిమ్మ రైతులకు హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఇనకుర్తిలో నిమ్మ రైతులు వైయస్ జగన్ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. బస్తా పచ్చి కాయలు రూ.500, పండిన కాయలు రూ.200, కోయడానికి రూ.300, రవాణా ఖర్చులు రూ.80, సెస్లు భరించాల్సి వస్తుందని, మార్కెట్కు నిమ్మకాయలు తీసుకెళ్తే కనీసం గిట్టుబాటు ధర రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి లేదు. చేతి నుంచి డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది. నిమ్మ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని వారు వైయస్ జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఢిల్లీకి నిమ్మకాయలు పంపించిన ఘనత పలుకూరు మండలానికి ఉందని చెప్పారు. నిమ్మకాయలకు గిట్టుబాటు ధర కల్పించకపోతే ఆత్మహత్యలే శరణ్యమన్నారు. తెలుగు గంగ కాలువ వస్తే మా బతుకులు మారుతాయని వారు వైయస్ జగన్కు వివరించారు. రైతుల సమస్యలు సావధానంగా విన్న జననేత మరో ఏడాది ఓపిక పడితే మంచి రోజులు వస్తాయని భరోసా కల్పించారు. మనందరి ప్రభుత్వం వచ్చాక రైతులకు తోడుగా ఉంటానని గిట్టుబాటు ధర కల్పిస్తానని హామీ ఇచ్చారు. వైయస్ జగన్ హామీతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.