వైయస్ఆర్ కాంగ్రెస్‌లోకి కరుణ, శ్రీకళ

హైదరాబాద్:

నల్లగొండ జిల్లా నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరిగాయి. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన ఇద్దరు ప్రముఖ మహిళలు శుక్రవారం ఆ పార్టీలో చేరారు. సీపీఎం సీనియర్ నాయకురాలు మల్లు స్వరాజ్యం కుమార్తె, తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ నాయకురాలు పాదూరి కరుణ, మాజీ ఎమ్మెల్యే కీసర జితేందర్‌రెడ్డి కుమార్తె శ్రీకళారెడ్డి కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, సూర్యాపేటకు చెందిన కార్యకర్తలతో భారీ ఊరేగింపుగా వైయస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నివాసానికి చేరుకున్నారు. విజయమ్మ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పాదూరి కరుణ 2009 ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చే శారు. శ్రీకళారెడ్డి వ్యాపారవేత్త. వీరు పార్టీలో చేరిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వై.వి. సుబ్బారెడ్డి, నల్లగొండ జిల్లా పార్టీ అడ్‌హక్ కమిటీ కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డి, ముఖ్య నేతలు గున్నం నాగిరెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, అలుగుబెల్లి రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

జగన్ సీఎం కావాలనే పార్టీలో చేరా: శ్రీకళారెడ్డి

     ప్రస్తుత పరిస్థితుల్లో జగనన్న ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాననీ, ఈ లక్ష్యంతోనే పార్టీలో చేరాననీ  శ్రీకళారెడ్డి చెప్పారు. జగనన్న ముఖ్యమంత్రి కావడం కోసం ఇంట్లో కూర్చుంటే లాభం లేదని భావించాననని కష్టపడి పార్టీ విజయం కోసం కృషి చేసేందుకే వచ్చానని అన్నారు. సంక్షేమ పథకాల అమలు జరగాలంటే జగన్ ముఖ్యమంత్రి కావడమే మార్గమని అభిప్రాయపడ్డారు.

ఎన్నికలెప్పుడు జరిగినా జగన్‌దే గెలుపు: కరుణ

     రాష్ట్రంలో ఎన్నికలు ఎపుడు జరిగినా వై.యస్.జగన్‌మోహన్‌రెడ్డి గెలుపు ఖాయమని పాదూరి కరుణ అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్‌లో చేరిన అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ రెండూ రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని, కొత్త ప్రత్యామ్నాయం కోసం వారు ఎదురు చూస్తున్నారన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ఆ శక్తిగా ఎదిగిందని అందుకే అశేష జనవాహిని ఆ పార్టీ వెనక ఉన్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కళ్లు మూస్తే వైయస్ రాజశేఖరరెడ్డి, కళ్లు తెరిస్తే జగన్, ఆయన వెనుక జనవాహిని కనిపిస్తోందని, దీంతో అభద్రతాభావం పెరిగిపోయిందన్నారు.

పార్టీ బలపడింది: సోమిరెడ్డి

     కరుణ, శ్రీకళ చేరికతో నల్లగొండ జిల్లాలో పార్టీ ఇంకా బలపడిందని వైయస్ఆర్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డి అన్నారు. రాజకీయాల్లో జగన్ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారని, అందుకే జనం ఆయన ఉన్నారన్నారు. జగన్ సీఎం కావాలనే ఆకాంక్ష రోజురోజుకూ బలపడుతోందని సంక్షేమ పథకాల అమ లు ఆయన వల్లనే సాధ్యమని భావిస్తున్నారని పేర్కొన్నారు.

Back to Top