నాలుగు రెట్లిస్తాం.. రాసిస్తావా బాబూ!

కాకినాడ :

చంద్రబా‌బు నాయుడు ప్రకటించిన రూ.41.70 కోట్ల విలువైన ఆస్తులకు నాలుగు రెట్ల డబ్బులు తాము అడుక్కొని అయినా ఇస్తామని, మీ ఆస్తులు మాకు రాసిచ్చేస్తావా బాబూ? అని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నాయకుడు, కాకినాడ నగర తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సవాల్ విసిరారు. కాకినాడలో మంగళవారం ‌ఆయన మీడియాతో మాట్లాడారు. సత్యహరిశ్చంద్రునిలా తన వ్యక్తిగత ఆస్తి రూ.42 లక్షలేనని, తన భార్య భువనేశ్వరికి రూ.33.05 కోట్లు, కుమారుడు లోకేష్‌కు రూ. 4.92 కోట్లు, కోడలు బ్రాహ్మణికి రూ. 3.30 కోట్లు అంటూ మొత్తం కుటుంబ ఆస్తి కేవలం 41.70 కోట్లు మాత్రమే అంటూ ప్రకటించడం ఎవర్ని మోసగించడానికని ప్రశ్నించారు.

బ్రాహ్మణికి రూ.9.90 లక్షల విలువైన బంగారు ఆభరణాలు మాత్రమే ఉన్నాయని చంద్రబాబు ప్రకటించారని, అయితే తన చెల్లెలి వివాహానికి ఆమె వేసుకున్న వస్తువులను టివి చానళ్ళన్నీ చూపించాయన్నారు. వాటి విలువ ఎంతో మీకు తెలియకపోతే మాకు ఇస్తే విలువ కట్టిస్తామన్నారు. చంద్రబాబు చెప్పే కాకిలెక్కలు చూసి ప్రజలు మోసపోరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఒక ఉగ్రవాదిలా తయారయ్యారని, అమెరికాలో ట్విన్ టవర్సును కూల్చివేసి ఉగ్రవాది బిన్‌లాడెన్ అమెరికాను అతలాకుతలం చేస్తే రాష్ర్ట విభజనకు అనుకూలంగా రెండు లేఖలు ఇచ్చి ఆయన ఆంధ్రప్రదే‌శ్‌ను అదే స్థాయిలో నాశనం చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రక్రియ మొదలవుతుందని కేంద్రం ప్రకటిస్తే రెండు రాష్ట్రాల్లోనూ టిడిపి ఉంటుందని, ఒక రాష్ర్టంలో లోకేష్, మరో రాష్ర్టంలో తాను సిఎం అవుదామనే దురాశతో చంద్రబాబు కాంగ్రెస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారని ద్వారంపూడి దుయ్యబట్టారు.

Back to Top