విషపు కోరల కుట్రకు సిబిఐ పదును

ఏమీ నిరూపించలేని కేసులో సైతం వేధింపుల్ని ఎంతకైనా తీసుకెళ్లగలమని దర్యాప్తు సంస్థలు నిరూపిస్తూ ఉండగా, తమను ఎదిరించి నిలవటం ఎంతటి వారికైనా అసాధ్యమని చెప్పేందుకు కాంగ్రెస్‌ పార్టీ కుటిల యత్నాలు చేస్తోంది. తొమ్మిదిన్నరేళ్ల అక్రమాలు బయటపడి, జనాదరణ కోల్పోయి, కార్యాలయానికి తాళం వేసుకోవాల్సిన స్థితికి చేరిన తెలుగుదేశం దానికి అండగా నిలవటంతో ఇరుపక్షాలూ రెచ్చిపోతున్నాయి.

టీడీపీ ఎంపీలు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరాన్ని గురువారంనాడు కలవడం... బాబు ఆయనతో ఫోన్లో మాట్లాడటం... వారంతా జగన్ సంస్థల ఆస్తుల్ని అటా‌చ్ చేయాలని కోరటం... ఆపై కొద్ది‌ గంటల్లోనే చిదంబరం పరిధిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరే‌ట్ ‘అటా‌చ్‌మెంట్’ ఉత్తర్వులు ఇవ్వడం ఈ లోతైన కుట్రకు పరాకాష్ట. 

సుప్రీంకోర్టు‌ శుక్రవారంనాడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి బెయి‌ల్ పిటిష‌న్‌ను తోసిపుచ్చిన సందర్భంగా జరిగిన విచారణలో కూడా... ఇంకా దర్యాప్తు చేస్తున్నామని, మరింత సమయం కావాలని సీబీఐ చెప్పడాన్ని బెయిల్‌ను జాప్యం చేసే ఎత్తుగడగానే న్యాయ వర్గాలు భావిస్తున్నాయి. విచారణ పూర్తయ్యాక బెయిల్‌ పిటిషన్ వేయొచ్చని సుప్రీం చేసిన సూచనపైనా విస్మయం వ్యక్తమయింది. మొత్తానికి సీబీఐ తాను అమలు చేయాలనుకున్న కుట్రను ముందుకు తీసుకెళుతోందనే చెప్పాలి.
ఈ కుట్రలో తొటి నుంచీ స్పష్టమవుతున్న పలు కోణాలు, గీత దాటుతున్న వ్యవస్థలు, న్యాయానికి అన్యాయం చేస్తున్న దర్యాప్తు సంస్థలు.. అధికారం అండతో తామేం చేసినా చెల్లుతుందన్న రీతిలోనే పోతున్నాయి. ఆ కుట్రల్ని, ఈ కేసుల్లోని డొల్లతనాన్ని, దర్యాప్తు సంస్థల దిగజారుడు ఎత్తులను బయటపెడుతోంది. 

‘ఏదో’ జరిగిపోయిందని ముందస్తుగానే ఓ నిర్ణయానికి వచ్చేసి.. ఆనక దాన్ని రుజువు చేసేందుకు అధిష్టాన బాసుల ఆదేశాలకు అనుగుణంగా.. ఆద్యంతం అడ్డదారుల్లో.. అత్యంత అడ్డదిడ్డంగా జగన్మోహన్‌రెడ్డి కేసులో సీబీఐ దర్యాప్తు సాగిస్తున్న తీరు రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులతో పాటు సామాన్యులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఫిర్యాదులోని ప్రధానాంశాన్ని, కోర్టు విచారణ అదేశాలను పూర్తిగా తుంగలో తొక్కుతూ.. కేవలం జగన్ సంస్థల్లోకి వచ్చిన ప్రతి పైసానూ పట్టి పట్టి చూడటానికి మాత్రమే దర్యాప్తును పరిమితం చేయడం ద్వారా సీబీఐ తన ఉద్దేశాలను ఎప్పటికప్పుడు మొహమాటం లేకుండా బయట పెట్టుకుంటూనే వస్తోంది.

ఈ కేసులో ప్రధానమైన ఆరోపణ క్విడ్ ప్రో కో. అంటే ఇచ్చిపుచ్చుకోవటం. వై‌యస్ రాజశేఖరరెడ్డి హయాంలో పలు సంస్థలకు భూములు కేటాయించడంతో పాటు అనుమతులు మంజూరు చేశారని, అందుకు ప్రతిగా అవి వై‌యస్ జగ‌న్మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయనేది ప్రధాన ఆరోపణ. కేంద్రంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా ఇలా ప్రభుత్వ నిర్ణయాలపై ఆరోపణలు వచ్చినపుడు మొదట తేల్చేది ఆ నిర్ణయం తప్పా, కాదా అని. ఒకవేళ నిజంగా ప్రభుత్వ నిర్ణయం తప్పని తేలితే... అప్పుడు ఆ పెట్టుబడుల్ని క్విడ్ ప్రో కో అనొచ్చు. కానీ ఇక్కడ సీబీఐ ఆ నిర్ణయాల జోలికి పోలేదు. అవి తప్పో ఒప్పో పట్టించుకోలేదు. కేవలం వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని టార్గెట్ చేసి‌, ఆయన సంస్థల్లోకి పెట్టుబడిగా వచ్చిన ప్రతి రూపాయీ ఎలా వచ్చిందో శోధిస్తోంది. ఆ ఇన్వెస్టర్లు ప్రభుత్వ ప్రాజెక్టులేమైనా పొందారో లేదో చూస్తోంది. ఒకవేళ పొంది ఉంటే... అవన్నీ క్విడ్ ప్రోకోలేనని వాదిస్తూ వారిని వేధిస్తోంది.
దారుణం ఏమిటంటే.. ఒకవేళ ఏ ప్రభుత్వ ప్రాజెక్టూ చేపట్టని ఇన్వెస్టర్లుంటే... వారు పెట్టుబడులు పెట్టి మోసపోయారని మరీ కేసు పెడుతోంది. దీన్నేమంటారు? సీబీఐ విచారిస్తున్నదేంటి? ప్రభుత్వ నిర్ణయాలనా? జగన్ సంస్థల్లో పెట్టుబడులనా? ఇన్వెస్టర్లు మోసపోయారని చెప్పే అధికారం సీబీఐకి ఎక్కడుంది? ఆ పెట్టుబడులు పెట్టినవారు లాభాలు సైతం అందుకున్నా అది సీబీఐకి కనిపించట్లేదా? క్విడ్ ప్రో కో పెట్టుబడులకు లాభాలొస్తాయా? సీబీఐ గానీ, ఇతర వ్యవస్థలు గానీ దీన్నెందుకు పట్టించుకోవడం లేదు?

నిజానికి క్వి‌డ్ ప్రో కో ఆరోపణలకు సంబంధించి సీబీఐ చెబుతున్న అంశాల్లో ఒక్క దాన్లోనూ ప్రభుత్వానికి నష్టం జరిగినట్లు తేలలేదు. నష్టం జరగనప్పుడు ఆ నిర్ణయం తప్పుడుదనే ప్రసక్తే ఉండదు. అది సరైన నిర్ణయమైనపుడు క్విడ్ ప్రో కో అనే వాదనే ఉండదు. అంతేగాక‌, ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమైనా అది మంత్రివర్గ ఉమ్మడి నిర్ణయమని న్యాయ నిపుణులతో పాటు గత తీర్పులూ స్పష్టంగా చెబుతున్నాయి. మరి ఉమ్మడి నిర్ణయానికి దురుద్దేశాలు అంటగట్టి, అందుకు అప్పటి ముఖ్యమంత్రి ఒక్కడినే బాధ్యుడిని చేస్తూ, ఏ ప్రభుత్వ పదవిలోనూ లేని ఆయన తనయుడు అధికార దుర్వినియోగం చేశారనడం ఎంతవరకూ సబబు?

చార్జిషీట్ల ప్రహసనం...:
జగన్మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి 2011 ఆగస్టులో దర్యాప్తు మొదలుపెట్టిన సీబీఐ మార్చి 31న ఒక చార్జిషీటు దాఖలు చేసింది. చార్జిషీటంటే దర్యాప్తు పూర్తయ్యాక కోర్టుకిచ్చే తుది నివేదిక. కానీ ఇదే కేసులో ఏప్రిల్ 23న సీబీఐ మరో చార్జిషీటు దాఖలు చేసింది. మే 7న ఇంకొకటి, ఆగస్టులో మరొకటి వేసింది. ఇంకా చార్జిషీట్లు వేస్తూనే ఉంటామని చెప్పింది. ఇది జగ‌న్ బెయిలుపై బయటకు రాకుండా చేయటానికేనని ఇప్పటికే ఎన్నో విమర్శలొచ్చాయి.
ఇక్కడ మరో విషయం ప్రస్తావించాలి. రెండో చార్జిషీటు వేసినప్పుడు తొలి చార్జిషీటుతో కలిపి దానిపై విచారణ ప్రారంభిస్తామని న్యాయమూర్తి స్పష్టంగా రాశారు. కానీ సీబీఐ అందుకు అభ్యంతరం చెబుతూ మెమో వేసింది. న్యాయ ప్రక్రియలోనూ జోక్యం చేసుకుంది. చివరికి ఒక్కో చార్జిషీటునూ ఒక్కో కేసుగా పరిగణిస్తున్నట్లు మూడు చార్జిషీట్లపైనా కోర్టు నిర్ణయాన్ని ప్రకటించింది. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే, వైయస్ రాజశేఖరరెడ్డి బతికి ఉండగా ‘ఈనాడు’, మరో పత్రిక రాసిన ఆరోపణలే ఆయన మరణానంతరం శంకర్రావు, టీడీపీ నేతలు వేసిన పిటిషన్లలో దర్శనమిచ్చాయి. వాటిలోని అంశాలే సీబీఐ నమోదు చేసిన ఎ‌ఫ్ఐఆ‌ర్‌లో పునరావృతమయ్యాయి. ఎఫ్ఐఆ‌ర్‌లోని అంశాలే ఆ తరవాత రిమాండ్ రిపోర్టుల్లోను, చార్జిషీట్లలోను ప్రత్యక్షమవుతున్నాయి. ఇదీ కథ.

ఇవన్నీ కుట్రలకు నిదర్శనాలు కావా?‌:
వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో జరుగుతున్న పరిణామాలు చూస్తే, అవి ముందెన్నడూ ఏ కేసులోనూ జరిగినవి కాదన్న విషయం స్పష్టమవుతుంది. మరి ఎక్కడా, ఎప్పుడూ జరగనివి ఈ కేసులో మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి? వీటివెనక కుట్రలు లేవనగలమా?

కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు హైకోర్టుకు లేఖ రా‌శారు. దాంట్లో తెలుగుదేశం నేతలు ఇంప్లీడ్ అయ్యారు. ఇద్దరూ డాక్యుమెంట్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఒకరి పత్రాలు మరొకరు జిరా‌క్స్ తీసుకుని మరీ కేసు వేశారు. ఈ రెండు పార్టీలూ కలిసి ఒక వ్యక్తిని టార్గె‌ట్ చేయటమనేది చరిత్రలో ఇప్పటిదాకా లేదు. ఇది కుట్ర కాదా? శంకర్రావు పిటిష‌న్‌లో వేసిన అంశాలు అంతకు ముందు యెల్లో మీడియాలో వచ్చినవే కదా? దానికి ‘సాక్షి’ ఎప్పటికిప్పుడు ఆధారాలతో సహా ఇచ్చిన సమాధానాల్ని ఎవ్వరూ పరిగణనలోకి తీసుకోలేదెందుకు?

లేఖ రాసిన శంకర్రావుకు మంత్రి పదవి దక్కింది. ఇది క్విడ్ ప్రో కో కాదా?‌:
హైకోర్టు ప్రాథమిక విచారణకు అనుమతించగా, వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫు న్యాయవాదులు దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ‘ప్రాథమిక విచారణే కదా? చెయ్యనివ్వండి. నివేదిక మీకు చూపించాకే కోర్టు తదుపరి చర్యలకు ఆదేశాలిస్తుంది’ అని సుప్రీం చెప్పింది. సీబీఐ ప్రాథమిక విచారణ నివేదికను హైకోర్టుకు ఇచ్చింది. కోర్టు దాన్ని జగన్‌ తరఫు న్యాయవాదులకు ఇవ్వకుండానే పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. అదేంటని అడిగితే... ‘ఆ నివేదిక చూసి మళ్లీ సీల్ చేసేశాం. అయినా మేం పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశిస్తున్నది దాని ఆధారంగా కాదు’ అని నాటి చీ‌ఫ్ జస్టి‌స్ నిసా‌ర్ అహ్మ‌ద్ కక్రూ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేసింది. నివేదిక ఆధారంగా కాకుంటే మరి దేని ఆధారంగా దర్యాప్తునకు ఆదేశించారు? అని జగ‌న్ తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు కూడా. దీనిపై సుప్రీంకోర్టు‌కు వెళ్లగా, ‘దర్యాప్తే కదా! జరగనివ్వండి. మీరు ఏ తప్పూ చేయకుండా భయమెందుకు?’ అని చెప్పింది సుప్రీం. మరి సీబీఐ చేస్తున్న దర్యాప్తు తప్పు జరిగిందో లేదో తేల్చేలా ఉందా?

దర్యాప్తునకు ఆదేశించిన జస్టిస్ కక్రూ రిటైరయ్యాక రాష్ట్ర మానవహక్కుల కమిష‌న్ చైర్మ‌న్‌గా నియమితులయ్యారు. తెలుగు రాని కక్రూను అలా ఎందుకు నియమించాల్సి వచ్చిందో చెప్పాలంటూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలయింది.

తప్పు జరిగిందో లేదో... శంకర్రావు ఆరోపణలు నిజమో కాదో తేల్చేందుకు సీబీఐ దర్యాప్తు మొదలుపెడితే పర్వాలేదు. కానీ తప్పు జరిగిపోయిందని, దాన్ని రుజువు చేసేందుకు ఆధారాలు సంపాదించాలని సీబీఐ నిర్ణయించేసుకుంది. దర్యాప్తునకు ఆదేశించి 48 గంటలు తిరక్కముందే 30కి పైగా బృందాలతో, పలు ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులకు దిగింది. వై‌యస్‌ జగన్మోహన్‌రెడ్డి సంస్థలపైన, ఇన్వెస్టర్ల ఇళ్లు, ఆఫీసులపైన దాడులకు దిగి భయభ్రాంతుల్ని చేసింది. బోఫోర్స్, 2జీ, కో‌ల్ గే‌ట్ వంటి తీవ్రమైన కుంభకోణాల్లోనూ ఇలా చేయని సీబీఐ ఈ కేసులో ఎందుకింత దారుణంగా చేసింది? రాజకీయ బాసుల్ని సంతృప్తి పరచటానికి కాదా? ఇది కుట్ర కాదా?
వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని కనీసం విచారించకుండానే మూడు చార్జిషీట్లు వేసిన సీబీఐ.. కోర్టు సమన్లు అందుకుని, మరో 24 గంటల్లో కోర్టు ఎదుట హాజరవుతారనగా ఆయనను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది? కోర్టు ఆయనకు బెయిలిస్తే ఆపై అరెస్టు చేసి వేధించటం కుదరదనా? ఎవరు ఆడిస్తున్నారు ఈ డ్రామాను?

అరెస్టు చేసిన నాటి నుంచి జగన్మోహన్‌రెడ్డి బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్నిటికీ రకరకాల మార్గాల్లో గండి కొడుతున్న సీబీఐ చేయాలనుకుంటున్నదేమిటి? ఈ కేసులో తేల్చాలనుకుంటున్నదేమిటి? 

దర్యాప్తు కొనసాగుతోందని చెబుతూనే అంతా పూర్తయినట్లుగా, అక్రమాలు బయట పడ్డాయంటూ మీడియాకు లీకులిస్తూ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబం పరువు ప్రతిష్టల్ని దెబ్బతీసేలా ఓ వర్గానికి చెందిన మీడియాలో కథనాలు ఎందుకు రాయించాల్సి వచ్చింది? టీడీపీ అధినేత చంద్రబాబుకు కొమ్ముకాసే మీడియాతో సీబీఐ ఎందుకు దోస్తీ చేస్తోంది?

బెయిల్ పిటిష‌న్ విచారణకు వచ్చి‌ బెయిల్ వచ్చే అవకాశ‌ం ఉందని భావించిన సందర్భాల్లో ఒకసారి న్యాయమూర్తులను బెదిరించే స్థాయిలో గాలి జనార్దనరెడ్డి ‘బెయిల్ ఫ‌ర్ సే‌ల్’ స్కా‌మ్‌ను బయటపెట్టడం, మరోసారి కేంద్రం తమకు ఇచ్చిన న్యాయవాదిపై అభ్యంతరాల్ని మీడియా ద్వారా లీకు చేయటం వంటివి చేయలేదా? నిన్నటికి నిన్న మరోసారి ఆర్థికమంత్రి చిదంబరాన్ని టీడీపీ కలవటం, బాబు ఫోన్ చేసి జగ‌న్ ఆస్తు‌లను అటా‌చ్ చేయాలని కోరటం, కొన్ని గంటల్లోనే అటాచ్‌మెంట్ ఉత్తర్వులు రావటం ఇదంతా ఏమనుకోవాలి? శుక్రవారంనాటి బెయి‌ల్ తీర్పును ప్రభావితం చేసేలా ఢిల్లీలో టీడీపీ చేసిన ఈ కుయత్నాల్ని ఏమనుకోవాలి? ఇదంతా కుట్ర కాదా? టీడీపీ-కాంగ్రె‌స్ పాలూనీళ్ల మాదిరిగా కలిసిపోయి పనిచేస్తున్నాయని చెప్పటానికి ఇంకా ఏం కావాలి?

‌16 కోట్ల లబ్ధికి 29 కోట్ల పెట్టుబడట?:
అరబిందో ఫార్మా, హెటెరో డ్రగ్స్‌లకు విశాఖ జిల్లా నక్కపల్లి సెజ్‌లోను, మహబూబ్‌నగర్ జిల్లా జడ్జర్ల సె‌జ్‌లోను భూములు కేటాయించారని, జడ్జర్ల సెజ్‌లో ఈ రెండిటికీ తలా 75 ఎకరాల చొప్పున 150 ఎకరాలను కేటాయించారని తొలి చార్జిషీట్లో సీబీఐ పేర్కొంది. ధరలను నిర్ణయించే కమిటీ ఎకరానికి రూ.15 లక్షలు నిర్ణయించినా, ఎకరా రూ.7 లక్షలకే ఇచ్చారని, దీంతో ప్రభుత్వం రూ.12 కోట్లు నష్టపోయిందని పేర్కొంది. ఇదిగాక అరబిందో ఫార్మా తనకు మెదక్ జిల్లా పాశమైలారంలో ఇచ్చిన 25 ఎకరాల భూమిని తన అనుబంధ కంపెనీ ట్రైడెంట్ లై‌ఫ్ సెన్సై‌స్‌కు బదలాయించిందని, ఆ సంస్థ నేరుగా ఏపీఐఐసీ నుంచి తీసుకోకుండా అరబిందో నుంచి తీసుకోవటం వల్ల దానికి రూ.4.3 కోట్లు లబ్ధి చేకూరిందని పేర్కొంది. ఇలా రూ.16.2 కోట్ల లబ్ధి చేకూరినందుకు ప్రతిఫలంగా ఈ రెండు సంస్థలూ కలిసి జగన్మోహన్‌రెడ్డి కంపెనీల్లో రూ.29.5 కోట్లు పెట్టుబడి పెట్టాయని తెలిపింది.

అసలు రూ.16 కోట్లు లబ్ధి పొందినందుకు 32 కోట్లు పెట్టుబడి పెట్టేవారెవరైనా ఉంటారా? అలా పెట్టారంటే దానర్థం వారు ఆ కంపెనీల్లో లాభాల కోసమే ఇన్వెస్ట్ చేశారని కాదా? జడ్చర్ల సె‌జ్‌కు చంద్రబాబు హయాంలో భూములు సేకరించినా మూడేళ్ల పాటు అక్కడ పరిశ్రమ పెట్టడానికి ఎవరూ రాకపోవటాన్ని సీబీఐ ఎందుకు ప్రస్తావించలేదు? అభివృద్ధి చేసిన భూమిని ఎకరా రూ.15 లక్షలకు ఇస్తున్నపుడు చుట్టూ ప్రహరీ కట్టి, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసినవారికి తక్కువకు ఇవ్వాల్సిన పనిలేదా? దీన్ని సీబీఐ ఎందుకు గమనించలేదు? ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరే‌ట్ ఈ కేసులో ఆస్తుల్ని అటా‌చ్ చేస్తూ రూ.21.5 కోట్ల లబ్ధి కలిగినందుకే వారు రూ.29.5 కోట్లు పెట్టుబడి పెట్టారనటం ఎంతవరకు సబబు? ఈ లెక్కల్ని ఎలా అర్థం చేసుకోవాలి?

ఇన్వెస్టర్లు మోసపోయారా?‌:
జగన్మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి కలిసి జగతి పబ్లికేషన్స్ లాభాలపై తప్పుడు అంచనాలు చెప్పి పలువురి చేత పెట్టుబడులు పెట్టించారనేది రెండో చార్జిషీ‌ట్‌లో సీబీఐ చేసిన ప్రధాన ఆరోపణ. ‘2008లో టి.ఆర్.కణ్ణ‌న్‌ను విజయసాయిరెడ్డి కలిశారు. జగతిలో రూ.5 కోట్లు పెట్టుబడి పెట్టాలన్నారు. ఆయన ఓకే చేశారు. దుబాయ్ ఎన్నారై మాధ‌వ్ రామచంద్రతో 2008లో విజయసాయిరెడ్డి మాట్లాడారు. త్వరలో జగతి పబ్లి‌క్ ఇష్యూకు వెళ్లబోతోందని, భారీ లాభాలొస్తాయని ఆశపెట్టారు. డెలాయి‌ట్ నివేదిక ప్రతిని చూపటంతో ఆయన రూ.19.65 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇంకా దండమూడి అరు‌ణ్‌కుమార్ కూడా విజయసాయిరెడ్డి మాటలు నమ్మి రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టారు’ అని సీబీఐ ప్రస్తావించింది. వారికి డివిడెండ్ రాలేదని, పెట్టుబడిపై వడ్డీ కూడా రాలేదని పేర్కొంది.

అసలు సీబీఐ విచారించాల్సింది క్విడ్ ప్రో కో పెట్టుబడులనా? ఇన్వె‌స్ట్‌మెంట్లనా? ప్రభుత్వ ప్రాజెక్టులు చేపట్టిన వారైతే క్విడ్ ప్రో కో పెట్టుబడులు పెట్టారని‌, ఏ ప్రాజెక్టూ చేపట్టని వారైతే మోసపోయారని చెప్పడం ఎంతవరకూ కరెక్టు? ఇలా చేయాలని సీబీఐకి ఎవరు చెప్పారు? కొందరి పెట్టుబడులకు లాభాలు కూడా వచ్చిన నేపథ్యంలో సీబీఐ అడ్డగోలు వాదన బయటపడటం లేదా? ఇది న్యాయస్థానాల్లో నిలవదనిదానికి తెలీదనుకోవాలా?

లాభాల్ని విస్మరించి అడ్డగోలు అంకెలు:
ఈ ఏడాది ఆగస్టులో వాన్‌పిక్ వ్యవహారంపై సీబీఐ దాఖలు చేసిన నాలుగో చార్జిషీటు చూస్తే ఎవరికైనా బుర్ర తిరగటం ఖాయం. ప్రభుత్వం నుంచి వా‌న్‌పిక్ ప్రాజెక్టును పొందినందుకు జగ‌న్మోహన్‌రెడ్డి సంస్థల్లో నిమ్మగడ్డ ప్రసాద్ రూ.854.5 కోట్లు ఇన్వె‌స్ట్ చేశారని, అందులో కొంత వాటాను ఆయన విక్రయించగా ఇంకా రూ.505 కోట్ల మేర ఆయన ఇన్వె‌స్ట్‌మెంట్లు మిగిలాయని చార్జిషీట్‌లో సీబీఐ పేర్కొంది.

నిజానికి ఇదే పెద్ద కుట్ర. ఎందుకంటే ప్రసాద్‌ జగతి పబ్లికేషన్స్‌లో 2007లో రూ.50 కోట్లు జగతిలో, రూ.280 కోట్లు భారతి సిమెంట్స్‌లో పెట్టుబడి పెట్టారు. అప్పటికి వాన్‌పిక్ అనే ఊసేలేదు. తర్వాత 2008లో జగతి పబ్లికేష‌న్స్‌లో ఆయన మరో రూ.50 కోట్లు పెట్టుబడులు పెట్టారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణానంతరం 2010 ఏప్రిల్‌లో భారతి సిమెంట్స్‌లో మెజారిటీ వాటాను ఫ్రాన్స్ కంపెనీ వికా కొనుగోలు చేసింది. ఈ సమయంలో ప్రసా‌ద్ తన వాటాను పూర్తిగా విక్రయించేశారు. ఆయనకు పెట్టుబడి పోను రూ.308 కోట్ల లాభం వచ్చింది. ఈ లాభానికి రూ.42 కోట్లు కలిపి రూ.350 కోట్లను 2010 ఏప్రి‌ల్-మే మధ్య జగతి పబ్లికేష‌న్స్‌లో పెట్టుబడి పెట్టారు. అంటే ఆయన నికరంగా పెట్టుబడి పెట్టింది రూ.142 కోట్లు. కానీ సీబీఐ రూ.854 కోట్లుగా పేర్కొనటమే అసలు కుట్ర. పెపైచ్చు ఈ ఇన్వెన్స్‌మెంట్లలో అత్యధికం వాన్‌పిక్ ఊసు లేనప్పుడో... వై‌యస్‌ రాజశేఖరరెడ్డి మరణించాకో వచ్చినవే. వాటిని క్విడ్ ప్రో కో అంటే ఎలా? అసలు వా‌న్‌పిక్‌కు కేటాయించింది ప్రైవేటు భూమి. దాన్ని వాన్‌పిక్ సంస్థే సేకరించింది. అలాంటపుడు ప్రభుత్వం నష్టపోయిందెక్కడ? ఎందుకింత అడ్డగోలు వాదనలు?

బాబును వదిలి గ్రీ‌న్‌బెల్ట్ వెంట‌:
మూడవ చార్జిషీట్లో సీబీఐ పేర్కొన్న అంశం విశాఖలో రాంకీ సంస్థ చేపట్టిన ఫార్మా సిటీ. దీనిలో గ్రీన్‌బెల్ట్ ఉండాల్సిన ఏరియాను తగ్గించి, ఆ సంస్థకు ప్రయోజనం కల్పించారని, ప్రతిగా అది జగతి పబ్లికేష‌న్స్‌లో రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టిందని సీబీఐ పేర్కొంది.

సీబీఐ చెప్పిన ప్రకారమే ఈ ఫార్మా సిటీని ఏర్పాటు చేసింది చంద్రబాబు. 2001 సెప్టెంబర్ 24న దాన్ని ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చిన బాబు ప్రభుత్వం చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో దాన్ని ‘బి‌ల్ట్ ఆపరే‌ట్ ఓన్ ట్రా‌న్స్‌ఫర్ (బూ‌ట్)’ బదులు బీఓఓ పద్ధతికి మార్చింది. ఇలా మార్చిన నెల రోజులకే (2003 జూలైన 31న) రాంకీ ఇన్‌ఫ్రా ఈ ప్రాజెక్టును చేపట్టడానికి ఆసక్తి చూపిస్తూ ప్రతిపాదన ఇచ్చింది. దానికి ప్రాజెక్టు ఖరారైపోయింది. 2,143 ఎకరాల భూమిని దానికి అప్పగించడం కూడా జరిగిపోయింది. 2004 మార్చి 11న రాంకీ ఫార్మా సిటీ సంస్థ ఏర్పాటు కాగా మర్నాడే కన్సెషన్ ఒప్పందం కుదుర్చుకున్నారు.‌

పాజెక్టులో 352 ఎకరాల మేర గ్రీన్ జో‌న్ ఉండాలని, దీ‌నిలో గ్రీన్‌బెల్ట్ 58 ఎకరాలు‌ ఉండాలని ఒప్పందంలో పేర్కొన్నారు. ఆ లే ఔట్‌ను విశాఖ నగరాభివృద్ధి సంస్థ ఆమోదించింది. ఇదంతా జరిగింది బాబు హయాంలో కాగా వైయస్ హయాంలో గ్రీ‌న్‌బెల్ట్‌ను పెంచాలని భావించి, మళ్లీ వినతులు రావటంతో మునుపటి 58 ఎకరాలకే పరిమితమయ్యారు. ఇలా చేసినందుకే రాంకీ సంస్థ జగతిలో రూ.10 కోట్ల పెట్టుబడి పెట్టిందన్నది సీబీఐ అభియోగం. అసలు రాంకీకి ఫార్మాసిటీ కట్టబెట్టిందెవరు? 2,143 ఎకరాల్ని అప్పగించిందెవరు? దానితో కన్సెషన్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నదెవరు? దాని ప్రకారం గ్రీ‌న్‌బెల్ట్ ఉండాల్సిందెంత? ఇప్పుడున్నదెంత? మధ్యలో వై‌యస్ ప్రభుత్వం చేసిందేంటి? అనేవన్నీ సీబీఐ గాలికొదిలేసింది. సింగి‌ల్ టెండరుతో వచ్చిన రాంకీకి బాబు భూమి కట్టబెట్టడాన్నీ ప్రశ్నించలేదు. దీన్నేమనాలి?

తాజా వీడియోలు

Back to Top